బీజేపీ పాలనలో లేని రాష్ర్టాలపై మోదీ సర్కార్ దారుణమైన వివక్ష చూపుతున్నదని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ తీవ్రంగా దుయ్యబట్టారు. అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ఆ రాష్ర్టాలకు సహకరించకుండా గుజరాత్ వంటి రాష్ర్టాలకు మాత్రం దేశ ప్రజానీకం సొమ్మును తరలిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో భాగంగా లోక్సభలో మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర ధోరణిని ఎండగట్టారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘దేశ బడ్జెట్ వంటి అత్యంత ముఖ్యమైన అంశం మీద లోక్సభలో చర్చ జరుగుతుంటే ఆర్థికమంత్రి సభలో హాజరుకాకుండా, ఈ సమయంలో ‘ఇండియాటుడే’ సదస్సులో పాల్గొంటున్నారు. ఇది సభకే అవమానం. బీజేపీకి ఇది సిగ్గుచేటు. ఆర్థికమంత్రికి ఇండియాటుడే ముఖ్య మా? పార్లమెంటు ముఖ్యమా? ఈ బడ్జెట్ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం. ప్రజలకు వ్యతిరేకం. ప్రజల సంక్షేమాన్ని ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించింది.
ఎన్డీఏ అంటే నో డేటా అవలేబుల్ (అందుబాటులో సమాచారం లేదన్నట్టు)గా తయారైంది. 2020లో కరోనా వల్ల ఎంతమంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు అని అడిగితే సమాధానం ఎన్డీఏ. కరోనా కారణంగా ఎంతమంది ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అడిగితే ఎన్డీఏ. 2011లో కులాలవారీగా లెక్కలు సేకరించారు వివరాలు ఇవ్వండి అంటే ఎన్డీఏ. డాటా సెక్యూరిటీలు, జీడీపీ.. దేని గురించి అడిగినా మోదీ సర్కార్ నుంచి వచ్చే సమాధానం ఎన్డీఏ. వివరాలు ఇస్తే మేం నిలదీస్తామని భావించే కేంద్రం ఇలా వ్యవహరిస్తున్నది.
వాతావరణ మార్పుల గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రధానమంత్రి భారీ హామీలు ఇస్తుంటారు. కానీ, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పరు. తమిళనాడులో అకాల వర్షాలు అతలాకుతలం సృష్టిస్తున్నాయి. కానీ, కేంద్రం నుంచి చిల్లిగవ్వ రాదు. అదే గుజరాత్లో ఏదైనా జరగకముందే రూ.500 కోట్లు పంపిస్తారు. వజ్రాల వ్యాపారం మొత్తం గుజరాత్లోనే జరుగుతుంది. కాబట్టి, వజ్రాల వ్యాపారులపై కేవలం ఐదు శాతం పన్నుతో సరిపెడుతారు. అదే మా రాష్ట్రంలోని తిరుపూర్లో ఉన్న వస్త్ర పరిశ్రమపై దారుణమైన వివక్ష చూపుతారు. పెరిగిన ముడిపదార్థాలు ధర కారణంగా కంపెనీలు మూతపడుతున్నాయని, పన్ను మినహాయింపు ఇవ్వాలని మా సీఎం స్టాలిన్ కోరితే పట్టించుకోరు. ఇటువంటి రాజకీయాల ఫలితంగా, అనేక రంగాల్లో బంగ్లాదేశ్ భారత్ను దాటి ముందుకు వెళ్తున్నది. మోదీ సర్కార్ దేశ రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇది చాలా సీరియస్ సమస్య.
కేంద్రానికి ఆర్థిక వనరులే లేవు. రాష్ర్టాల నుంచే ఆదాయాన్ని, డబ్బును తీసుకుంటుంది. కానీ, తిరిగి రాష్ర్టాలకే ఇచ్చే దగ్గర మాత్రం పక్షపాతం చూపుతున్నది. తమకు కావలసిన రాష్ర్టాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారు. కానీ, అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలైన తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు మాత్రం ఇవ్వటం లేదు. వీటిలో కర్ణాటక తప్ప మిగిలినవన్నీ బీజేపీ పాలనలో లేని రాష్ర్టాలు. అంటే, బీజేపీ పాలనలో లేకపోతే కేంద్రం సహకరించదు. నిధులు ఇవ్వదు.
లాక్డౌన్ సమయంలో దేశంలోని కోటీశ్వరులు తమ సంపదను 35 శాతం పెంచుకున్నారు. ఇదే సమయంలో మధ్యతరగతికి చెందిన 3.2 కోట్ల మంది ఆర్థిక పరిస్థితి దిగజారింది. 12 కోట్ల మంది పేదరికంలోకి నెట్టివేయబడ్డారు.
ఎయిర్ ఇండియాను అమ్మేశారు. రక్షణరంగానికి అత్యవసరమైన టెక్నాలజీలను అందిస్తున్న సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ను అమ్మబోతున్నారు. నేషనల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను విక్రయించారు. ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయబోతున్నారు. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి పలు ప్రభుత్వ సంస్థల అమ్మకానికీ అడుగులు వేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ కంపెనీలను అమ్మకానికి పెడుతూ, మరోవైపు ప్రైవేటు కంపెనీల్లో వాటాలను కేంద్రప్రభుత్వం కొంటున్నది. ఒడాఫోన్ కంపెనీలో 35.8 శాతం వాటాలను తీసుకుంటున్నది. ఎయిర్టెల్లోనూ వాటాలను కొనుగోలు చేస్తున్నది. ఈ డబ్బు ఎవరిది? ప్రజలది కాదా? వీటి గురించి మాత్రం ఆర్థికమంత్రి బడ్జెట్లో ఎటువంటి వివరాలను వెల్లడించరు. కరోనా కారణంగా ఎంతోమంది వ్యాపారాలు మూసివేసుకున్నారు. నష్టపోయారు. వారికి ప్రభుత్వం ఎందుకు తోడ్పాటు అందించదు?
వందేభారత్ కార్యక్రమం కింద భారతీయ రైల్వే రూ.1.37 లక్షల కోట్ల పెట్టుడులు పెడుతున్నది. భారీగా ఖర్చయ్యే బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టును అహ్మదాబాద్లో చేపట్టింది. భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి రూ.60 వేల కోట్లతో రఫెల్ విమానాలను కొనుగోలు చేస్తున్నది. అంటే, ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థకు రూ.60 వేల కోట్ల భారీ మొత్తం అందించింది. దక్షిణ భారతదేశంలో ‘బెంగళూరు-హైదరాబాద్-చెన్నై’ ఐటీ గోల్డెన్ ట్రయాంగిల్గా ఉన్నాయి. దీన్నించి ఎంతో సంపద పుడుతున్నది. ఇటువంటి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టమని, ఒక హైస్పీడ్ రైల్ నెట్వర్క్ను నిర్మించమని ఫ్రాన్స్ను భారత ప్రభుత్వం ఎందుకు కోరదు? గిఫ్ట్ సిటీ పేరుతో (గుజరాత్లోని గాంధీనగర్లో) దేశప్రజల సొమ్మును భారీస్థాయిలో వ్యయం చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకూ పెద్దగా సాధించింది ఏమీ లేదు. అదే గిఫ్ట్సిటీని ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్లలో ఏర్పాటు చేసి ఉంటే అద్భుతంగా విజయవంతం అయ్యేది. కేంద్రం విలువైన వనరులను ఈ విధంగా వ్యర్థం చేస్తున్నది.
చివరగా చెప్పేదేమిటంటే, రాష్ర్టాలే భారతదేశాన్ని నిర్మిస్తున్నాయి. సుసంపన్న రాష్ర్టాలతోనే భారతదేశం సుసంపన్నం అవుతుంది. కాబట్టి, రాష్ర్టాల పట్ల పక్షపాతం చూపకండి. ముఖ్యంగా, బీజపీ యేతర రాష్ర్టాల పట్ల ఈ వైఖరిని విడనాడండి’.
(డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లోక్సభలో చేసిన ప్రసంగం నుంచి..)