రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని కారుచీకట్లో కాంతిరేఖగా భావించవచ్చు. దేశంలో ప్రజాస్వామ్యానికి, పౌరహక్కులకు విఘాతం కలిగించే విధంగా బుల్డోజర్ రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ సర్కార్ ఈ పరిణామంతో కొంత వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. అప్పటికీ, చట్టం అమలుపై స్టే విధించకుండా చేయగలిగిన అన్ని ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేసింది. కాలం చెల్లిన చట్టాలను తొలగిస్తున్న కేంద్రం ఈ చట్టంపైనా సమీక్ష జరుపనున్నదని, అప్పటివరకూ అమలును నిలిపివేయవద్దంటూ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలను, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే నేరాలను అడ్డుకోవటానికి ఈ చట్టం ఉండాలని పేర్కొంటూ- మోదీ సర్కార్ ఎల్లప్పుడూ ఆశ్రయించే ‘భారతదేశ భద్రతకు ముప్పు’ అనే వాదననే మరోసారి తీసుకొచ్చారు. కానీ, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కూడా అంతే పదునుగా స్పందించింది. కేంద్రం సమీక్ష జరిపే వరకూ నిలిపివేస్తున్నామని ఆదేశించటం హర్షణీయం.
బెయిల్కు అవకాశం లేకుండా, యావజ్జీవ శిక్ష విధించే కఠోరమైన రాజద్రోహం చట్టం కింద మోదీ సర్కారు, యూపీలోని యోగి సర్కారు నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే ఈ చట్టాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో తెలుస్తుంది. కరోనా సంక్షోభాన్ని మోదీ ప్రభుత్వం సరిగా ఎదుర్కోలేకపోయిందని ప్రముఖ జర్నలిస్టు వినోద్ దువా యూట్యూబ్లో వ్యాఖ్యానిస్తే ఆయనపై ఈ కేసు పెట్టారు. టీ-20 క్రికెట్ మ్యాచ్లో భారత్పై గెలిచిన పాకిస్థాన్ జట్టును వాట్సాప్లో ప్రశంసించినందుకు ముగ్గురు విద్యార్థులను రాజద్రోహులుగా పేర్కొంటూ జైలుకు పంపారు. యూపీలోని హత్రాస్లో దళిత యువతిపై లైంగికదాడి జరిపి దారుణంగా హత్య చేసిన ఘటన గురించి తెలుసుకోవటానికి వెళ్తున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్పైనా ఇదే కేసు పెట్టి ఏడాదిన్నరగా కారాగారంలో నిర్బంధించారు. ప్రభుత్వాన్ని కూల్చే, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే కుట్రలుగా వీటిని పేర్కొనడం దారుణం.
కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తున్నామని కేంద్రం చేసుకుంటున్న స్వోత్కర్ష కూడా లోపభూయిష్టమైనదే. దశాబ్దాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాలను సంస్కరించే పేరుతో తీసుకొచ్చిన లేబర్కోడ్స్ను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించటం దీనికొక నిదర్శనం. మంచి చట్టాలను మట్టుపెట్టటం, నిరంకుశ చట్టాలను యథేచ్ఛగా వాడటం మోదీ ప్రభుత్వ విధానంగా కొనసాగుతున్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, విమర్శించటం నేరమైపోయింది. రాజకీయ విపక్షాలను బెదిరించి దారికి తెచ్చుకునే సంస్కృతి ఎక్కువైంది. భారత్లో పెరుగుతున్న ఈ నియంతృత్వ వాతావరణాన్ని, ప్రజాస్వామిక విలువల పతనాన్ని వివిధ అంతర్జాతీయ సంస్థలు కూడా తమ నివేదికల్లో కళ్లకు కట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు, మోదీ సర్కారుకు ముకుతాడు వేసి నిలువరించటం సంతోషించాల్సిన పరిణామం. భావవ్యక్తీకరణస్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. దానిని రక్షించుకోవటం మనందరి కర్తవ్యం.