ఆస్తిపాస్తులు లేక, అండగా నిలిచే వారెవరూ లేక అనాదిగా దళిత జాతి.. పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పేదరికాన్ని రూపుమాపకపోగా వారిని మరింత దారిద్య్రంలోకి నెట్టి వేశారు. దళితులను ఓట్లు, సీట్లుగానే భావించారు. కానీ, స్వరాష్ట్రంలో దళితుల విముక్తికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. వాటన్నింటికీ తలమానికం అనదగిన దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి.. దళితులను సంపన్నులను చేసే గొప్ప ప్రయత్నానికి నాంది పలికారు.
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు దళితులవి. అణచివేతలు, అవమానాలు ఎదుర్కొంటూ బతుకు పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులు సాధికారత సాధించినప్పుడే నిజమైన విజయమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ధనవంతులైన దళితులను తెలంగాణలో చూడాలనేది కేసీఆర్ సంకల్పం. దళితులు ఆత్మగౌరవంతో, గుండె ధైర్యంతో బతుకాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పథకమే ‘దళితబంధు’.
‘దళిత బంధు’ అనేది ఒక పథకం మాత్రమే కాదు, దళితుల అభ్యున్నతి కోసం సాగే ఉద్యమం అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఒక దీపం ఇంకోదీపాన్ని వెలిగించినట్టు ఒకరికొకరు పాటుపడే యజ్ఞం ఇది. ఈ వెలుతురు అణగారిన దళితులకు తొవ్వ చూపుతుంది. నాడు అంబేద్కర్ దళిత బహుజన వర్గాల బాగు కోసం కొట్లాడారు. నేడు కేసీఆర్ దళిత బహుజన వర్గాల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ‘దళిత బంధు’ ద్వారా దళితుల్లో పేదరికాన్ని రూపుమాపబోతున్నారు. దళితుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, వారిలో ధీమా పెరిగి తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోగలం అనే భరోసాను కలిగించే ప్రయత్నమే దళిత బంధు. దళితులు కూడా ఈ ధనం వృథా చేయకుండా ఉపాధి, వ్యాపార మార్గాలను అన్వేషించాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా హుజూరాబాద్లో అమలు చేస్తున్నారు. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ, ఇతర ప్రతిపక్ష నాయకులు, కొన్ని సంఘాలు అసత్య ప్రచారాలు చేసి దళితుల్లో గందరగోళాన్ని సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పథకాన్ని స్వాగతించాల్సిందిపోయి అడ్డగోలు విమర్శలు, అసత్య ప్రచారాలు చేయడం ఓర్వలేనితనం. విపక్షాలు అనుసరిస్తున్న ఇలాంటి పద్ధతులను ప్రజలు ఎన్నటికీ హర్షించరు. ఈ పథకం లబ్ధిదారులు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతారు. దళితుల విజయాలే ఈ విమర్శలకు దీటైన జవాబులు.‘అమ్మపెట్టదు అడుక్కోనివ్వదు’ అన్నట్టుగా ఉంది బీజేపీ వాలకం. తెలంగాణ దళితుల కోసం కేంద్రం చేసిన ఒక్క మంచిపని అయినా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పగలరా? ఒక మంచి సహాయాన్ని తీసుకురాగలరా? అది చేతకాదు కానీ అడ్డగోలు వాదనలు, అసత్యాలు, కల్పితాలతో ప్రజలను గందరగోళపర్చటానికి కుటిలయత్నాలు చేయటం గర్హనీయం. ఇలాంటి చేష్టలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి తీరుతారు. ‘దళిత బంధు’తో దళితుల జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్కి మద్దతునివ్వాలి.
‘దళిత బంధు’ను విజయవంతం చేయడం ద్వారా, తెలంగాణ సమాజానికే కాదు దేశంలోని దళిత సమాజాభివృద్ధికి హుజూరాబాద్ దళితులు దారులు వేయాలి. రాజకీయాలకు అతీతంగా దళిత సాధికారత, ఆర్థిక పరిపుష్ఠి సాధించేందుకు కృషిచేయాలి. దళితులు ఉన్నతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ఈ దళిత బంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రూపొందించారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందేవిధంగా, వచ్చిన డబ్బులు వృథా కాకుండా దళితుల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా కార్యాచరణ రూపొందించారు. అట్టడుగు పేదల నుంచి మొదలుకుని ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందుతుంది.
స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. విద్యుత్తు, సాగునీరు, తాగునీరు, సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశం గర్వించే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ విజయవంతంగా అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును కూడా అదే విధంగా అమలు చేస్తారు.
దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో మార్పును తీసుకువస్తుంది. దళితుల బతుకుల్లో కొత్తవెలుగులు నిండుతాయి. ఈ పథకం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడాన్ని బట్టి వారు ఈ కార్యక్రమం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తమ జీవితాలను మార్చే ఈ దళిత బంధు పథకాన్ని దళితులు విజయవంతం చేయాలి. ప్రతీ దళిత బిడ్డ కేసీఆర్కు అండగా నిలువాలి. దళిత జాతిని విముక్తి దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చరితార్థులు. దళిత బంధు అందుకుంటున్న దళితులకు అభినందనలు.
(వ్యాసకర్త: వరంగల్ తూర్పు శాసనసభ్యులు)
నన్నపునేని నరేందర్