ఇంద్రవెల్లి చేదు జ్ఞాపకాలను గిరిజన సమాజం ఇంకా మరిచిపోకముందే కాంగ్రెస్ ‘గిరిజనోద్ధరణ’ పేరుతో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. ‘జల్.. జంగల్.. జమీన్..’ నినాదంతో గిరిజనులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై తుపాకులు ఎక్కుపెట్టి మారణకాండను సృష్టించింది. అదే కాంగ్రెస్ నేడు తమ రాజకీయ స్వార్థం కోసం ‘దళిత-గిరిజన దండోరా’ పేరుతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మరోమారు గిరిజన సమాజాన్ని దగా చేసేందుకు కొత్త ఎత్తుగడలకు తెరలేపింది.
గిరిజనుల రక్తాన్ని కండ్లజూసిన కాంగ్రెస్ వారి సమాధుల సాక్షిగా సభ పెట్టడం అంటే వారి త్యాగాలను అగౌరవపరచడమే. గిరిజన పోరాటయోధుడు కుమ్రం భీం స్ఫూర్తితో తమ న్యాయమైన హక్కుల కోసం ఇంద్రవెల్లి, ఉట్నూరు, జైనూరు, నార్నూర్ తదితర ప్రాంతాలకు చెందిన గిరిజన రైతులు 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లి వేదికగా ఒక భారీ సమావేశం ఏర్పాటుకు పూనుకున్నారు. సభకు మొదట అనుమతిచ్చి, చివరి క్షణంలో అనుమతి రద్దుచేశారు. ఇది తెలియని అమాయక ఆదివాసులు ప్రవాహంలా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు కర్కశంగా గిరిజనులపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. పారిపోతన్న వారిని సైతం వెంటాడి, వేటాడి పిట్టల్లా కాల్చిచంపారు. సుమారు 60 మంది గిరిజన వీరులు ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంద్రవెల్లి మారణకాండను జలియన్వాలాబాగ్తో పోల్చా రు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.
గిరిజన బిడ్డల అమరత్వంతో వారి త్యాగాలకు గుర్తుగా ఇంద్రవెల్లి స్తూపమై నిలిచింది. స్తూపం ఏర్పాటును జీర్ణించుకోలేని ప్రభుత్వం ఏటా గిరిజన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలుచేస్తూ సుమారు 33 ఏండ్లపాటు స్వేచ్ఛగా నివాళులర్పించకుండా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించింది. తిరిగి స్వరాష్ట్రంలో 2015 నుంచి స్వేచ్ఛగా నివాళులర్పించేందుకు, వారి త్యాగాలను స్మరించుకు నేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారంలో ఉన్నప్పుడు ఇంద్రవెల్లి త్యాగాలను గుర్తించకుండా అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం కోసమే కప ట ప్రేమను ఒలకబోస్తున్నదని గిరిజనులు ఆగ్రహిస్తున్నారు..
స్వరాష్ట్రంలో దళిత గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన గూడాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్ది నెలనెలా నిధులు కేటాయిస్తున్నది. నిరుపేద దళిత- గిరిజన ఆడబిడ్డల పెండ్లిళ్లకు ‘కల్యాణలక్ష్మి’తో ఆర్థికసాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నది. దళిత- గిరిజనుల గృహావసరాలకు సు మారు 101 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. దళిత- గిరిజన బాలబాలికల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి గురుకులాల ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ‘అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్’ ద్వారా విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తున్నది.
గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. గిరిజనుల సంస్కృతి ఉట్టిపడేలా హైదరాబాద్లో కుమ్రం భీం భవన్, బంజారా భవనాలను నిర్మిస్తున్నది. గిరిజనులకు పౌష్టికాహారం అందించాలని ‘గిరి పోషణ్’ లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల విక్రయానికి గిరిబ్రాండ్ను ప్రారంభించింది. గిరిజన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చెక్ డ్యామ్లు, కుంటల నిర్మాణంతో పాటు గిరి వికాస పథకం ద్వారా బోరుబావులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నది. కొండ ప్రాంతాల్లోని గిరిజన గూడాలకు, చెంచు పెంటలకు సోలార్ పంపుసెట్లను ఏర్పాటుచేసి ‘మిషన్ భగీరథ’ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. ఇలా దళిత-గిరిజన ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఎనలేని కృషిచేస్తున్నది. దోమ తెరలు, మందులు పంపిణీ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ద్విచక్ర అంబులెన్సులను ప్రారంభించింది.
ఏజెన్సీలో పోడు భూముల సమస్య గత పాలకుల నుంచి అనాదిగా సంక్రమించింది. ఇవ్వాళ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను చిత్తశుద్ధితో అమలుచేస్తున్నది. కానీ కాంగ్రెస్ కేవలం రాజకీయ దురుద్దేశంతో, తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వాన్ని విమర్శించటం గర్హనీయం. కాంగ్రెస్ కపట నాటకాన్ని ఆదివాసులు, దళిత బహుజనులు అర్థం చేసుకొని తిప్పికొట్టడం ఖాయం.
(వ్యాసకర్త: టీఆర్ఎస్వీ నాయకులు, కేయూ)
–కొనుకటి ప్రశాంత్