ప్రజా ప్రతినిధులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలి. అప్పుడే ఓటర్లు వారిని ఆదరిస్తారు, గౌరవిస్తారు. కానీ కొంత మంది ప్రజా ప్రతినిధులు తమకు ప్రజలిచ్చిన అవకాశాన్ని స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. తమ సంక్షేమాన్ని పట్టించుకున్న వారికే ప్రజలు తిరిగి పట్టం కడతారని నాయకులు తెలుసుకోవాలి.టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ఆదర్శంగా తీసుకోవాలి.
ఉప ఎన్నికలు ఏ కారణం వల్ల వచ్చినా అందులో గెలవాలనే తపన అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తాము ఎంత మేర న్యాయం చేశామనేది పార్టీలు ఆత్మావలోకనం చేసుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడక తప్పదు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం నేను ప్రచారం నిర్వహిస్తున్నాను. ఓటర్లతో మమేకమై మాట్లాడుతున్న సందర్భంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గూర్చి నాకు అనేక కొత్త విషయాలు తెలిశాయి.
ఆయన ఏనాడూ తమ గ్రామాల్లో పర్యటించ లేదని, పైగా ప్రజా సమస్యలు పరిష్కరించమని అడిగితే ఏనాడూ పట్టించుకోలేదని ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తుంటే వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఎందుకని నేను ఆరా తీస్తే ప్రతి గ్రామంలోప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అర్థమైంది.
గత ప్రభుత్వాలు పరిష్కరించలేని ఫ్లోరైడ్ సమస్యను కేసీఆర్ పరిష్కరించారని మునుగోడు ప్రజలు ఆనందపడుతున్నారు. అందుకే తామంతా కేసీఆర్ వెంటే ఉన్నామని అభయమిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు నోట్ల కట్టలు కుమ్మరించినా తాము అమ్ముడు పోమని నిర్భయంగా చెపుతున్నారు. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అని అర్థం అవుతుంది. మునుగోడు నియోజక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అధికార గణాంకాలే తెలియచేస్తున్నాయి. నియోజక వర్గంలో ఆసరా పెన్షన్లు అందుకుంటున్నవారు 40, 543 మంది ఉన్నారు. రైతు రుణమాఫీ ద్వారా 42, 148 మంది, రైతు బీమా ద్వారా 1126 కుటుంబాలు లబ్ధి పొందాయి. 8917 మంది యువతులకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం లభించింది. 9946 మంది బాలింతలకు కేసీఆర్ కిట్స్ అందాయి. మరోవైపు ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. 5369 మందికి 67.51 కోట్ల విలువచేసే గొర్రెలను టీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. దళిత బంధు పథకం ద్వారా మొదటి విడతలో వంద మందికి రూ.10 కోట్ల సాయం అందించింది.
నియోజక వర్గంలో 2.57 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో రూ.492.17 కోట్లు జమ చేసింది. 21, 990 మంది డ్వాక్రా మహిళలకు రూ.8,164 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 4,562 మంది లబ్ధి పొందారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మేలు కలుగుతున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి భయపడిన బీజేపీ అవినీతి సొమ్ముతో ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నది. ఇలాంటి పార్టీని రాజకీయాలకు దూరం పెట్టాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి సిద్ధమయ్యారు. ప్రజల ఉత్సాహాన్ని గమనిస్తే రాష్ట్రంలో బీజేపీ పతనం ప్రారంభమైందని అనిపిస్తున్నది.
(వ్యాసకర్త: డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి , చైర్మన్, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ, 95530 86666)