చరిత్ర నాయకులను స్మరించుకుంటుంది. వ్యక్తుల వెనుక మరెందరో కనిపించని వ్యక్తులుంటారు. అలాంటి వ్యక్తే ఎస్.ఎల్.గా సుపరిచితులైన ఎస్.లక్ష్మారెడ్డి. ఈయన ఈ నెల 5న క్యాన్సర్తో మరణించారు. సంస్థాన్ నారాయణపురం పక్కనున్న శేరిగూడ లక్ష్మారెడ్డి స్వగ్రామం. 1973లో ఐడీపీఎల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రంలో చేరి ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
విప్లవోద్యమ నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి అజ్ఞాత జీవితం గడిపినప్పుడు వారికి అనుక్షణం సేవలందించిన కొరియర్ ఎస్.లక్ష్మారెడ్డి. 1976 జూలై 28న మారుపేరుతో ఉస్మానియా హాస్పిటల్లో మరణించిన తరిమెల నాగిరెడ్డి పక్కన ఆ రోజు ఉన్న వ్యక్తి లక్ష్మారెడ్డి. సుమారు ఎనిమిదేండ్లు దేవులపల్లికి కొరియర్గా పనిచేస్తూ చాకలి ఐలమ్మను, చరిత్రకారులు బిపిన్చంద్ర వంటి ఎందరో పరిశోధకులను, నన్ను కూడా దేవులపల్లి వద్దకు తీసికెళ్లిండు.
తెలంగాణ చరిత్రను అందుబాటులోకి తేవడానికి లక్ష్మారెడ్డి చేసిన కృషి ఎనలేనిది. పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనని పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ ఆఫీసులో లభించిన సమాచారం ఆధారంగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర రచించారు. రెండో ముద్రణలో సుందరయ్యే స్వయంగా తన పుస్తకంలోని పొరబాట్లను ప్రస్తావిస్తూ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన నేతలు ఆ చరిత్రను రాయాలని కోరారు. ఈ విషయాన్ని పలుమార్లు దేవులపల్లి దృష్టికి తెచ్చి చరిత్ర రచన చేయాలని పట్టుబట్టిన వ్యక్తి లక్ష్మారెడ్డి. ఏ మాత్రం సమయంలేని దేవులపల్లి తన డైరీల ఆధారంగా ఆడియో కేసెట్లలో రికార్డు చేశారు. ఆ కేసెట్లను నా వద్దకు తెచ్చి నేను రాసిన పేపర్లను దేవులపల్లికి ఇచ్చేవాడు. దేవులపల్లి రచించిన ‘తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర’ తెలంగాణలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రపై సాధికార రచనగా పరిశోధకులు పేర్కొన్నా రు. ఈ పుస్తకం రెండోభాగం నేను స్క్రిప్ట్ రాసి 37 ఏం డ్లు దాటింది. తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17 వివాదాస్పదమైన నేపథ్యంలో దేవులపల్లి రచనకు ప్రాధాన్యం ఉంది.
లక్ష్మారెడ్డి మరణానికి కొద్దిరోజుల ముందు ప్రముఖ న్యాయవాది, ఓపీడీఆర్ మాజీ కార్యదర్శి కె.వెంకటరెడ్డి, నేను వారింటికి వెళ్లి మాట్లాడినప్పుడు తన చివరి కోరికను మాతో చెప్పారు. తన బాధంతా ‘దేవులపల్లి పుస్త కం రెండోభాగం వెలుగు చూడాలి’అంటూ కండ్లల్ల నీళ్ళు తెచ్చుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర రెండో భాగాన్ని సెటిలర్లయిన ఇద్దరు పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ‘తొక్కిపెట్టార’ని పలుమార్లు లక్ష్మారెడ్డి నాతో అన్నారు. ఈ రచన వెలుగు చూస్తే తెలంగాణ చరిత్రలోని ‘గ్రే’ ఏరియా (1948-51) వెలితి పూరించబడుతుంది.
దేవులపల్లి పోరాట కాలంలో రచించిన ‘వెట్టిచాకిరి’, ‘ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలు, నల్లగొండ ప్రజల పోరాటం, జనగామ ప్రజల వీరోచిత పోరాటం’ తదితర పుస్తకాలను జయధీర్ తిరుమలరావు సహాయంతో వెలికితెచ్చి పునర్ముద్రించారు. వీటితోపాటు ‘పోరునేల’ ప్రచురణల పేరుతో వెంకటరెడ్డి (అడ్వొకేట్), సత్యనారాయణరెడ్డితో కలిసి దేవులపల్లి రచనలన్నింటిని పునర్ముద్రించి నేటితరానికి అందించారు. లక్ష్మారెడ్డి చేసిన త్యాగాలు దృష్టిలో పెట్టుకొని దేవులపల్లి రచించిన రెండో భాగాన్ని ముద్రించాల్సిన అవసరం ఉన్నది. కీ.శే.లక్ష్మారెడ్డి చివరికోరిక తీర్చాల్సిన బాధ్యత ఆ పార్టీలోని తెలంగాణ నాయకులపై, మద్దతుదార్లపై వుంది. లక్ష్మారెడ్డికి మనమందించే నిజమైన నివాళి ఈ రచనను ముద్రించడమే!
వి.ప్రకాశ్