నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిన కేంద్రం, కొత్త విద్యుత్తు చట్టం తరహాలో రాష్ర్టాల పరిధిలో ఉన్న నీటి ప్రాజెక్టులన్నింటిని దాని గుప్పిట్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. రెండు రాష్ర్టాల మధ్య నీటి సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ రాష్ర్టాల హక్కులను హరించేలా కేంద్రం.. కృష్ణా, గోదావరీ నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రాలు ఆ బోర్డుల పరిధిలోకి వచ్చినట్లు పేర్కొంది.
గోదావరి, కృష్ణా బేసిన్లో ఉన్న నీళ్లు, వాటిపై ఉన్న ప్రాజెక్టులు, విద్యుత్తు ప్రాజెక్టుల హక్కులన్నీ రాష్ర్టాలవేనని రాజ్యాంగంలోనే పొందుపరచబడి ఉంది. తాజా గెజిట్ ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భద్రతా బలగాల పహారాలో ప్రాజెక్టులపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చూస్తున్నది. గెజిట్ నోటిఫికేషన్ పూర్తిగా ప్రజల ఆకాంక్షలు, నదీ జలాల హక్కులకు వ్యతిరేకంగా ఇవ్వబడింది. బీజేపీయేతర రాష్ర్టాలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలకు గెజిట్ నోటిఫికేషన్ ఒక సాక్ష్యం. తెలంగాణపై కేంద్ర సర్కార్ మరోసారి కక్షను ప్రదర్శిం చింది. నీటి పంపిణీకి పరిష్కారం చూపకుండానే గెజిట్ విడుదల చేసి కేంద్రం తన బాధ్యతలనుంచి తప్పుకోవాలని చూస్తున్నది. మొదటినుంచి తెలంగాణపై వివక్ష ధోరణినే అవలంబిస్తున్న మోదీ సర్కార్, అదే నిజమని మరోసారి నిరూపించుకున్న ది. 70 ఏండ్లుగా రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజలను మరోసారి వంచనచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది.
కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై అధికారం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ర్టానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని పేర్కొన్నది. విభజన చట్టం సెక్షన్-87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, 2020, అక్టోబర్ 5న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది.
గోదావరి బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావటాన్ని కూడా తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరు రాష్ర్టాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయరాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం-1956 మేరకు ఏర్పడిన ట్రిబ్యునల్ తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని కేంద్రం దృష్టికి తెచ్చింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువ 80 వేల క్యూసెక్కులకు విస్తరణ, బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కింద ఉన్న తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్ఆర్బీసీ కాలువల విస్తరణ పనులను ఏపీ చేపట్టిన తర్వాత రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాలపై వివాదాలు తీవ్ర రూపం దాల్చాయి. వీటికి పరిష్కారం చూపకుండా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేయాలని చూస్తున్నది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వినియోగించుకునే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రాజెక్టులకు ఉమ్మడి ప్రభుత్వం కేటాయించిన 967.94 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి అమలుచేస్తున్నది. కృష్ణాజలాల్లో రావలసిన 565 టీఎంసీల వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ. పాలమూరు. డిండి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించమని ట్రిబ్యునల్కు నివేదించింది.
రాష్ర్టాలను సంప్రదించకుండాఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం గర్హనీయం. రెండు రాష్ర్టాల మధ్య వివాదాన్ని.. కేంద్రం అదునుగా తీసుకొని, గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులను అధిపత్యంలోకి తెచ్చుకునేందుకు కేంద్రం గెజిట్ పేర కుట్రకు తెర లేపింది. తెలంగాణ సమాజానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి తేల్చకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. తెలంగాణ అభివృద్ధి విషయంలో అవాకులు, చవాకులు పేలే తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణపట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించాలి. గెజిట్ విడుదలపై ప్రధానిని నేతలు నిలదీయాలి. నీళ్ల వాటా పై కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కారం చూపకుంటే, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
(వ్యాసకర్త: శాసనసభ్యులు, తుంగతుర్తి)
–గాదరి కిశోర్ కుమార్