రాష్ట్ర అవతరణ తర్వాత మనదైన చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక వికాసం గురించి ప్రచురణలు చేపట్టి తెలంగాణ పునరుజ్జీవనంలో తెలంగాణ ‘తెలుగు అకాడమీ’ తనదైన పాత్రను పోషిస్తున్నది. ఈ కృషి మరింత అర్థవంతంగా, సారవంతంగా కొనసాగాలి. అంతర్జాతీయ తెలుగు విజ్ఞాన కేంద్రంగా
తెలంగాణ తెలుగు అకాడమీ రూపొందాలి.
దృశ్య శ్రవణ విభాగం ఏర్పాటు: విద్యాబోధనలో, అధ్యయన, అధ్యాపన రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఆవశ్యకం. ఎందరో మేధావులు, రచయితలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, కళాకారుల కృషి వెలుగులోకి రాకుండాపోవటంతో సామాజికంగా ఎంతో నష్టం జరుగుతున్నది. వారి ప్రతిభా విశేషాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. కాబట్టి భాషా సాహిత్యాలతోపాటు పలురంగాల్లో నిష్ణాతులను ఎంపికచేసి ఆయా రంగాలపై వారి ప్రసంగాలను దృశ్య శ్రవణరూపంలో రికార్డుచేయాలి. విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చి విద్యారంగ వికాసానికి, సామాజిక ఉన్నతికి తోడ్పడాలి.
పదకోశాల నిర్మాణ విభాగం: కేంద్రప్రభుత్వ అధీనంలోని ‘కమిషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ’ అనే సంస్థ సంపూర్ణ ఆర్థిక సహాయంతో ఈ విభాగాన్ని నిర్వహించే వీలున్నది. దీనిలో ప్రధానంగా విద్య, వైద్య, వైజ్ఞానిక శాస్త్ర, సాంకేతిక రంగాలకు, కళలకు సంబంధించిన సంకేత పదాలను తెలుగు భాషలోకి ప్రామాణికమైన పద్ధతిలో అనువదించవలసి ఉంటుంది. తెలుగు అకాడమీ ఇప్పటివరకు 18 సంకేత పదకోశాలను రూపొందించింది. దీనికయ్యే ఖర్చు ఢిల్లీలోని ‘కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ’ భరించింది. ప్రస్తుతం నూతన జాతీయ విద్యావిధానంలో వృత్తి విద్యా కోర్సులను మాతృభాషలో కూడా బోధించాలనే చట్టం చేసినందువల్ల ఇంజినీరింగ్, వైద్య శాస్ర్తాలకు సంబంధించిన సంకేత పదకోశాలను కూడా వెంటనే రూపొందించుకోవాలి. దీనివల్ల ఆయా సబ్జెక్టులను తెలుగులోకి అనువదించడం సులభమవుతుంది.
అధ్యాపకులకు పునఃశ్చరణ తరగతుల నిర్వహణ కేంద్రం: ఇంటర్ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పనిచేస్తున్న అధ్యాపకుల కోసం తెలుగు అకాడమీలో ‘టీచింగ్ అండ్ ట్రైనింగ్’ విభాగం ద్వారా 45 రోజుల ‘సర్టిఫికెట్ కోర్సు’ను ప్రవేశపెట్టాలి. దీనివల్ల అధ్యాపకులు తాము ఎంపిక చేసుకున్న కోర్ పేపర్లో నిష్ణాతులు అవుతారు.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు: తెలుగు భాషా ప్రచారానికి, అవగాహనకు- సాంస్కృతిక, పారిశ్రామిక సంబంధాలు పెంచుకోవడానికి దేశవ్యాప్తంగా తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
తెలంగాణ విజ్ఞాన సర్వస్వం: ఈ పేరుతో ఒక పరిశోధనాత్మక, విశ్లేషణాత్మక, విశిష్ట సంచికను ప్రచురించాలి. గతంలో ప్రచురితమైన ‘కాకతీయ’, ‘రెడ్డి సంచిక’లలాగా తీసుకురావడానికి విద్యావేత్తలతో, పత్రికా సంపాదకులతో ఒక సంపాదక మండలిని ఏర్పాటుచేయాలి. ఈ సంచికలో తెలంగాణ ప్రాంత పుట్టుపూర్వోత్తరాలను పరిశోధనాత్మకంగా వెల్లడిస్తూ, ఈ ప్రాంత సర్వతోముఖ వికాసానికి కారణమైన ప్రధానాంశాలు భాష, సాహిత్యం, చరిత్ర, కళలు, వృత్తులు, సంస్కృతి, ఉద్యమాలు వీటితోపాటు ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయరంగాలు, భౌగోళిక అంశాలపై నిపుణుల చేత సమాచారం సేకరించాలి. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రామాణిక గ్రంథంగా ‘తెలంగాణ విజ్ఞాన సర్వస్వం’ను ప్రచురించాలి.
పీవీ పేరిట పరిశోధన కేంద్రం: ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ శత జయంతి ఉత్సవ ప్రారంభ సందర్భంలో తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతామన్న హామీ తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని కలిగించింది. పీవీ పేరుతో ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేయడం సముచితంగా ఉంటుంది.
ఫెలోషిప్ల ఏర్పాటు: ప్రతిభావంతులైన విద్యావేత్తలకు ఇది ప్రభుత్వం తరఫున ఇచ్చే గౌరవానికి సంబంధించిన అంశం. 2012లోనే తెలుగు అకాడమీ పాలకమండలి ‘తెలుగు అకాడమీ ఫెలోషిప్స్’ ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇదే క్రమంలో కవులను, కళాకారులను వివిధ శాస్ర్తాల్లో నిపుణులైన విద్యావేత్తలను ప్రోత్సహించటానికి, ఎంపికచేసిన అంశాలపై వారితో ఉత్తమ గ్రంథాలను రాయించడానికి రెండేండ్ల కాలపరిమితి గల ‘తెలుగు అకాడమీ ఫెలోషిప్స్’ ఏర్పాటు చేయాలి. దీనివల్ల ‘తెలుగు అకాడమీ’ ప్రతిష్ఠ జాతీయస్థాయికి విస్తరిస్తుంది.
వెబ్సైట్ పునరుద్ధరణ: 53 ఏండ్ల చరిత్ర గల తెలుగు అకాడమీ దాదాపు 4 వేలకు పైగా శీర్షికలతో ప్రామాణిక గ్రంథాలను ప్రచురించింది. ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలుగు అకాడమీ వెబ్సైట్ను పునరుద్ధరించాలి.
10వ షెడ్యూల్ నుంచి తొలగించాలి: ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది తెలుగు ప్రజలున్నారు. వారందరికీ భాషకు సంబంధించి రాజధాని హైదరాబాద్ అయినందున తెలుగు అకాడమీ పరిధిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలి. రాష్ట్ర విభజన సమస్య తెలంగాణ అకాడమీని ఇంకా వదిలిపెట్టలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న కారణంగా తెలుగు అకాడమీ ప్రగతి సాధించడం లేదు. కాబట్టి సంస్థను 10వ షెడ్యూల్ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలి.
తెలుగు భాషా సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో దాదాపు 45కు పైగా దేశాల్లో ఉన్న తెలంగాణ, తెలుగు సంఘాలను కలుపుకొని విశ్వసంస్థగా, అంతర్జాతీయ తెలుగు విజ్ఞాన కేంద్రంగా ‘తెలుగు అకాడమీ’ రూపొందాలి. తద్వారా ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కీర్తిపతాక అవుతుంది. రూ.400 కోట్ల ఆర్థికవనరులు ఉన్న ‘తెలుగు అకాడమీ’.. ఈ ప్రణాళికను అనుసరిస్తే మరో మూడేండ్లలో తన ఆర్థిక వనరులను రూ.800 కోట్లకు కూడా పెంచుకోగలుగుతుంది. తెలంగాణ ‘తెలుగు అకాడమీ’ రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ ముఖ్య విద్యాధార కేంద్రంగా కృషి చేస్తూనే, తెలుగు విజ్ఞాన కేంద్రంగా తన పరిధిని క్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాలి. అప్పుడే అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
(వ్యాసకర్త: పూర్వ ఉపసంచాలకులు, తెలుగు అకాడమీ, హైదరాబాద్)
ప్రొఫెసర్ కె.యాదగిరి