రాష్ట్ర అవతరణ తర్వాత అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్న పనుల వల్ల, దేశానికే ఆదర్శప్రాయమైంది. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి వచ్చింది. టీడీపీ అదృశ్యమయ్యే స్థితిలో ఉంటే కాంగ్రెస్ దయనీయ స్థితిలో ఉంది. ఈ పార్టీల పరిస్థితులను ఆసరా చేసుకొని బీజేపీ బలపడాలని చూస్తున్నది.
ప్రతిపక్షాల ఆశల్ని వమ్ము చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తిరుగులేని శక్తిగా ముందుకెళ్తున్నది. ప్రతి ఎన్నిక, ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదని రుజువు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్రెడ్డికి అప్పగించి ఇక తాము అధికారంలోకి వచ్చినట్టేనని కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు భావించటం పగటి కలే. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి టీపీసీసీ అధ్యక్షున్ని మార్చటం కాంగ్రెస్ సంస్కృతి అనే విషయం అందరికి తెలిసిందే.
ఏడేండ్లుగా టీఆర్ఎస్ తెలంగాణను సమగ్రా భివృద్ధి దిశగా పయనింపజేస్తుంటే అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్న ప్రజలు రేవంత్రెడ్డి మాటల్ని నమ్ముతారా? అయితే గియితే తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ పోటీ అవుతుందేమో కానీ టీఆర్ఎస్కు మాత్రం కాదు. టీఆర్ఎస్ లాంటి బలమైన ప్రాంతీయపార్టీ ఉన్నచోట జాతీయపార్టీల పప్పులుడకవు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీలు ఫెడరల్ స్ఫూర్తిని భగ్నం చేసి రాష్ర్టాలపై చూపిన వివక్ష, నిర్లక్ష్యం వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. దేశమంతటా ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్, బీజేపీల కన్నా మెరుగైన పాలన అందిస్తున్నాయి. టీఆర్ఎస్ అయితే కాళేశ్వరం, మెట్రో రైలు, యాదాద్రి, విద్యుత్ సమస్య, రైతుబంధు లాంటి అనేక అద్భుతాలను సాధించింది. వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో గణనీయ అభివృద్ధి సాధించింది. మెరుగైన వైద్యం, ప్రైవేట్రంగంలో ఉద్యోగావకాశాలను మెరుగుపర్చింది. రెసిడెన్షియల్ విద్యాలయాలను వందల సంఖ్యలో పెంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా ఉంటే.. రేవంత్రెడ్డి లాంటి నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటారనుకోవడం హాస్యాస్పదం.
రేవంత్రెడ్డి మూలాలు తెలంగాణ వ్యతిరేక టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో ఉన్నాయి. తన పార్టీ అవసానదశకు చేరుకున్న దశలో తన అనుంగు శిష్యున్ని కాంగ్రెస్లోకి పంపి తమ పనులు చేసుకోవచ్చని చంద్రబాబు ఆలోచన. బాబు కనుసన్నల్లో నడిచే నాయకుడి వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనముంటుంది? రేవంత్రెడ్డి సగర్వంగా తాను ఎన్టీఆర్, రాజశేఖర్రెడ్డి శిష్యుడినని చెప్పుకొంటున్నారు. వాళ్ల మీద ఈగవాలనీయనంటున్నారు. ఈ ఇద్దరు నాయకులు తెలంగాణ వ్యతిరేకులే కదా! తెలంగాణకు చెందిన పీవీ, చెన్నారెడ్డి, కొండాలక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ లాంటి వాళ్లెవరూ ఆయనకు ఆదర్శం కాదు, మార్గదర్శకులు కాదు. వలస పాలకులే ఆయనకు ఆదర్శం.
రాష్ర్టాన్ని దేశ పటంలో సమున్నతంగా నిలబెట్టడం ఆత్మగౌరవం, అస్థిత్వాన్ని కాపాడుతూ పాలన అందిస్తున్న కేసీఆర్కు మాత్రమే సాధ్యం. ఈ విషయాన్ని తెలంగాణలోని ఏ మూలన ఉన్న సామాన్యుడినడిగినా అర్థమవుతుంది. పార్టీ దృక్పథంలో ఏ మార్పులు చేయకుండా తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నీడను టీపీసీసీ అధ్యక్షుడిగా చేసినంత మాత్రాన కాంగ్రెస్కు ఒరిగేదేం లేదు. ఆయనతో నయా పైసా లాభం లేదనే విషయం ప్రజలకు ఎప్పుడో అర్థమైంది. ఆ నిజం త్వరలోనే కాంగ్రెస్కు కూడా అర్థమవుతుంది.
డాక్టర్ కాలువ మల్లయ్య