నాకు పదేండ్ల వయస్సున్నప్పుడు సిద్దిపేట గవర్నమెంటు దవాఖాన్ల మా ఇంటి పక్కామెకు ఆడివిల్ల వుట్టిందని తెలిస్తే సూసేటందుకని అమ్మ వోతున్నది. అమ్మ ఎంబడి నేను కూడా వోయిన. ఆమెకు అప్పటికే ఆడివిల్ల. మళ్లా ఆడివిల్ల వుట్టిందని తెలువంగనే ఆమె ఒగేడ్సుడు కాదు.
‘ఏ.. ఊకో పిల్ల.. కొడుకేమన్న బంగారు కొంగు చేపిస్తడా ఏంది? ఇయ్యాల రేపు ఎవ్వలైనా ఒక్కటే. ఇంక చెప్పాల్నంటే ఆడివిల్లలే ఆత్మగల్లోల్లు. అయ్యవ్వను మంచిగర్సుకుంటున్నరు..’ అని పక్కకున్నోళ్లు ఎంతూకోవెట్టినా ఆ తల్లి ఎక్కెక్కి ఏడుస్తనే ఉన్నది. ‘అసలే ఆప్రీషన్ అయిన మనిషి. ఆ ఎక్కిళ్లకు ఏసిన కుట్లు మళ్లా తెగుతయమ్మా.., ఆమెను ఊకోవెట్టుర్రి.., ఆమెకు బరువైతే
నాకియ్యిమనుర్రి నేను సాదుకుంటా..’
డాక్టరమ్మ గద్రాయించింది.
‘అమ్మా..
ఎందుకమ్మా ఆమె ఏడుస్తున్నది. ఆ చిన్న పాప మంచిగ కీకలేస్తున్నది.. కాల్రెక్కలు మంచిగాడిస్తున్నది కదా..? నాక్కూడా అట్లాంటి ఒక్క చెల్లె ఉంటే ఎంత మంచిగుండో..’ అని అమ్మతోని అంటుండంగనే అమ్మ కండ్లు ఎర్రగైనయి. గుడ్ల నిండా నీళ్లూరినయి. అమాంతం గుండెకు అత్తుకున్నది. ఇంటికొచ్చినంక ‘అమ్మా.. దవాఖాన్ల ఎం దుకేడ్సినవే..’ అని అడిగితే తన యాదిని చెప్పుకొచ్చింది. అమ్మ పేరు ఒగ్గు జ్యోతి.
తొల్సూరు కాన్పుల్నే నువ్వు వుట్టినవు. నువ్ వుట్టినంక రెండేండ్లకు మల్సూరు కాన్పుల తమ్ముళ్లిద్దరు అముడాలోల్లు వుట్టిర్రు. ఒక తల్లికి మలికాన్పుల అముడాల కొడుకులు వుడితే ఎంత సంబురముంటదో అనుభవించినోళ్లకే ఎర్కయితది. కానీ నాకా సంబురం ఏడాది కూడా లేదే. తొట్టెల ఏసిన తమ్ముళ్లు ఏడాదైనా ఏసినట్టే ఉన్నరు. వాళ్లలో పెయ్యి కొంత ఎదిగినా బుద్ధి మాత్రం ఎదుగలే. ఆకలేస్తే కనీసం ‘అమ్మా..’ అని పిల్వలేని వాళ్లను సూసుకుంటూ.. నీ కోసం బతుకుతున్ననమ్మా..
అమ్మ కట్టాలకు, కన్నీళ్లకు కామా తప్ప ఫుల్స్టాప్ లేదు. అప్పుడర్థమైంది నాకు. తమ్ముళ్లు ఇగ ఎప్పటికీ నడ్వరని, ‘అక్కా…’ అని ఎన్నడూ పిల్వరని.. వాళ్ల పని కూడా వాళ్లు చేసుకోరని. ఇద్దరూ పుట్టు మానసిక, శారీరక రోగులు. కనీ అమ్మ ఎప్పు డూ వాళ్లను తక్కువజేసి సూళ్లె. నాకన్న ఎక్కువనే సూసుకునేది. పొద్దుపొడిసేయాళ్లకు తానం జేపిచ్చి, ముద్దుగ తయారుచేసేది. ‘ఆకలైతుందమ్మా..’ అని వాళ్లడుగకపోయినా యాళ్లకు అన్నం పెట్టేది. ఏ ఊరికివోయినా పొద్దూకేసరికి ఇంటికి చేరేది. ‘అయ్యో.. ఒక్క రాత్రన్న నిద్ర చెయ్యరాదే జోతి, నీ గోస వోసుకోను వుట్టినారు..’ అని అమ్మమ్మ తమ్ముళ్లను తిడ్తే.. ‘నువ్వేమన్నా మోస్తున్నవానే నా కొడుకులను, ఏమో బాగ తిడ్తున్నవను’కుంటా అమ్మమ్మను తిరిగి తిట్టేది. అట్లా వాళ్లమీద ఈగ వాలకుంట పదారేండ్లు పెంచి పెద్దచేసింది. వాళ్లు మాత్రం ఒక్కనాడన్న ‘అమ్మా..’ అని పిల్సింది లేదు.
2020, మే 26 అద్దుమనాత్రి ఒకటి గొడ్తున్నది. ‘అమ్మా..’ అని తమ్ముళ్లు పిల్సినట్టే మంచాలకెళ్లి లేసుర్కింది. నాకూ తెలివైంది. రోజూ ఇంతే కదా అని మళ్లా పడుకున్న. తెల్లారింది. రోజు పొద్దున్నే ‘స్నేహా..’ అనే అమ్మ పిలుపు ఏడు, ఏడున్నర.. ఎనిమిదైనా ఇంకా ఇనవడ్తలేదు. లేసి అమ్మ కోసం పోతే తమ్ముళ్ల మంచం కాళ్లకట్టుకు తలికాయ ఆని చ్చి పడుకొని ఉన్నది. ‘అమ్మా.. అమ్మా..’ పిలిస్తే ఊ.. లేదు, ఆ.. లేదు. ఐదు, పది నిమిషాలు ఏం అర్థం గాలె. కొద్దిసేపటికి అచ్చిన డాక్టర్ మీ అమ్మ జ్యోతి సచ్చిపోయిందని చెప్పిండు.
సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరుల పొద్దూకేసరికి ‘అమ్మ’ బూడిదై మిగిలింది. తమ్ముళ్లున్నా లేనట్టే లెక్క. బాపు ఒగ్గు కిషన్ సోయి లేని మనిషి. కొడుకు అగ్గివెడితే పున్నామ నరకం తప్పుతదంటరు, కానీ అమ్మకు కొడుకులున్నా లేనికిందే లెక్క. బాపు కిషనే అగ్గివట్టి అమ్మ రుణం తీర్సుకున్నడు. అన్నీ తానై చేసిన ‘అమ్మ’ లేకపోయేసరికి తమ్ముళ్లకు అనాథాశ్రమమే దిక్కయింది. ‘అమ్మ’ లేని ఆ అనాథాశ్రమంలో ఎన్నిరోజులుంటమనుకున్నరో ఏమో.. ఏడాది తిరుగకముందే తమ్ముళ్లు కూడా అమ్మ చెంతకు చేరిర్రు.
చెర్ల నీళ్లు వొయ్యి చెరువెనుక వడ్డట్టు.. జరగాల్సిన గోరం జరిగినంక బాపు కిషన్కు సోయొచ్చింది. అప్పో, సప్పో
జేసి నాకు పెండ్లి చేయాలనుకున్నడు. బాపుకు భరోసా ఇచ్చిర్రు బంధువులు. ఎట్లెర్కయిందో ఏమో.. పట్నంల పన్జేసే కొందరు జర్నలిస్టు అన్నలు తోడవుట్టినోళ్లయి ముందు నిల్సున్నరు. తలా ఇంత చందాలేసుకున్నరు. అమ్మ ఉండంగనే ఖాయమైన పిల్లగాని(హరీశ్)కే
నన్నిచ్చి పెండ్లి చేసిర్రు.
పొయినేడు డిసెంబర్ల సిద్దిపేటల్నే నా పెండ్లయ్యింది. ఆడివిల్ల పెండ్లి చేయాల్నంటే ఎంత కట్టమైతదో నా పెండ్లయినంకనే తెలిసింది. పెట్టువోతలకు, పెండ్లి కర్సులకు ఎంత తిప్పలైతదో ఎర్కయింది. అందుకే నా చిన్నప్పుడు ఆడివిల్ల వుట్టంగనే మా పక్కింటామె పెట్టిన శోకం యాదికొచ్చింది. పెండ్లయ్యినంక ఆర్నెళ్లు కూడా గడవలె, ఓ రోజు బాపు పోన్జేసి ‘బిడ్డా.. కేసీఆర్ సారు కల్యాణలక్ష్మి చెక్కు పం పిండ’ని చెప్పిండు. ఆ చెక్కు తీస్కపొయ్యి బేంకులేస్తే లక్షా నూట పదహార్రూపాలు అకౌంట్ల వడ్డయి. ఆ పైసలతోనే నా పెండ్లికయిన అప్పు దీరింది. ఆ కల్యాణలక్ష్మి చెక్కును చూసినప్పుడు నా పెండ్లికి రాకపోయినా కేసీఆర్, హరీశ్రావు సార్లే నాలుగిత్తులేసి మాకు దీవెనార్థులు ఇచ్చినంత సంబురమైంది. నవ్వలేని నా తమ్ముళ్లు నవ్వినట్టే అనిపిచ్చింది. అమ్మ ఆత్మకు తుర్తయినంత బరాబరైంది.
–గడ్డం సతీష్, 99590 59041