తెలంగాణ తొలి దశ పోరాటం నుండి మలి దశ పోరాటం వరకు తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజా కవి గూడ అంజయ్య. కాలాన్ని తన వెనకాల నిలబెట్టుకొని తన రచనలతో, గానంతో సమాజాన్ని కదిలించి దోపిడిని ప్రశ్నించిన ఉద్యమ కవి ఆయన. ఆయన చూసిన బతుకులు, ఆయన బతికిన బతుకు.. ఇవే ఆయన పాటలకు ప్రేరణలు. పాట ఎన్నో ప్రశ్నలకు జవాబు రాబట్టే మార్గాన్ని నిర్దేశిస్తుందని ఆయన నమ్మకం. దొరల, భూస్వాముల దోపిడిని ప్రశ్నిస్తూ అన్ని పనులు మనమే చేస్తే మధ్యలో దొరల పెత్తనమేందంటూ ప్రశ్నించారు. జనం లోంచి వచ్చిన జానపదమే తన ప్రాణపదమని నమ్మి తన కలంలో పేదల కన్నీళ్లను సిరాగా పోసి మలి దశ ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు. తెలంగాణ పోరాటం ఉచ్ఛ దశకు చేరడానికి కారణమయ్యారు. ఆయన పాటలు ప్రతి హృదయాన్ని తడిపాయి. ఉద్యమానికి రమ్మని చేయి పట్టుకుని నడిపించాయి. ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. అణువణువూ నా తెలంగాణ అన్న ఆకాంక్షను రేకెత్తించాయి. 2002లో కామారెడ్డిలో జరిగిన ధూం ధాం మొదటి బహిరంగ సభలో ‘అయ్యోనివా… నీవు అవ్వోనీవా’ అంటూ పాడిన పాట ఆంధ్రా పెత్తనం, దోపిడి వ్యవస్థను నిగ్గదీసి అడిగి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఉచ్ఛ దశకు చేర్చింది.
‘ఊరు మనదిరా..ఈ వాడ మనదిరా’ పాట మలి దశ తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ సాహిత్యానికి అత్యంత ప్రేరణను ఇచ్చిన పాట. ఈ పాట 16 భాషల్లోకి అనువాదమై అంతర్జాతీయ వేదికల మీద కవులు, కళాకారులు, ప్రజల్ని ఉర్రూతలూగించింది. ఆయన పాటల్లో కుటుంబ కష్టాలు, పేదరికం, మధ్య తరగతి బలహీనతలు, బాధలు ఇతివృత్తంగా ఉంటాయి.
అసలేటి వానల్లో
ముసలెడ్లు గట్టుకొని
మోకాలి బురదలో
మడిగట్టు దున్నితే
గరిసె లెవరివి నిండెరా -గంగన్న
గుమ్ము లెవరివి నిండెరా – గంగన్న
అంటూ రైతన్న గోసను ఆవిష్కరించి పీడిత, తాడిత ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు గూడ అంజయ్య.
భద్రం కొడుకా.. పైలం కొడుకా
రిక్షా ఎక్కే కాడ దిగే కాడ
తొక్కుడు కాడ మలుపుడు కాడ
భద్రం కొడుకో జర పైలం కొడుకో
అంటూ అమ్మ పేగు భాషను ఆర్తితో పలికిస్తూనే బ డుగు జీవుల శ్రమను దోచుకోవడానికి పల్లెకు పట్టణానికి తేడా ఉండదని హెచ్చరించారు. ఈ పాట ‘రంగుల కల’ సినిమా ద్వారా చాలా ప్రాముఖ్యత పొందింది. తెలంగాణ నుడికారం, ధిక్కారం, కలల సాకారం కలగలిసిన పాటకు ఏ గండ పెండేరం ఎవరు తొడగకపోయినా ఆయన ఏనాడూ చింతించలేదు. పుట్టెడు కష్టాలతో, అనారోగ్యంతో 2016 జూన్ 21న తుది శ్వాస విడిచారు.
– అంకం నరేష్ , 63016 50324
(నేడు ప్రజా కవి గూడ అంజయ్య జయంతి)