తెలంగాణ రాష్ట్రం దళిత ప్రగతిలో దేశానికే దిక్సూచిగా మారుతున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో సప్త వసంతాల స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలు సిరిసంపదలతో సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక రంగాల్లో అద్భుత పురోగతి సాధించిన మన తెలంగాణ, నేడు దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత సాధికారత’ దళిత సమాజంలో గుణాత్మక మార్పులకు కారణం కానున్నది.
స్వాతంత్య్రానంతరం ఇప్పటి దాకా అనేకమంది నాయకులు, ప్రభుత్వాలు దళితోద్ధారణ కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించినా అనుకున్నంత ఫలితం రాలేదన్నది వాస్తవం. దళిత కుటుంబాలు నిజమైన ఆర్థిక పురోగతి సాధించకపోవడమే దీనికి సాక్ష్యం. రాష్ట్ర సాధనకోసం పుష్కర కాలం పాటు ఉద్యమం చేసిన కేసీఆర్ ప్రజల సాధకబాధకాలను ప్రత్యక్షంగా చూశారు. దళితుల కష్టాలు, కన్నీళ్ల వెనకున్న కారణాలను విశ్లేషించారు. సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొన్నారు. దళితుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.
‘దళిత్ ఎంపవర్మెంట్’ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని రూ.10లక్షల ఆర్థికసాయం అందించనున్నది. రూ. 1200 కోట్లతో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద కుటుంబాల చొప్పున 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. దళితుల ఆర్థిక సాధికారత కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేయనుంది. దీంతో దళితుల ఆర్థిక స్థితి గతులు సమూలంగా మారనున్నాయి. పరిశ్రమలు నెలకొల్పేందు కు, వ్యాపారాలు ప్రారంభించేందుకు, దళితులు ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబం బాగుపడితే, సమాజం బాగుపడుతుంది. సాధికారత పథకంతో యావత్ దళిత శక్తికి కష్టాల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది.
ఇదొక్కటే కాదు ఎస్సీల ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసం గత ఏడేండ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానం ప్రవేశ పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ రైతులకు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అవకాశం లభించింది. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇస్తున్న ఆసరా పెన్షన్లతో 4,66,167 మంది ఎస్సీలు లబ్ధిపొందుతున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీడీ కార్మికులకు ఇస్తున్న భృతితో 27,034 మంది ఎస్సీలకు మేలుజరుగుతున్నది. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీతో 6,01,024 మంది ఎస్సీలు, విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ తో 2.5 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. చిన్నపాటి వ్యాపారం చేసుకొనే ఎస్సీలకు పూర్తి సబ్సిడీతో రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీలకు 80శాతం సబ్సిడీతో రూ. లక్ష వరకు, 70శాతం సబ్సిడీతో రూ. 2 లక్షలు, 60శాతం సబ్సిడీతో రూ.10 లక్షల వరకు రుణాలిస్తారు. సబ్సిడీ పోగా మిగతాది లబ్ధిదారులు బ్యాంకు ద్వారా పొందాలి. ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకం కింద 1,36,043 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రూ.1,57,222 లక్షలు అందజేసింది. ఇలా అనేక రకాల పథకాలతో, సీఎం కేసీఆర్ దళితుల స్థితి గతులను మార్చడానికి కృషి చేస్తున్నా రు. దళిత పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ కృషి కారణంగా, తెలంగాణ దళిత సమాజం దేశంలోనే ధనిక సమాజంగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు.
–మేడే రాజీవ్సాగర్