‘ఏరు దాటేదాక ఓడ మల్లయ్య.. ఏరు దాటినంక బోడి మల్లయ్య’ అన్నట్లుగా ప్రజలతో వ్యవహరిస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల శాసనసభ ఎన్నికలు ముగిసేవరకూ.. ధరల విషయంలో, ప్రజల జీవితాల్ని మరింత భారం చేసే అంశాల విషయంలో గప్చుప్గా ఉంది కేంద్రం. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాయో లేదో జనం మీద బాదుడును పునఃప్రారంభించింది. పీఎఫ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీని 8.5 శాతం నుంచి ఏకంగా 8.1 శాతానికి తగ్గించింది! గత 43 ఏండ్లలో ఇదే కనిష్ఠం. రెండేండ్లుగా కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులతో, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణంతో అతలాకుతలమైన ఉద్యోగులను, కార్మికులను ఈ నిర్ణయం మరింత దెబ్బతీయనున్నది. ద్రవ్యోల్బణం 5.3 శాతం మేర పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఈ లెక్కన పీఎఫ్ వడ్డీ మీద నికరంగా కార్మికులకు లభించేది 2.8 శాతమే. మోదీ అధికారం చేపట్టిన తర్వాత పీఎఫ్ వడ్డీని క్రమంగా తగ్గిస్తున్నది. 2015-16లో 8.8 శాతం ఉంటే అదిప్పుడు 8.1 శాతానికి చేరుకున్నది.
పెట్రోల్, డీజిల్ ధరలను కనివినీ ఎరుగని రీతిలో వంద దాటించిన మోదీ ప్రభుత్వం గత నాలుగు నెలలుగా వాటి పెంపు జోలికి వెళ్లలేదు. యూపీ ఎన్నికల తుది విడుత పోలింగ్ ముగియగానే ఇక రేపో మాపో చమురు ధరల భారీ పెంపు ఉంటుందన్న సూచనలు వెలువడ్డాయి. పీఎఫ్ వడ్డీ కోతతోపాటే చమురు ధరలనూ పెంచితే జనం నుంచి వచ్చే స్పందనకు భయపడ్డారేమో తెలియదుగానీ.. పెట్రో వడ్డన ఇంకా జరుగలేదు. బహుశా ఈ వారం రోజుల్లో ఇది కూడా జరుగవచ్చని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ మళ్లీ తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ చట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. వాటిని మళ్లీ తీసుకువచ్చినా తేవచ్చు. రైతులకు ఇచ్చిన హామీలు వేటినీ ఇప్పటికీ నెరవేర్చలేదు. దీనిపై ‘కిసాన్ ఏక్తా మోర్చా’ మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతుండటం గమనార్హం.
కేంద్రం వైఖరి కాకులను కొట్టి గద్దలకు వేసిన తీరున ఉన్నది. ప్రజలు, చిరుద్యోగుల దైనందిన జీవితాల్ని, పొదుపు మొత్తాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే విధంగా కర్కశంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇంకోవైపేమో ప్రజల సొమ్మును స్వాహా చేసిన బడాచోరులను మాత్రం చట్టం ముందు నిలబెట్టే బాధ్యతను ఎంతమాత్రం తీసుకోవటం లేదు. కాకులను కొట్టి గద్దలకు వేయటం అంటే ఇదే. దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల వేళ హిజాబ్ వంటి అంశాల్ని లేవనెత్తి, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవటం, ఆ తర్వాత జనం వీపుల మీద వాతలు పెట్టడంలో మోదీ సర్కార్ బాగా ఆరితేరింది. ఇది అమానవీయ రాజకీయం. విజ్ఞతతో, ఐక్యతతో దీన్ని నిలువరిస్తేనే దేశానికి మంచిరోజులు.