ప్రజాస్వామ్యంలో ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించే పార్టీలు, వాటిద్వారా కొనసాగే పరిపాలన ప్రామాణికమైనది. పార్టీల సిద్ధాంతాలు, విశ్వాసాలు, విలువలే ప్రజల జీవితాల్లో మార్పునకు శ్రీకారం చుడుతాయి. పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టోలనేవి ప్రజల జీవితాల్లో తీసుకొచ్చే నిర్మాణాత్మక మార్పుల పట్ల నేతలకు గల అంకితభావాన్ని, వారి సంకల్పాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి. అధికారం చేతికందగానే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారా లేక వారి స్వప్రయోజనాల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్నారా అన్నది కాలగమనంలో నిరూపితమవుతుంది. కావున ప్రజలు ఒక పార్టీ సైద్ధాంతిక భూమికను లోతుగా అధ్యయనం చేయకుండా అధికారాన్ని అప్పగిస్తే భస్మాసుర హస్తాన్ని నెత్తిపై పెట్టుకున్నట్లే.
రాష్ర్టాలను బీజేపీ ఎప్పుడూ చిన్నచూపుతోనే చూస్తున్నది. రాష్ర్టాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందన్నది అందరూ ఏకీభవించే భావన. కానీ, బీజేపీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ర్టాలు కేంద్రం కనుసన్నల్లో దేబిరించినట్లుండాలని కోరుకొంటున్నది. ఉత్తరాది ఆధిపత్య ధోరణిని దక్షిణాది రాష్ర్టాల మీద రుద్దాలని చూస్తున్నది. భాషా సంస్కృతుల విషయంలోనూ, ఇదే ఆధిపత్య ధోరణి కనబరుస్తున్నది.
తెలంగాణ వరకు వస్తే.. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీల పాలనలో రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ కేంద్రానికి తాకట్టు పెడితే, సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి టీడీపీ తలుపులు బార్లా తెరిచింది. ఈ రెండు పార్టీలూ తెలంగాణను పీల్చి పిప్పిచేసి అధోగతి పాల్జేసిన తీరును మనం చూశాం. తెలంగాణ సాధన కోసమే పురుడు పోసుకొని, తదనంతరం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం సకలశక్తులు ఒడ్డుతున్నది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కోరంగంలో ఆశించిన ఫలితాలను సాకారం చేస్తూ, సమస్త వర్గాల ఆదరాభిమానాలు పొందుతున్నది. ప్రస్తుతం అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు టీఆర్ఎస్ సిద్ధాంతాలను, పాలకుని అంకితభావాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా అధికారం కోసం అర్రులుచాస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎంత ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదో పెరుగుతున్న ధరలు చెప్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దాని పుట్టుక, తాత్వికతలో ఉన్న ప్రమాదకర ఆలోచనలు ఏమిటో సీఏఏ, ఎన్నార్సీ లాంటి చట్టాలతో అనుభవంలో చూస్తున్నాం.
మతోన్మాదంతో సమాజాన్ని రెండుగా చీల్చడమే ప్రస్తుతం బీజేపీ చేస్తున్న పని. ఆ పునాదిపైనే రాజకీయాధికారాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నది. నిజానికి దేశంలోని ప్రజలందరూ ఏ పార్టీ మద్దతుదారులైనా రామున్ని కానీ, మరో దేవున్ని కానీ గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. కానీ బీజేపీ మాత్రం రామునికి తామే వారసులం అన్నట్లు పేటెంట్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నది.
నిజానికి రాజకీయాల్లోకి మతం చొచ్చుకరావడమే రాజ్యాంగ విరుద్ధం. మన దేశం భిన్నమతాల వేదిక. భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఆ బహుళత్వ భావనను కాపాడుకున్నప్పుడే దేశంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఒకనాడు ‘హిందుత్వం అంటే మతం కాదు. అది ఒక జీవన విధానం’ అని చెప్పుకొన్న బీజేపీ ఇప్పుడు.. ‘మాది హిందుత్వ పార్టీయే, మెజారిటీ ప్రజలైన హిందువుల కోసమే మేం పనిచేస్తాం’ అని బాహాటంగానే ప్రకటిస్తున్నది. దశాబ్దాలుగా లౌకిక ప్రజాస్వామికశక్తులు శ్రమించి నిర్మాణం చేసిన సెక్యులర్ భావనను, నేడు పనికిరానిదిగా ప్రచారం చేస్తున్నారు. జాతీయవాద ఉద్వేగాలను రెచ్చగొడుతూ మైనారిటీలు, ప్రగతికాముకులపై దాడులు చేస్తూ ఫాసిస్టు ధోరణులను అవలంబిస్తున్నారు.
అధికారం కోసం ఎన్నో ఏండ్లుగా కలలు గన్న బీజేపీ అధికారంలోకి రాగానే తన అసలు రూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. దాని స్వతఃసిద్ధమైన అన్యమత వ్యతిరేకతను అన్నివిధాలా ప్రదర్శిస్తున్నది. సీఏఏ, ఎన్ఆర్సీలను తెరమీదికి తెచ్చింది. నల్లధనాన్ని బయటకుతెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. నోట్ల రద్దు ద్వారా సామాన్య జనం వీధిలో పడేట్లు చేసింది. ఉద్యోగాల ఆశచూపి అధికారం అందగానే ఆ మాట మరచిపోవడమే కాకుండా, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో బలవంతపు ఉద్యోగ విరమణలు చేయించింది. ఉన్న ఉద్యోగాలు ఊడబెరికింది. అనేక ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి కార్మికులను, ఉద్యోగస్థులను రోడ్డున పడేసింది. ఇండియన్ ఎయిర్లైన్స్, భారత్ పెట్రోలియం, రైల్వే మార్గాలు, ఎల్ఐసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్పరం చేస్తున్నది. దేశ సంపదను ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్తూ.. జాతీయత, దేశభక్తి గురించి రాగాలు తీస్తున్నది. ఈ క్రమంలో బీజేపీ తీసుకుంటున్న చర్యలన్ని భారత ఆర్థికరంగాన్ని కుదిపేసే ప్రతికూల చర్యలే!
రాష్ర్టాలను బీజేపీ ఎప్పుడూ చిన్నచూపుతోనే చూస్తున్నది. రాష్ర్టాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందన్నది అందరూ ఏకీభవించే భావన. కానీ, బీజేపీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ర్టాలు కేంద్రం కనుసన్నల్లో దేబిరించినట్లుండాలని కోరుకొంటున్నది. ఉత్తరాది ఆధిపత్య ధోరణిని దక్షిణాది రాష్ర్టాల మీద రుద్దాలని చూస్తున్నది. భాషా సంస్కృతుల విషయంలోనూ, ఇదే ఆధిపత్య ధోరణి కనబరుస్తున్నది. ఆర్థిక విషయాల్లోనైతే, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా రాష్ర్టాల నుంచి పొందిన ఆదాయంలోంచి, రాష్ర్టాలకు న్యాయంగా దక్కాల్సిన వాటా నిధులను కూడా మంజూరుచేయడం లేదు. తెలంగాణ విషయంలో ఈ వివక్ష మరింత ఎక్కువగా ఉన్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు రూ.25 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనలు తుంగలో తొక్కి ఒక్క రూపాయి కేటాయించకపోవటం బీజేపీ వివక్షకు నిదర్శనం.
రాష్ట్ర పునర్విభజన అంశాలు, హక్కుల ప్రకారం తెలంగాణకు దక్కవలసిన బయ్యారం ఉక్కు కర్మాగారం దక్కకుండా చేశారు. ఐటీఐఆర్ రాష్ర్టానికి రాకుండా అడ్డుకున్నా రు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, కొ త్తగా ఏర్పడిన జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఒక్కటీ మంజూరు చేయలేదు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డికి గానీ జాతీయహోదా ప్రకటించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని బేఖాతరు చేశారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అనేక వినూత్న విప్లవాత్మక పథకాల ఫలితాలను చూసి కూడా, కేంద్రం కనీస నిధులను విడుదల చేయకపోవటం గర్హనీయం. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికరంగాల్లో తెలంగాణ పట్ల బీజేపీది మొదటి నుంచి వివక్షా పూరితమే. రాష్ట్ర సాధనోద్యమ సందర్భంలో కూడా ఒక అనివార్యత నుంచి మద్దతు పలికారే తప్ప నిజమైన ప్రేమ ఉండి కాదు. ఎందుకంటే తెలంగాణ వచ్చినంక మోదీ ‘తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు’ అని కపటపూరితంగా మాట్లాడారు. దీన్నిబట్టే తెలంగాణ పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ అర్థమవుతున్నది.
ఇప్పుడు బీజేపీ చూపు తెలంగాణ మీద పడింది. అసత్య ప్రచారాలతో తెలంగాణలో పాగా వేయాలని తెగ ఆరాటపడుతున్నది. అధికారం కోసం మతాల మధ్య మత కలహాల మంటలు రేపి చలిమంట కాచుకోవటానికి తెగిస్తున్నది. అన్ని మతాలు, ప్రాంతాల ప్రజలు తెలంగాణను ఒక సురక్షిత ప్రాంతంగా భా వించి ప్రశాంతంగా జీవిస్తుంటే, మతాన్ని అడ్డం పెట్టుకొని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నది.
గంగాజమున తెహజీబ్ సహజీవన సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో మతవాద బీజేపీ కుట్రలు సాగవు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మతకలహాలు కనిపించకుండాపోయాయి. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ వినూత్న పథకాలెన్నింటినో ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పాగా వేయటానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. దివాలాకోరు ఆలోచనలు, దిగజారుడు భాషతో విమర్శలు చేస్తూ ప్రజలను గందరగోళపరచాలని చూస్తున్నది. కానీ, తెలంగాణ సమాజం అనేక ఉద్యమాలతో రాటుదేలింది. ఫాసిస్ట్ ధోరణులనెన్నింటినో ఎదిరించి పరిణతి చెందింది. బీజేపీ దుష్ట పన్నాగాలను పసిగట్టలేని అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. కర్రుగాల్చి వాతపెట్టే సోయి ఉన్న తెలంగాణ ప్రజలు కుట్రల గుట్టు విప్పే గుణమున్న విజ్ఞులు. హుజూరాబాద్ ఉప ఎన్నికను విశ్లేషిస్తే.. నమ్మకాలు వమ్మయిన, విశ్వసనీయతను పాతరేసిన పరిణామాలుగా చెప్పుకోవచ్చు. తనను తాను అధినేతకు ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని పార్టీకే ద్రోహం తలపెట్టిన పరిణామానికి నిదర్శనం. అక్రమార్జనకు అలవాటు పడి అవినీతికి తెరదీసిన వక్రబుద్ధికి ప్రతిఫలనం.
నిఖార్సయిన ఆత్మగౌరవం గలవాడే ఈటల అయితే.. తనమీద వచ్చిన ఆరోపణల నిజాలు నిగ్గుతేలేవరకు పార్టీని వీడకుండా, నిజాయితీని నిరూపించుకోవాల్సింది. అలాకాకుండా, ఆరోపణలు రాగానే పార్టీని వీడి, మరో పార్టీలో చేరడమంటే విశ్వాస ఘాతుకమే. పార్టీ అంటే తల్లి లాంటిది. విలువలకు కట్టుబడి ఉండే ఏ రాజకీయ నాయకుడైనా దీన్ని దృష్టిలో ఉంచుకుంటాడు. విభేదించే విషయాలున్నా హుందాగా వ్యవహరిస్తారు. కానీ ఈటల పూర్తి స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఏ విలువలు, ధర్మానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకొంటున్నాడో, వాటిని తుంగలో తొక్కి చౌకబారు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తనను తాను దిగజార్చుకుంటున్నాడు.
దోషులే ధర్మాత్ముల వేషాలు వేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలే ప్రాథమ్యాలు గల పార్టీలే నీతిబోధలు వల్లిస్తున్న పరిస్థితి ఉన్నది. రైతులను కండ్లల్ల వెట్టుకొని కాపాడుతున్నదెవరో ప్రజలు ఆలోచించాలి. రైతులను రోడ్డుపాలు చేసి, చీమల్లాతొక్కి చంపుతున్నదెవరో చూడాలి. అలాగే.. మత సామరస్యానికి పాదులు వేస్తున్నదెవరు? మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదెవరు? ఉపాధి కల్పనలో పలువురి ప్రశంసలు పొందుతున్నదెవరు? ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదెవరు? ప్రాజెక్టుల కోసం ప్రాణమొడ్డి పాటుపడుతున్నదెవరు? వాటికి సహకరించక అడ్డుపుల్లలేస్తున్నదెవరు? పేదరికంలో మగ్గే ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక పథకంతో ఆదుకుంటున్న ఆపద్బాంధవులెవరు? ఎవరు సంపదను పెంచి ప్రజల పరం చేయాలని ప్రయత్నిస్తున్నారు? ప్రజల సొమ్మును కార్పొరేట్ మారాజులకు కట్టబెడుతున్నదెవరో ప్రజలకు తెలియంది కాదు.
ఇప్పుడు కావాల్సింది ప్రజలను కండ్లల్ల వెట్టుకొని కాపాడే నాయకుడు. తల్లి కోడిలా పిల్లల్ని రక్షించే పార్టీ. ఈ మట్టి ఆరాటాలు, పోరాటాలు తెలుసుకొని అమలుచేసే ప్రజారంజక విధానాలు కావాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరికీ తాకట్టు పెట్టని దమ్మున్న నాయకత్వం కావాలి. అలాంటి టీఆర్ఎస్ నాయకత్వమే ఇప్పుడు తెలంగాణకు కావాలి. ఆ నాయకత్వాన్నే అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్నుకోవాలి. ఇప్పుడు హుజూరాబాద్ ప్రజల ముందున్నది ఇదే.
నారదాసు లక్ష్మణ్రావు
(వ్యాసకర్త : రాష్ట్ర శాసనమండలి సభ్యులు)