ట్రెండ్ మారింది. ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారో.. ఆ సోషల్ మీడియానే నేడు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఎదురు తిరిగింది. అక్కడినుంచి ఒక్క మాట అంటే ఇక్కడి నుంచి వంద మాటలు వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఒక్క ఫొటో వస్తే.. ఇక్కడి నుంచి వంద ఫొటోలు మోదీ పాలన వైఫల్యాన్ని దేశ ప్రజానీకం ముందుంచుతున్నాయి. ‘స్టెప్ డౌన్ మోదీ’ (గద్దె దిగు మోదీ), ‘రిజైన్ మోదీ’ (రాజీనామా చెయ్! మోదీ), ‘బై బై మోదీ’ (మోదీకి వీడ్కోలు) వంటి నినాదాలు ట్విట్టర్లో ఇటీవల కేవలం వారం పదిరోజుల్లో హోరెత్తి ట్రెడింగ్లో నెంబర్ వన్ అయ్యాయి. ఢిల్లీ అబద్ధాల కోటను వణికిస్తున్నది ఈ ప్రతిదాడి.
ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధాన స్రవంతి మీడియా బీజేపీకి, ముఖ్యంగా మోదీ స్వామ్యానికి భయపడ్డా.. సోషల్ మీడియా మాత్రం మోదీ మాయాజాలాన్ని ఎండగడుతున్నది. ఆయన వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లటంలో సఫలీకృతమవుతున్నది. ఇటీవల మోదీకి వ్యతిరేకంగా రెండు హ్యాష్టాగ్లు దేశవ్యాప్తంగా గంటల వ్యవధిలో నం.1 ట్రెండింగ్లోకి వచ్చిన అంశాన్ని బేరీజు వేసుకుంటే.. మోదీ ఒక్కరోజు కూడా ప్రధానిగా కొనసాగేందుకు అర్హుడు కాదని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియాలో డిజిటల్ మీడియాపై సర్వాధికారాలు తమవేనని విపక్షాలపై ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలపై బురదచల్లి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు చేశారు మోదీ అనుయాయులు. అబద్ధాలనే ప్రచారంగా మలిచి, ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీని నడిపి.. మరోవైపు దేశంలో సత్యహరిశ్చంద్రుల వారసులం తామే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కానీ, అదే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా నేడు తిరగబడింది. నిజాలను గ్రహించింది. మోదీ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతున్నది. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సామాన్యులకు వాస్తవాలు అందించే ప్రయత్న చేస్తుండటం ముదావహం.
అదానీ కోసం మోదీ జరుపుతున్న అధికార దుర్వినియోగాన్ని సోషల్ మీడియాలో కళ్లకు కడుతున్నట్లు తెలియజేస్తున్నారు. అగ్గువకు మన దగ్గర లభించే బొగ్గును కాదని, అదానీ బొగ్గును రాష్ర్టాలకు అంటగట్టడం నుంచి, అతడికి ఆర్థిక లబ్ధి కలిగించటం కోసం విదేశీ ప్రభుత్వాలపై మోదీ ఏ విధంగా ఒత్తిడి తెస్తున్నారో వెల్లడిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. శివసేనను నిట్టనిలువునా చీల్చిన వైనంపై నెటిజన్లు దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో వెన్నుపోటు పొడిచి హత్య చేసిన ఉదంతాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. బ్యాంకులను కొల్లగొట్టిన బడా గజదొంగలను దేశ సరిహద్దులు దాటించిన ఉదంతాన్ని, డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణాన్ని, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని, ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకాన్ని సోషల్ మీడియా చీల్చి చెండాడుతున్నది.
ఇన్నాళ్లు తన వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలను గ్లోబల్ ప్రచారం చేసిన బీజేపీ, ఇప్పుడు కక్కలేక మింగలేక మిన్నకుండిపోతున్నది. కండ్లముందు కనిపించే వైఫల్యాలను కప్పిపుచ్చి, వాట్సాప్ వర్సిటీ సాయంతో అబద్ధాలను నిజం చేస్తూ పబ్బం గడుపుకొంటున్న మోదీ సర్కారును ఇవ్వాళ అదే సామాజిక మాధ్యమాలు నిగ్గదీస్తున్నాయి. దీనివల్లే ‘స్టెప్ డౌన్ మోదీ’ (గద్దె దిగు మోదీ), ‘రిజైన్ మోదీ’ (రాజీనామా చెయ్! మోదీ) వంటి నినాదాలు ట్విట్టర్లో హోరెత్తి ట్రెడింగ్లో నెంబర్ వన్ అయ్యాయి. ఇది జరిగిన వారం రోజులకే మరోసారి నెటిజన్లు మళ్లీ విజృంభించారు. ‘బై బై మోదీ’ (మోదీకి వీడ్కోలు) హ్యాష్టాగ్ సంచలనం సృష్టంచింది. దేశవ్యాప్తంగా ఒక అంశం నం.1గా ట్రెండింగ్లోకి వచ్చిందంటే… జనం దాని గురించి అంతగా ఆలోచిస్తున్నారని అర్థం. ఇవాళ మోదీ అప్రజాస్వామ్య పాలనపై మీడియా కంటే ముందుగా సామాజిక మాధ్యమాలే ఎక్కవగా స్పందిస్తుండటం గమనార్హం.
శ్రీలంక పార్లమెంట్ను మోదీ, అదానీ ‘స్నేహబంధం’ కుదిపేసిన నేపథ్యంలో అదానీ కోసం మోదీ జరుపుతున్న అధికార దుర్వినియోగం బట్టబయలైంది. ఇద్దరి మధ్య ఉన్న దోస్తీ లెక్కలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ప్రధాని హోదాలో మోదీ ఏ దేశానికి వెళ్లినా అదానీ, అంబానీల కోసం ఏదో ఒక ఒప్పందం చేసుకోకుండా తిరిగిరాలేదు. దక్షిణకొరియా ప్రధానితో మోదీ భేటీ ఫలితంగా అదానీ కంపెనీకి రూ.37,500 కోట్ల విలువైన ప్రాజెక్టు లభించింది. ఆస్ట్రేలియా వాణిజ్యశాఖ మంత్రితో మోదీ భేటీ ఫలితంగా అదానీ బొగ్గు గనులకు ఆస్ట్రేలియాలో లైన్ క్లియరయ్యింది. మోదీ ఫ్రాన్స్ పర్యటన అనంతరం అనిల్ అంబానీకి భారీ ప్రయోజనం కలిగించేలా రాఫెల్ డీల్ మారిపోయింది. ఇలా చెప్పుకొంటూపోతే… 25కు పైగా దేశాల్లో మోదీ, అదానీ, అంబానీ వ్యాపారబంధం బలపడినట్లు తేలుతున్నది. అంతెందుకు తెలంగాణలో లభించే నాణ్యమైన బొగ్గును పక్కనపెట్టి అదానీ బొగ్గును కొనాలని అధికారికంగా కేంద్రం నుంచి హుకుం జారీ చేశారంటే దేశాన్ని ఎలా అమ్ముకుంటున్నారో అర్థమవుతున్నది.
ఇక ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన అంశాల్లో మోదీ తన సొంత స్వామ్యాన్ని అమలుపరుస్తున్నారు. తొమ్మిది రాష్ర్టాల్లో కనీస మెజారిటీ లేకపోయినా అధికారాన్ని చేజిక్కించుకున్న వైనాన్ని ఇటీవలి మహారాష్ట్ర ఘటనతో సోషల్ మీడియా బట్టబయలుచేసింది. మోదీ పాలనలోని అవినీతిపై, నియంతృత్వంపై నెటిజన్లు మరింత కదం తొక్కాల్సిన అవసరం ఉన్నది.
ఏది నిజం.. ఏది అబద్ధమో గ్రామీణ భారతానికి తెలియజేయాల్సి ఉన్నది. ఈ దేశ యువత, రైతాంగం, నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్న బీజేపీ అరాచకాలపై, అబద్ధాల ప్రచారాలపై ఇంటింటా చర్చ జరగాలి. ఇది సాధ్యం కావాలంటే, తె లంగాణ ఉద్యమంలో జెండా పట్టి కదిలినట్టే.. ఇప్పుడూ భావజాల వ్యాప్తి జరపాలి. మారుమూల గ్రామాలకు వెళ్తున్న ప్రభావవంతమైన సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి. బీజేపీ, మోదీ సర్కారు దేశ వినాశకర విధానాల నుంచి దేశా న్ని, దేశ ప్రజాస్వామ్యాన్నీ పరిరక్షించుకోవాలి. అందుకు అందరమూ చేయిచేయి కలిపి కదం తొక్కాలి.
వెంకట్ గుంటిపల్లి
94949 41001