సత్సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు భారతదేశం పెట్టింది పేరు. వాటిని మర్చి పోకుండా భావితరాలకు అందివ్వడంలో పండుగల పాత్ర ప్రముఖమైనది. అలాగే ప్రజల ఆరాట పోరాటాల్లో పండుగల పాత్రకూడా అమోఘమైనది. తెలంగాణ రాష్ట్ర అవతరణలో ‘బతుకమ్మ’ పాత్ర విశిష్టమైనది. తెలంగాణ అనగానే ‘బతుకమ్మ’ పండుగ కండ్ల ముందు కదలాడుతుంది. ఆశ్వయుజమాసంలో తొమ్మిది రోజుల బొడ్డెమ్మ తర్వాత వచ్చే బతుకమ్మ కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తారు.
‘దగా పడ్డ తెలంగాణ దిగ్గున లేచిందిరో భగ్గున మండిందిరో..’ అంటూ అందరూ ఒక్క తాటిపై నిల్చి రాష్ట్రం సాధించడంలో సంప్రదాయ పండగ ‘బతుకమ్మ’ చాలా ప్రముఖ పాత్ర పోషించింది. బతుకమ్మ పండగ తొమ్మిది రోజులు జరుపుకొంటారు. అమావాస్య రోజు బతుకమ్మను మొదటి రోజు ఆడతారు. ఈ రోజు ‘పెత్తరమాస’ అంటరు. సిబ్బి లేదా పళ్ళెం, తాంబాలంలో అడుగున ఆకులు పరిచి, తంగేడు, గునుగు పూలతో పాటు ప్రకృతిలో దొరికే ఇది అది అని కాక ఏ పువ్వయినా బతుకమ్మలో పెర్చుతారు. తీరొక్క పూవుతో వరుసలు వరుసలుగా ఇష్టమైనంత ఎత్తు పేరుస్తారు. దాని పైన గుమ్మడి పూవులోనో, తంగేడు పూలలోనో పసుపు గౌరమ్మను ఉంచి పసుపు కుంకు మ అక్షింతలు వేసి, తమ ముత్తయిదువతనాన్ని నిలిపే గౌరమ్మను భక్తిగా పూజిస్తారు.
ఈ తొమ్మిది రోజులు సాయంత్రం కాగానే యువతులు, మహిళలు, చిన్నారులంతా ముస్తాబై, తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మను తీసుకుని దగ్గరలోని గుడి ప్రాంగణంలోనో, విశాల మైదానంలోనో, చెరువు గట్టు దగ్గరకో వెళ్లి అందరి బతుకమ్మలొక్క దగ్గర పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, బతుకమ్మ ఆడతారు. లయ బద్ధంగా వంగుతూ లేస్తూ చప్పట్లతో తాళం వేస్తూ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. పాటలకు మకుటంగా.. ‘ఉయ్యాల’, ‘కోల్’, ‘వల లో’, ‘గౌరమ్మ’ అంటూ ప్రాసలతో పాడేవాళ్ళకి ఉత్తేజాన్ని, వినేవాళ్ళకి ఉల్లాసాన్ని కల్గిస్తాయి.
మొదటి రోజు ‘ఎంగిలి బతుకమ్మ’ అంటరు. ఒక్కపొద్దుతో బతుకమ్మ పేర్చినా సాయంత్రం బతుకమ్మ ను ఆడేటప్పటికి అందరూ ఎంగిలి పడతారు.. అంటే తింటారు. కాబట్టి దానిని ‘ఎంగిలి బతుకమ్మ’ అంట రు. ఎవ్వరైనా ఒక్క బతుకమ్మనే పేర్చరు. పెద్ద బతుకమ్మకు తోడు చిన్నదైన రెండో బతుకమ్మను పేరుస్తరు. తల్లీ బిడ్డల ప్రేమకు ప్రతిరూపంగా దీనిని చెప్పవచ్చు. తొమ్మిదవ రోజు దుర్గాష్టమి బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటరు. ఈ రోజు చివరి రోజు కనక అందరూ అత్తగారింటికి వెళ్ళే బతుకమ్మకు సద్దులు కట్టి సాగనంపుతరు. ఈ రోజు కొందరు 5 సద్దులు, కొందరు 9, కొందరు 11 సద్దులు చేసి బతుకమ్మకు నైవేద్యం పెడతరు.
మహిళలందరూ ప్రత్యేకంగా సంప్రదాయ సిద్ధమైన దుస్తులు ధరిస్తారు. మహిళలు, యువతులు, చిన్నారులతో ప్రతీ వాడ, ఊరు అందాన్ని సంతరించుకుంటుం ది. బతుకమ్మలను చివరి రోజులో నీళ్ళల్లో ఒలలాడిస్తూ.. ‘హిమవంతునింట్లో పుట్టి, హిమవంతునింట్లో పెరిగి.. కుంకుమ కాయాలిస్తూ, కూర్చుండా కుర్చీలిస్తూ మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మా..’అంటూ పాటలు పాడుతరు. అలాగే.. ‘ఎవ్వరేమన్నా ఎదురాడ బోకు/ మాయమ్మ గౌరమ్మ పోయిరావమ్మా-మల్లో చ్చే ఏడాది మళ్ళీ రావమ్మా/నిదురపో గౌరమ్మ నిదురపోవమ్మా- నిదురాకు నూరేళ్ళు, నీకు వెయ్యేండ్లు/ పాలిచ్చే తల్లికి పట్టి వెయ్యేండ్లు- నినుగన్న తల్లికి నిం డా నూరేండ్లు ..’ అంటూ ఘనంగా వీడ్కోలు పలుకుతారు. మహిళలంతా ఒకరికొకరు పసుపుకుంకుమలు, వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
నామని సుజనాదేవి