మెగా ఉద్యోగమేళా ప్రకటనతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఒకవైపు సంబరపడుతుంటే, మరోవైపు మా సంగతేంటి? అని రాజకీయ నిరుద్యోగులకు దిగులు పట్టుకుంది. ఇంతకాలం నిరుద్యోగ జంగ్ సైరన్ అని కాంగ్రెస్, నిరుద్యోగ మార్చ్ అని బీజేపీలు పాదయాత్రలు, సభలు నిర్వహించాయి. కేసీఆర్ ఉద్యోగ ప్రకటనతో ఆ సబ్జెక్ట్ ఎక్స్పైర్ అయింది. దీంతో రాజకీయ పార్టీలు కొత్త పల్లవిని అందుకున్నాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతాంగ సమస్యలపై వచ్చే నెల 14 నుంచి (తన పాదయాత్ర) ప్రారంభం కాబోతుందని ప్రకటించారు. ఇక కాంగ్రెసేమో ఉద్యోగాల భర్తీ డిమాండ్ను పక్కనపెట్టి, కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ పర్మినెంట్ చేయాలని కొత్త రాగం అందుకున్నది. సందట్లో సడేమియా అన్నట్లు నా ప్రజా ప్రస్థానం పాదయాత్రకు భయపడే కేసీఆర్ దిగివచ్చారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కేక్ కట్ చేయడం కొసమెరుపు!
ఈ గూటి పక్షినే
అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొడుతారేమో కానీ సభ్యుడు కాకపోయినా ఆయన మాత్రం ఠంచన్గా ప్రత్యక్షమై అందరినీ పేరు పేరునా పలకరించివెళ్తుంటారు. ఈ పాటికి ఆయనెవరో ఇట్టే ఉహించవచ్చు. రాయలసీమకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి. అయితే ఆయన రాక పూర్వాశ్రమంలోని కాంగ్రెస్ దోస్తులకు అసలు గిట్టడం లేదు. జేసీని చూడగానే పిలువని పేరంటానికి వచ్చిన అతిథిలా చూస్తూ ముఖాలు తిప్పేసుకుంటున్నారు. వస్తే రండి…అంతేకానీ.. వచ్చినప్పుడల్లా సీఎల్లో కూర్చొని టీఆర్ఎస్ను, కేసీఆర్ను పొగడటం మాత్రం ఏ మాత్రం బాగోలేదని మొహమాటం లేకుండా చెప్పేశారు. అయినా ఇక్కడ మీకేం పని? ప్రతిసారి విదేశీ పక్షిలా వాలిపోతుంటారని నిష్ఠూరంగా అడిగారు. నేనేం విదేశీ పక్షిని కాదు, స్వదేశీ పక్షినే. మా పూర్వికులది కూడా తెలంగాణే. అది అలంపురం దగ్గర ఉంటుందని జేసీ కూడా ప్రతిసారి ఓ పెద్ద ఫ్లాష్బ్యాక్ స్టోరీ వినిపించి వెళ్లడం పరిపాటి అయింది.
అదోరకం బాపత్
ప్రభుత్వం నియమించే కమిటీలు, కమిషన్లు కాలక్రమేణా వాటికి నేతృత్వం వహించిన అధికారో, లేక వ్యక్తి పేరుతోనూ పిలువబడుతాయి. అలాంటి కమిటీ ఒకటి ఇప్పుడు జనం నోళ్లలో నానుతుంది. అదే బిశ్వాల్ కమిటీ. ఈ పేరుగల వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతుకుతున్నారట. ఈయన పూర్తి పేరు సీఆర్ బిశ్వాల్ (చిత్తరంజన్ బిశ్వాల్). ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలెక్టర్గా, చివరగా సీఎంఓ కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారి. ఉద్యోగుల వేతన సవరణకు (పీఆర్సీ) బిశ్వాల్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ కమిటీ వేసింది. అయితే ప్రతిపక్షాలకు ఈ కమిటీ దేనికోసం వేసిందో తెలియక బిశ్వాల్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తుండంతో తెరపైకి వచ్చింది. కమిటీలు, కమిషన్లు వ్యక్తుల పేర్లతో చెలామణి కావడం కొన్ని సందర్భాలలో ఇబ్బందికరంగానే ఉంటుందని దివంగత మాజీ మంత్రి కోనేరు రంగారావు ఒకసారి వాపోయారు. కాంగ్రెస్ హయాంలో భూ సంస్కరణలపై కోనేరు నేతృత్వంలో కమిటీ వేసింది. అది కాలక్రమేణా కోనేరు రంగారావు కమిటీగా మారింది. కమిటీ సిఫారసులు అమలుచేస్తే మంచిది. లేకపోతే నిరసనకారులు తన దిష్టిబొమ్మ తగలబెట్టే ప్రమాదం లేకపోలేదని కోనేరు వాపోయారు.
– వెల్జాల