తెలుగు చిత్రకళ రంగానికి సంబంధించిన తొలితరం చిత్రకారులైన దామెర్ల రామారావు, భగీరథిల తర్వాత దేశం గర్వించదగిన గొప్ప చిత్రకారుడు పీటీ రెడ్డి. వీరు ముగ్గురూ బొంబాయిలోని ప్రఖ్యాత జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులే అయినప్పటికీ వీరి కళాయానం విభిన్న శైలిలో సాగింది.
దామెర్ల రామారావు కేవలం 28 ఏండ్ల స్వల్పకాలమే జీవించినప్పటికీ తాను నేర్చిన పాశ్చాత్య విధానానికి భారతీయ ఆధ్యాత్మికతను జోడించి తెలుగు చిత్రకళకు ఒక వెలుగును తీసుకువస్తే, భగీరథి ప్రకృతి చిత్రణలో ఆరితేరి విమర్శకులచే ఆంధ్రా టర్నర్గా నీరాజనా లు అందుకున్నారు. ఇక పాకాల తిరుపతిరెడ్డి చిత్రకళలో వినూత్నమైన ప్రయోగాలు చేసి అత్యాధునిక పద్ధతుల ద్వారా చిత్రకళలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో కూడా పేరు గడించారు.
పీటీ రెడ్డి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామంలో 1915 జనవరి 4న పాకాల రమణమ్మ, రాంరెడ్డి దంపతులకు జన్మించారు. నాటి నిజాం పాలనలో రాజభాష ఉర్దూ కావడంతో తెలుగు, ఆంగ్లభాషలకు ప్రాముఖ్యం ఉండేది కాదు. బాల్యంలో పీటీ రెడ్డిని అక్షరాల కన్నా ఆకృతులే ఎక్కువగా ఆకర్షించేవి. ఆయన బొమ్మలపై ఆసక్తి చూపించడం తండ్రికి నచ్చేది కాదు. దీంతో తండ్రికి తెలియకుండా చాటుమాటుగా డ్రాయింగులు వేసేవారు. నాడు మద్రాస్ ప్రభుత్వం నిర్వహించే డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలకు రహస్యంగా హాజరై ఉత్తీర్ణుడు కావడం అతనిలో మరింత ఆత్మవిశ్వాసం నింపింది. ఈ దశలోనే ఉపాధ్యాయుడు అబ్దుల్ సత్తార్ సుభాని ఇచ్చిన ప్రోత్సాహం పీటీ రెడ్డి జీవితాన్ని మార్చివేసింది. ఆయన ప్రోత్సాహంతో 1933లో హైదరాబాద్ చేరుకున్న పీటీ రెడ్డికి దారుల్ ఉలూం హైస్కూల్లో ప్రవేశం లభించింది. ఇదే సమయంలో రెడ్డి హాస్టల్లో జరిగిన ఒక స్కౌట్ కార్యక్రమంలో లార్డ్ బాడెన్ పౌల్ రూప చిత్రాన్ని వేసే అవకాశం లభించిం ది. బొం బాయిలోని చిత్రకళాశాలలో చిత్రకళా విద్యనభ్యసించడానికి స్కాలర్షిప్ కూడా గెల్చుకున్నారు. దీంతో తన కలను సాకారం చేసుకునేందుకు మెట్రిక్యులేషన్ పూర్తి చేయకుండానే రెక్కలు కట్టుకొని బొంబా యి నగరంలో వాలిపోయారు. ఆ రోజుల్లో బొంబా యి, కలకత్తా చిత్రకళాశాలలు యురోపియన్, భారతీ య సంవిధానంలోనే విద్య కొనసాగిస్తున్నప్పటికీ యురోపియన్ కళలనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయ న్న అభియోగం ఉండేది. ఆ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ తన సహజాత విచక్షణ మేరకు తన చిత్రకళా యానాన్ని కొనసాగించారు పీటీ రెడ్డి.
చిత్ర రచన విషయంలో నియమాల కంటే తన అనుభూతి, స్వేచ్ఛలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన పీటీ రెడ్డి విభిన్న రీతుల్లో చిత్రాలను రూపొందించారు. మానవ సంబంధాలను , ప్రకృతితో పెనవేసుకున్న సంగతులను, ఆకలి బాధలను, అలజడులను, సమాజంలోని వికృత రూపాలను, రాజకీయ క్రీనీడలను ఇలా.. సమస్త విషయాలను తన కాన్వాస్పై ప్రతిష్టింపజేసి అన్ని స్థాయిల కళాకారుల మెప్పును పొందగలిగారు. పీటీ రెడ్డి చిత్రాలలో సింహభాగం ఆధునిక రీతికి చెందినవిగానే చెప్పుకోవచ్చు. ఒక సాధారణ సంఘటనను లేదా దృశ్యాన్ని ఫొటోగ్రఫి చేసిన పనిలా కాకుండా తనవైన రేఖలు రంగుల సౌజన్యంతో దృశ్యాన్ని సృష్టించి వీక్షకుడికి ఒక సరికొత్త కళా ప్రపంచాన్ని చూపించారు.
‘కళ ప్రజల కోసం’ అని భావించే పీటీ రెడ్డి తన ఎనభై ఏండ్ల సుదీర్ఘ కళాయానంలో అనితర సాధ్యమైన కృషి తో తెలుగు చిత్రకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ అసమాన ప్రతిభాశాలి 1996 అక్టోబర్ 21 నాడు శాశ్వత రంగుల లోకంలో విలీనమైనప్పటికీ అత ను సృష్టించిన కళా ప్రపంచంలోని రంగుల పరిమళాలు మనకు ఎల్లవేళలా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
వెంటపల్లి సత్యనారాయణ
9491378313