దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. కష్టంతో కూడుకున్న ఈ వృత్తికి లభించే ప్రతిఫలం అంతంత మాత్రమే. అయినా అలాంటి చేనేత ఉత్పత్తులపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించి కార్మికుల నడ్డి విరుస్తున్నది. ఈ నేపథ్యంలో జీఎస్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. వెంటనే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.
చేనేత కళ ఎంతో ప్రాచీనమైనది. భారతీయ చేనేత పరిశ్రమకు నాడు, నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్నది. సుమా రు రెండు శతాబ్దాల కిందటి వరకు భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం చేనేతదే. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఇంగ్లండ్లో తయారైన వస్ర్తాలకు అక్కడ గిరాకీ లేకపోవడంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం వాటిని భారత్లో అమ్మడానికి ప్రయత్నించింది. ఆ ప్రణాళికలో భాగంగా భారతీయ చేనేత పరిశ్రమను నాశనం చేసింది. చేనేతకారులను అణచివేసి భారతీయ చేనేత పరిశ్రమను దెబ్బ తీసింది. అలాంటి చేనేత వృత్తిని మళ్లీ ప్రోత్సహించడానికి స్వాతంత్య్రోద్యమ సమయంలో విదేశీ వస్త్ర బహిష్కరణ చేసిన ఘన చరిత్ర భారతీయులది.
అంతటి ఘన వైభవం కలిగిన చేనేత పరిశ్రమను నేడు బీజేపీ ప్రభుత్వం కుంగదీస్తున్నది. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించి కార్మికుల పొట్ట కొడుతున్నది. అసంఘటితరంగంలో దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది చేనేతకారులు ప్రత్యక్షంగా, మరో 50 లక్షల మంది చిరు వ్యాపారులు పరోక్షంగా చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి జీవనంపై పెనుభారం పడుతుందని తెలిసి కూడా చేనేత రంగంపై కేంద్రం జీఎస్టీ విధించడం దారుణం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేనేత సంఘాలు, విపక్షాలు ఎన్నో నిరసనలు చేపట్టాయి. అయినా కేంద్ర ప్రభుత్వం చలించకపోవడం శోచనీయం.
2017 జూన్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 16వ సమావేశంలో చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి రాతపూర్వకంగా తన అసమ్మతిని తెలియజేసింది. ఆ తర్వాత పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు నాటి రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ జీఎస్టీకి వ్యతిరేకంగా తొలి నిరసన గళం వినిపించారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేతపై జీఎస్టీ విధించొద్దని మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని విధించింది. చేనేతపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్లో జరిగిన టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ ఎల్.రమణ ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ శ్రేణులన్నీ ముక్తకంఠంతో ఆమోదం తెలిపాయి. 17వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చేనేతపై విధించిన జీఎస్టీని 5 నుంచి 12 శాతం పెంచాలని కేంద్రం ప్రయత్నించినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం ఆ నిర్ణయంపై తాత్కాలికంగా వెనకడుగు వేసింది.
జీఎస్టీపై పోస్ట్ కార్డు ఉద్యమం: గత రెండేండ్లుగా దేశవ్యాప్తంగా చేనేతపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇటీవలి కాలంలో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి. తెలంగాణ చేనేతశాఖ మంత్రి కేటీఆర్ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డు రాయడమే ఇందుకు ఉదాహరణ. కేటీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరవుతున్న బీజేపీ మంత్రులు, నాయకులు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో చేనేతపై జీఎస్టీ విధింపునకు సంబంధించి అర్థం పర్థం లేని వాగ్దానాలు చేశారు. దీన్నిబట్టి కేంద్రం చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని తొలగించకుండా అలాగే ఉంచుతామని పరోక్షంగా చెప్తున్నారు. చేనేతపై జీఎస్టీ పన్ను విధింపు విషయంలో కేంద్రం జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నందున బీజేపీలో ఉన్న చేనేత వర్గ నాయకులే విమర్శిస్తున్నారు. చేనేతపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా కేటీఆర్ సంధించిన ప్రశ్నలు రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి, తద్వారా దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. ఇటీవల జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ గత ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పథకాలను రద్దుచేసి చేనేత, మర నేత, హస్త కళాకారులను నడ్డి ఎలా విరిచిందో వివరించారు. చేనేతపై జీఎస్టీకి విధింపును వ్యతిరేకిస్తూ తెలంగాణ నుంచి 10 లక్షల పోస్ట్కార్డులు ప్రధానమంత్రికి రాయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చేనేత కార్మికులు, సాధారణ ప్రజలు ఆయన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందించి ప్రధానికి పోస్టు కార్డులు రాస్తున్నారు. చేనేతపై జీఎస్టీ విధింపు ఉపసంహరణకు సంబంధించి కేంద్రంలో కదలిక రావాలంటే మాజీ రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ డిమాండ్ చేసినట్లు కేవలం చేనేతపై జీఎస్టీ విధింపు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించాలి.
జీఎస్టీతో చేనేత కార్మికులకు కేంద్రం భారం కలిగిస్తే, తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనందిస్తున్నది. చేనేత మిత్ర, చేనేత లక్ష్మీ, చేనేత బీమా తదితర పథకాలను అమలు చేస్తున్నది. బతుకమ్మ చీరల తయారీని చేనేత కార్మికులకు ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నది. దీంతో వలసవెళ్లిన కార్మికులు స్వరాష్ర్టానికి తిరిగివచ్చారు. సూది, సుత్తె, నాడె, నాగలి కలిస్తే మహోద్యమమే. స్వదేశీ వస్త్ర పరిశ్రమ పరిరక్షణ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భాగమైంది. నాడు స్వాతంత్య్ర సాధనకు చేనేత ఉద్యమం ఎలా దోహదపడిందో నేడు మోదీ ప్రభు త్వం నిరంకుశ పాలన పతనానికి చేనేత ఉద్యమం ఆ విధంగా తోడ్పడాలి. చేనేత కార్మికులు చేస్తున్న ఈ పోరాటానికి దేశంలోని అన్నివర్గాలు మరింత మద్దతునివ్వాలి.
(వ్యాసకర్త: గుండేటి శ్రీధర్ , 99898 64789, సీనియర్ జర్నలిస్ట్)