వృత్తి ఏదైనా ఎల్లకాలం ఒకే రీతిన కొనసాగటాన్ని సమాజం అంగీకరించదు. కాలానుగుణంగా ప్రతి వృత్తిలోనూ మార్పు ఉండాల్సిందే. అందులోనూ అభివృద్ధి చెందిన ఇంగ్లండ్ లాంటి దేశంలో అది వ్యవసాయరంగం అయినా సరే.. మార్పు అనివార్యం. దశాబ్దాలుగా ఒకేవిధంగా కొనసాగుతున్న వ్యవసాయరంగంలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని రూపొందించి ముందుకుపోతున్నది. వృద్ధ రైతుల స్థానంలో యువ రైతులను ప్రోత్సహించటమే ఈ పథకం లక్ష్యం.
యువరక్తంతో వ్యవసాయరంగంలో జవసత్వాలు నింపేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ‘సామూహిక విరమణ పథకం’ పేరుతో ఓ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీనిద్వారా సంప్రదాయికంగా సాగురంగంలో కొనసాగుతున్న వృద్ధ రైతులను ఆ రంగం నుంచి క్రమంగా తప్పించి, వ్యవసాయ భూములను ఔత్సాహిక యువ రైతులకు అప్పగించేందుకు నిర్ణయించింది. వారి ద్వారా వ్యవసాయరంగంలో కొత్త ప్రయోగాలు జరపాలని భావిస్తున్నది. తద్వారా దేశీయ అవసరాలను తీర్చేలా దిగుబడులను పెంచటంతోపాటు, సాగును ఆధునిక కాలానికి అనుగుణంగా ఒక పరిశ్రమగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. ఈ పథకంలో భాగంగా తమ భూమిని అప్పగించినవారికి పారితోషికంగా లక్ష పౌండ్ల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇది భారత కరెన్సీలో.. రూ.96 లక్షలకు సమా నం. వ్యవసాయాన్ని వీడినవారు ఈ ఆర్థికసాయంతో ప్రత్యామ్నాయ జీవనాన్ని ఎంచుకొనే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత పురాతన సంప్రదాయ వృత్తి వ్యవసాయం. అలాంటి ప్రాచీన, ప్రధానమైన రంగంలో ఎక్కువగా నడివయస్కులు, వృద్ధులే ఉంటున్నారు. బ్రిటన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆ దేశంలో ప్రతి పది మంది రైతుల్లో నలుగురు 65 ఏండ్లకు పైబడినవారే. బ్రిటన్లో సగటు రైతు వయస్సు 59 ఏం డ్లు కావటం గమనార్హం. కీలకమైన వ్యవసాయరంగంలో ఈ పరిస్థితి నెలకొనటంతో.. దీంట్లో మార్పులు తీసుకురావటానికి బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో ‘సామూహిక విరమణ పథకం’ను ప్రారంభించింది. ఇది సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. దీనికోసం అధికారులు ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు. భూములను వదులుకోవటానికి ముందుకొస్తున్న రైతులకు తగు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మొత్తమ్మీద, దీనినొక ఆర్థికపరమైన కార్యక్రమంలా కాకుండా, దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే కార్యక్రమంలాగా ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ విధానం ద్వారా వ్యవసాయరంగంలోకి ఎందరో ఔత్సాహికులు, యువతీ యువకులు కొత్తగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రంగంలో ఉన్నవాళ్లు కొత్త భూములను కొనుక్కొని, వ్యవసాయాన్ని విస్తరించే యోచనలో ఉన్నారు. వ్యవసాయాన్ని బహుళ ప్రయోజనకరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి పరిచేందుకు ఈ కొత్త పథకం దోహదం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘సామూహిక విరమణ పథకం’ కింద కొత్తగా వ్యవసాయరంగంలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వమే భూమిని అందజేస్తుంది. వారికి సూచనలు, మార్గనిర్దేశకత్వం కూడా ఇవ్వనున్నది. మరోవైపు, ఈ పథకం కింద వ్యవసాయం నుంచి తప్పుకునేవారికి తగు రక్షణలు, తోడ్పాటునందించి.. వారి తదుపరి జీవితం అర్థవంతంగా, భద్రంగా ఉండేట్లు చూడటంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ కొత్త పథకంతో బ్రిటిష్ ఆర్థికవ్యవస్థ మీద, ముఖ్యంగా పారిశ్రామిక రంగం మీద ఏ విధమైన ప్రభావం ఉంటుందన్నది ముందే ఊహించి చెప్పటం కష్టం. ఈ పథకంతో వ్యవసాయం నుంచి ఎంతమంది వృద్ధరైతులు తప్పుకొంటారో కూడా చెప్పలేం. వారి జీవితాలపై పడే ప్రభావాన్ని గురించి కూడా ఇప్పుడే ఊహించలేం. ఈ పథకం తర్వాత కూడా రైతులు వ్యవసాయంలో కొనసాగాలనుకుంటే కొనసాగవచ్చు. మొత్తమ్మీద బ్రిటన్ ఒక వినూత్నమైన ప్రయోగానికి నాంది పలికింది. దీని ఫలితాలు సానుకూలంగా ఉంటే.. ఇతర ప్రపంచ దేశాలు కూడా బ్రిటన్ దారిలో నడిచే అవకాశాలు లేకపోలేదు.
-గుర్షన్ భల్లా