‘చావగొట్టి చెవులు మూసిండ’నే సామెత ఉన్నది. పెట్రో ధరలను తరచుగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరగ్గొట్టిన మోదీ ప్రభుత్వం కంటి తుడుపుగా కొంత తగ్గించి అదే ఘనతగా చెప్పుకోవడం ఇదే రీతిలో ఉన్నది. మోదీ ప్రభుత్వానికి ప్రజలపై ఏ మాత్రం సానుభూతి ఉన్నా అడ్డగోలుగా ధరలు పెంచకపోయేది. అటు వంట గ్యాస్ ధర పెరగడం వల్ల సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. దీనికితోడు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా భారంగా మారి నిత్యావసర సరుకులు, మిగతా వస్తువుల ధరలు పెరిగాయి. కొవిడ్ కాలంలో బతకడమే గండంగా మారిన సామాన్యులకు మోదీ ప్రభుత్వ విధానాలు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 తగ్గించింది. ఇక వంట గ్యాస్పై తగ్గింపు కేవలం ఉజ్వల సిలిండర్లకు, అంటే నాలుగో వంతు కనెక్షన్లకు సిలిండర్పై రూ.200 మాత్రమే వర్తిస్తుంది. గత ఎనిమిదేండ్లలో పెంచిన దానితో పోలిస్తే తగ్గించింది పిసరంత మాత్రమే. మోదీ తీరు ‘మక్క కంకి గుంజుకొని పెసరకాయ ఇచ్చినట్లున్నద’ని సామాన్యులకు కూడా అర్థమవుతున్నది.
తొమ్మిది కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వంతున 6,100 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు చెప్పుకోవడం కూడా వింతగా ఉన్నది. 90 లక్షల మంది ఉజ్వల లబ్ధిదారులు మళ్లీ నిండు సిలిండర్ తెప్పించుకోనే లేదు. కోటికి పైగా లబ్ధిదారులు ఒక్కసారి మాత్రమే సిలిండర్ బుక్ చేసుకున్నారు. అనేకమంది నెలకొకటి వాడరు. ధరలు పెంచినప్పుడు ఏడాది లెక్కలు చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు సిలిండర్ల లెక్కతీస్తున్నది. మోదీ అధికారం చేపట్టడానికి ముందు 2014 మార్చిలో డీజిల్పై కేంద్ర పన్నులు లీటర్కు 9.2 రూపాయలు కాగా, 2021 నవంబర్ నాటికి అవి 32.9 రూపాయలకు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర వ్యాట్లో మార్పు మాత్రం అతిస్పల్పం. భారీగా పన్నులు తాను పెంచి రాష్ర్టాలు తగ్గించాలని చెప్పడం కూడా మోదీకే చెల్లింది! మోదీ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచడం వల్లనే ద్రవ్యోల్బణం పెరిగిందనేది అందరికీ తెలిసిందే.
కొన్ని రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగేముందు ఇంధన ధరలు పెంచకపోవడం, ఆ తర్వాత రోజువారీగా పెంచడం కూడా మోదీ సర్కారు చేసిన మోసాలలో ఒకటి. గతేడాది మార్చి-ఏప్రిల్ ప్రాంతంలో ఐదు రాష్ర్టాల ఎన్నికల సందర్భంగా ఇంధన ధరలు పెంచలేదు. మళ్లీ ఇటీవల యూపీతో పాటు ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో పెరుగుదల ఆగింది. ఇంధన ధరలను నియంత్రణ పరిధి నుంచి తొలగించడం వల్ల అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా హెచ్చుతగ్గులు ఉం డాలి. కానీ మోదీ ప్రభుత్వంలో అంతర్జాతీయ ధరలు భారీగా తగ్గినా వినియోగదారులకు ఆ మేరకు ఉపశమనం కలగడం లేదు. ఇటీవల కొవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా సామాన్యుడికి భారం తగ్గలేదు. ధరలు తగ్గించడం మాటెలా ఉన్నా, ప్రభుత్వం కనీసం ప్రజల పట్ల నిజాయితీగా వ్యవహరించాలి, సానుభూతిగా ఉండాలి. కానీ మోసపూరితంగా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరం. ఇది ప్రజలను అవమానించడమే.