కరోనా మహమ్మారి కారణంగా సుమారు రెండేండ్లు దేశవ్యాప్తంగా బడులు సక్రమంగా కొనసాగలేదు. ఈ మధ్యనే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంలో.. పిల్లల ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం.. మన దేశంలో పిల్లలు ముఖ్యంగా మూడు నుంచి తొమ్మిదేండ్ల వయస్సు గల పిల్లలు వయస్సుకు తగిన బరువు, ఎత్తు లేకుండా, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
పిల్లలంటే దేశ భవిష్యత్తు. వారితోనే దేశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి, వారు ఇటువంటి తీవ్రమైన ఆరోగ్యమైన సమస్యలను ఎదుర్కోవటం దేశానికి ఎంతమాత్రం క్షేమకరం కాదు. ఈ సమస్యను పరిష్కరించటానికి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో విద్యార్థుల చేరికను ప్రోత్సహించటం కూడా ఈ పథకం ఉద్దేశం. మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థుల చేరిక అయితే పెరిగింది కానీ.. వారిలో ఆరోగ్య సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. పౌష్టికాహారలోపం కారణంగా వయస్సుకు తగిన బరువు, ఎత్తు, ఎదుగుదల లేకుండా ఉన్న చిన్నారుల సంఖ్య అలాగే ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. అంటే కేవలం మధ్యాహ్న భోజన పథకంతోనే పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తొలగించలేమని అర్థమవుతున్నది.
ఈ సమస్యను తీర్చటానికి ఉన్న ప్రత్యామ్నాయం.. మధ్యాహ్న భోజన పథకంలో పాలను కూడా చేర్చటమే. అనేక పోషకాలు, విటమిన్లతో కూడిన పాలతో పిల్లల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, పుదుచ్చేరి, గుజరాత్లలో పాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చిన్నారులకు అందజేస్తున్నారు. అనేక రంగాల్లో పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో కూడా ఇది అమలైతే బాగుంటుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. బడి పిల్లలు భోజనం చేయటానికి మూడున్నర గంటల ముందు పాలను అందించాలి. వారి జీర్ణవ్యవస్థ సరిగా పని చేయటానికి ఇది అవసరం. ఈ విధంగా పాలను అందించటం వల్ల భవిష్యత్ తరాల ఆరోగ్యం బాగుపడటమే కాదు.. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఇది దోహదపడుతుంది. పాడి పరిశ్రమలో మహిళల పాత్ర కీలకం కాబట్టి.. గ్రామీణ మహిళలు మరింత సాధికారత పొందటానికి వీలవుతుంది. పశు సంపద పెరగటం వల్ల.. అవి వేసే పేడ ద్వారా భూసారం పెరుగుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు పథకం కూడా బడిపిల్లలకు పాలను అందించే లక్ష్యానికి చక్కగా తోడ్పడుతుంది. దళితబంధు లబ్ధిదారుల కు ప్రభుత్వం సూచించిన వ్యాపారాల్లో ‘డెయిరీ ఫాం’ ఒకటి. దీనిని చాలామంది ఎంపిక చేసుకుం టున్నా రు. ఈ మేరకు దళితులు విరివిగా ‘డెయిరీ ఫాం’లను నెలకొల్పేలా చూసి.. అక్కడ ఉత్పత్తి అయ్యే పాలను ప్రభుత్వమే కొని విద్యార్థులకు అందించవచ్చు. తద్వా రా అటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అరికట్టవచ్చు.. ఇటు దళితబంధు లబ్ధిదారులకు కచ్చితమైన మార్కెట్ను కల్పించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, దాదాపు యాభై శాతం పాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటు న్నాం. బడిపిల్లలకు పాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే.. రాష్ట్రంలో పాల ఉత్పత్తీ పెరుగుతుంది.
-టి.విజయేందర్రెడ్డి
పావు లీటరు పాలలో ఉండే పోషకాలు
కార్బోహైడ్రేట్లు 5%
ప్రోటీన్లు 8%
కొవ్వులు 16%
విటమిన్ ఏ 19%
విటమిన్ డీ 24%
కాల్షియం 29%
ఐరన్ 0.3%