రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో జోడిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించటానికి ప్రాజెక్టులు నిర్మించారు. ఇలా.. ఒక్కో రంగంపై తనదైన ముద్ర వేస్తున్నారు. సమాజ అభ్యున్నతికి మూల కారణమై సామాన్యుని జ్ఞానసౌధంగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రూపొందించడం హర్షణీయం.
ప్రభుత్వ పాఠశాల అంటే.. వర్గాలకతీతంగా అందరి దేవాలయంగా వెలుగొందే విజ్ఞాన కేంద్రం. నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న గొప్ప అధికారులు, రాజకీయ నేతలు ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసించి ఎదిగినవారే. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం, విద్యార్థి స్వేచ్ఛతో సంపూర్ణ మూర్తిమత్వంతో అన్నిరంగాల్లో ఎదిగే అవకాశం కల్పించే వేదిక ప్రభుత్వ పాఠశాల. కాలక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కృషించి, ప్రైవేటు బడులు పెరిగిపోయాయి. ప్రభుత్వ బడులు నిరుపేద, దిగువ, మధ్యతరగతి విద్యార్థులకే పరిమితమయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పాఠశాలల్లో వసతులపై దృష్టిసారించారు. గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించే సంకల్పంతో ముందడుగు వేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలను అన్వేషించారు. మౌలిక వసతుల లేమి, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన కోరుకోవడాన్ని కేసీఆర్ గ్రహించా రు. ఆ నేపథ్యంలోనే మరో మహోన్నత మార్పునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న లోటును పూడ్చి, ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి పూనుకున్నారు. దానికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ‘మన ఊరు-మన బడి’ పథకానికి రూపకల్పన చేశారు.
‘మన ఊరు- మన బడి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.7,289 కోట్లు కేటాయించింది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40 శాతం పాఠశాలలకు కేటాయించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టడం చారిత్రక నిర్ణయం. మౌలిక వసతుల కోసం రూ.7,289 కోట్లతో మూడు విడతలుగా దాదాపు 26,000 పాఠశాలలు సకల వసతులతో రూపురేఖలు మార్చుకోనున్నాయి. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్య అభ్యసించనున్నారు. పల్లెలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడికే పంపించాలనుకునేవిధంగా మన బడి రూపు మారిపోనున్నది. ‘మన ఊరు- మన బడి’ పేరు వినగానే ఊరుకు, బడికి ఉన్న ప్రాధాన్యం స్పురిస్తున్నది.
‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా మొదటి విడతగా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను ఎంపికచేస్తారు. ఆయా బడు ల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజిటల్ తరగతి గదులు, గ్రీన్బోర్డులు, మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేక వసతులు, రంగులతో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. మన ఊరిలోని మన బడిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సుందరమైన విజ్ఞాన కేంద్రంగా మారుస్తున్నది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టే పథకం ‘మన ఊరు- మన బడి’. ప్రాథమికస్థాయి వరకు మాతృభాషలో బోధన జరగాలని విద్యా కమిషన్లు సూచించాయి. కానీ, నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడాలంటే ప్రాథమికస్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించవలసిన అవసరం ఉన్నది. అదే సమయంలో మాతృభాష ఒక సబ్జెక్టుగా కచ్చితంగా చదువుకోవాలి. ఉచిత విద్య అందుబాటులో ఉన్నా, నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఆంగ్ల మాధ్యమం లేకపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. స్తోమత లేకున్నా, వేలు, లక్షల్లో ఫీజులు పోసి చదువులు చెప్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. పిల్లలకు మెరుగైన ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంటే, ప్రైవేట్ బడికి తల్లిదండ్రులు పంపించే అవసరం ఉండదు. పోటీ ప్రపంచంలో నిలవాలంటే, విదేశాల్లో రాణించాలంటే నేడు ఆంగ్ల మాధ్యమం మార్గం అని విద్యావేత్తలు, మేధావులు సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలను ఆంగ్ల మాధ్యమానికి మారిస్తే తెలంగాణ విద్యారంగం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులే కాకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి ఈ పథకం దోహదపడుతుంది.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ‘మన ఊరు- మన బడి’ భవిష్యత్ తరాలకు బంగారు బాట వేస్తుందనటంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: కూర రఘోత్తమ్రెడ్డి, శాసనమండలి సభ్యులు, ఉపాధ్యాయ సంఘ నేత)