‘వస్తున్నారు, వస్తున్నారు కొత్త బిచ్చగాళ్లు’ అని మొదలుపెట్టాలనుకున్నాను. కానీ ‘వచ్చారు, వచ్చారు కొత్త బిచ్చగాళ్లు’ అని మార్చక తప్పడం లేదు. ఏ టైములో, ఎటుచూసినా కొత్త బిచ్చగాళ్లే కన్పిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ టైం నుంచి డిన్నర్ వేళ వరకు వాళ్లు విరామం లేకుండా ఊరంతా తిరుగుతున్నారు ‘అమ్మా, అయ్యా! మీ కడుపు సల్లగుండ’ అంటూ వరాలు, దీవెనల వర్షం కురిపిస్తున్నారు. వారికి చరిత్ర తెలియదు, వారు చరిత్ర నిర్మాతలు కారు. వారు ఉద్యమాల్లో పాల్గొనలేదు. వారికి ఉద్యమాల అనుభవం లేదు. తెలంగాణ చరిత్ర గురించి ఈ కొత్త బిచ్చగాళ్లకు తెలిసింది శూన్యం. అయ్యో, వీళ్లకు మిడిసిపాటు ఎక్కువ.
నిజానికి, తన పాలన చివరిరోజుల్లో మతోన్మాదాన్ని నియంత్రించలేని 7వ నిజాం స్వయం కృతాపరాధంతో ఆ మతోన్మాదానికి గురయ్యారు. 7వ నిజాం రాజు చివరిరోజుల్లో బహద్దూర్ యార్ జంగ్ ప్రసంగాల తీవ్రతతో హైదరాబాద్ సంస్థానంలో మతోన్మాదులు చెలరేగినారన్నది చారిత్రక సత్యం.
‘తరతరాల బూజు మా నిజాం రాజు’ అని మన మహాకవి దాశరథి అక్షర శస్ర్తాలు ఎక్కుపెట్టిన నిజాం రాజును అప్పటి భారత ప్రభు త్వం పోలీస్ చర్య అనంతరం (ఆపరేషన్ పోలో త ర్వాత) గవర్నర్ పదవికి సమానమైన (విముక్త హైదరాబాద్ సంస్థానానికి) ‘రాజ్ ప్రముఖ్’ పదవిలో ని యమించింది. భారత ప్రభుత్వంలో అప్పుడు ఉప ప్రధానిగా ఉండి హోంశాఖ నిర్వహిస్తున్నది సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ (ఇప్పుడు కొత్త బిచ్చగాళ్లకు ఆరాధ్య నాయకుడు). ప్రధాని జవహర్లాల్ నె హ్రూ ఒక వంక తటపటాయిస్తుండగా పోలీసు చర్య విషయంలో ఉప ప్రధాని పటేల్ కీలకపాత్ర నిర్వహించారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని కొత్త బిచ్చగాళ్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సుప్రసిద్ధ ఫ్రెంచి సంపాదకుడు మెండెస్ ప్రధాని జవహర్లాల్ నె హ్రూను ఇంటర్వ్యూ చేస్తూ ‘మీ దేశంలో ఇప్పుడు ప్రధాన పరిశ్రమ ఏది?’ అని ప్రశ్నించారు. ‘కువిమర్శ’ అని నెహ్రూ టక్కున జవాబిచ్చారు.
‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత్వం’ వంటి నినాదాలు రోజుకు కనీసం ఒక డొల్ల, శుష్క నినాదం వినిపించి విపరీత ప్రచారం పొందుతున్నప్పటికీ, ఇప్పటికీ ‘కువిమర్శ’ భారీ పరిశ్రమగా కొనసాగుతున్నది. కానట్లయితే కుమ్రం భీంకు, రామ్జీ గోండ్కు రజాకార్లతో ముడిపెట్టేవారు కాదు కొత్త బిచ్చగాళ్లు! కుమ్రం భీం, రామ్జీ గోండ్ ఎప్పటివారు, రజాకార్లు ఎప్పటివారన్న వివేచన ఉండొద్దా? ఎప్పుడో వందేండ్ల తర్వాత రంగంలోకి వచ్చిన రజాకార్లు వందేండ్లు వెనుకటి కుమ్రం భీంతో, రామ్జీ గోండ్తో పోరాడినారా? పొద్దు తెలియని కొత్త బిచ్చగాళ్లకు చారిత్రక పరిజ్ఞానం శూన్యమని స్పష్టమవుతున్నది. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణరెడ్డి తదితరుల నాయకత్వంలో కొనసాగిన ఆంధ్ర మహాసభ ఉద్యమాల ప్రధాన లక్ష్యం తెలంగాణ సామాజిక అసమానతల తొలగింపు.. నిజాం పాలన నిర్మూలన కాదు.
ఆ తర్వాత జరిగిన తెలంగాణ సాయుధ పోరాట ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయం. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నేతల్లో మఖ్దూం మొహియుద్దీన్ ఒకరు. ఫ్యూడల్ వ్యవస్థ రద్దు, దున్నే వారికే భూముల పంపిణీ కూడా ప్రధాన లక్ష్యాల్లో భాగం. కనుకనే సాయుధ పోరాటం ముగియగానే గాంధేయవాది వినోబా భావే భూదాన యజ్ఞం ప్రారంభించారు. మాజీ ప్రధాని పీవీ కొన్ని రోజులు వినోబా భావే భూదాన పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కాగానే పీవీ భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టారు. బూర్గుల రామకృష్ణారావు కూడా ముఖ్యమంత్రి కాగానే భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టారు. పీవీ, బూర్గుల ఇద్దరూ తెలంగాణ బిడ్డలు. తెలంగాణ చరిత్ర, ఇక్కడి ప్రజల సమస్యలు వీరిద్దరికి బాగా తెలుసు. వీరిద్దరు కేవలం నినాదాలతో సంతృప్తిపడేవారు కాదు.
కొత్త బిచ్చగాళ్లలో అనేకులు భారత స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత, తెలంగాణ ఉద్యమాలు, పోరాటాల అనంతరం కళ్లు తెరిచినవారు. వారు ఏ ఉద్యమాల్లో, ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వాములు కాలేదు. కనీసం చారిత్రక పరిజ్ఞానం ఉన్నవారు కాదు. కొత్త బిచ్చగాళ్లలో కొంతమంది బ్రిటిష్ పాలకులకు క్షమాపణ పత్రాలు రాసిచ్చిన వారన్నది చరిత్ర ఉద్ఘోషిస్తున్న సత్యం. ఇటీవలి చరిత్ర గురించి తెలుసుకోవడానికి కొత్త బిచ్చగాళ్లు తాము తెగ పొగడుతున్న వల్లభ్భాయ్ పటేల్ లేఖలను, అంబేద్కర్ రచనలను చదువాలె. జవహర్లాల్ సాటిలేని దేశభక్తుడని, త్యాగధనుడని పటేల్ ఒక లేఖలో రాశారు. చరిత్ర తెలియనివాళ్లు చరిత్ర నిర్మించలేరని అంబేద్కర్ అన్నారు. రణరంగంలో ప్రవేశించకముందే, అతిగా మాట్లాడటం, వాస్తవాలకు మసిపూసి వక్రభాష్యాలు చెప్పడం, పొడిచి గెలిచినట్లు పొంగి పోవడం కొత్త బిచ్చగాళ్లకు అలవాటు. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. ఆ ఎన్నికల్లో కొత్త బిచ్చగాళ్లు చిత్తుగా ఓడి కుప్పకూలారు. అక్కడి (బెంగాల్) పరాజయాల ప్రభావం ఇంకా కన్పిస్తున్నది.
అమ్మకాలు, ఆరగింపులు ప్రస్తుతం కొత్త బిచ్చగాళ్ల కొత్త విధానం. ఈ సందర్భాన మా ఊరి గుడి పూజారి గోవిందాచారి ఎప్పుడూ చెప్పే ఒక సామెత జ్ఞాపకం వస్తున్నది. మా ఊరి (వరంగల్లు సమీపంలో మామునూరు విమానాశ్రయం పక్కన) కోదండ రామస్వామి దేవాలయం పూజారి గోవిందాచారి ప్రతిరోజు సాయంత్రం గుడివెనుక తాళ్లపాకలో సమావేశాలు జరిపేవాడు. ఊరిపెద్దలు కొందరు అక్కడికి వెళ్లేవారు. రాత్రిపూట సాయుధ పోరాటం దళాలకు చెందినవారు గోవిందాచారి సమావేశాలకు వస్తారని ఆ రోజుల్లో చాలామందికి తెలుసు. గోవిందాచారి ఎన్నో సామెతలు చెప్పేవాడు. వాటిలో ఒకటి ‘అమ్మగారి గృహప్రవేశం అయ్యగారి అడవి ప్రవేశం’.
దేవులపల్లి ప్రభాకరరావు