‘నీళ్లు, నిధులు, నియామకాలు’.. ఈ నినాదమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ‘నిధులు’ సమకూర్చుకొని రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుసాగుతున్నది. ‘నియామకాల’ విషయంలో ఇప్పటికే 90 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకొని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కానీ ‘నీళ్ల’ విషయానికి వస్తేనే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం, మొత్తంగా 2,130 టీఎంసీల నీటి లభ్యత కృష్ణా నదిలో ఉండగా, వాటిలో (నికరజలాలు-2060 టీఎంసీలు), (మిగులు జలాలు-70 టీఎంసీలు)గా ఉన్నా యి. మహారాష్ట్రకు- 560 టీఎంసీలు (నికర జలాలు), 25 టీఎంసీలు (మిగులు జలాలు), కర్ణాటకకు-700 టీఎంసీలు (నికర జలాలు), 34 టీఎంసీలు (మిగులు జలాలు), ఉమ్మడి ఏపీకి-800 టీఎంసీలు (నికర జలాలు), 11 టీఎంసీలు (మిగులు జలాలు) ఉన్నాయి.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఏపీ, తెలంగాణ మధ్య శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లున్నాయి. దీనికి సంబంధించి కృష్ణా జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో, సంవత్సరం వరకు మాత్రమే అనే తాత్కాలిక నిబంధన మేరకు ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల నీటిని పంచుకున్నాయి. 2017 నుంచి కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ 66: 34 నిష్పత్తిలో వాడుకుంటూ వచ్చాయి. రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్ల నుంచే నీటి పంపకాలు జరపాలని కేంద్రాన్ని, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణా జలాల్లో సమాన వాటా (50 శాతం) కావాలని, నీటి పంపకాలు జరపాలని చర్చకు పెట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ, అందుకోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలన్నారు. ఏండ్లు గడుస్తున్నప్పటికీ కేఆర్ఎంబీ కానీ, కేంద్రం కానీ నేటికీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు.
అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఏర్పాటుచేసి నీటి పంపకాలు చేపట్టాలి. ఈ విషయంలో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై పలుమార్లు కేంద్రాన్ని అడిగినా ఫలితం లేకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెక్షన్ 3 అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ లేవనెత్తడంతో, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును వెనక్కి తీసుకుంటే ట్రిబ్యునల్ను ఏర్పాటుచేస్తామని కేంద్రం ఇచ్చిన హామీమేరకు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం 2021లో కేసును ఉపసంహరించుకున్నది. అయినా నేటికీ ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు.
కేఆర్ఎంబీ విభజన చట్టాన్ని అమలుచేయడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అయినా 2021-22లో కూడా తాత్కాలిక ఒప్పందాన్నే (66:34) కేఆర్ఎంబీ కొనసాగించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేవరకు కృష్ణా జలాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. మేలో జరిగిన 16వ బోర్డు సమావేశంలో కూడా 50 శాతం వాటా (405.5 టీఎంసీలు) కావాలని తెలంగాణ కోరింది.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిధిలో దాదాపుగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని, 2022-23 సంవత్సరానికి 105 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా పెరిగాయని పేర్కొన్నది. పై విషయాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేసింది. దక్షిణ తెలంగాణలో 50 వేల కోట్లకుపైగా వ్యయంతో, 10 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మరో భారీ ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, నిర్మాణానికి సహకరించాలని పలుమార్లు అడిగినా కేంద్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా సమాన వాటాలో నీటి పంపకాలు జరిపి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలి.
-నిఖిల్ అల్లేని 96666 51215