ఆయన వ్యూహం అనూహ్యం. ఆ మార్గం దుర్గమం. ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే అప్పటివరకూ అసాధ్యమన్న వారిలో కూడా ఆశ చిగురించటం మొదలవుతుంది. అది క్రమంగా ఆత్మవిశ్వాసం అవుతుంది. తుఫాను సృష్టించే ప్రజా ఉద్యమం మహోత్తుంగ తరంగమవుతుంది. ఆయన స్వప్నం అప్పుడు కోట్లాదిమంది లక్ష్యమవుతుంది. చివరికి ప్రజానీకం ఆ లక్ష్యాన్ని చేరుకొని విజయ దరహాసం చేస్తుంది. ఇది కాల్పనికత కాదు, కళ్ళముందున్న చరిత్ర. తెలంగాణ అయినా, భారత దేశమే అయినా సమూల మార్పులు చేపట్టడమే ఆయన విధానం. జాతికి దిశానిర్దేశం చేసే ఆ మహానాయకుడు కేసీఆర్.
తెలంగాణ కోసం కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి బయల్దేరిననాడు గుప్పెడంటే గుప్పెడు మందిలో కూడా ఆ కల సాకారమవుతుందన్న ఆశ లేదు. పట్టుమని పది మంది కూడా ఆయన వెంట లేరు. పైగా నాటి ఏపీ ప్రభుత్వం.. దమనకాండకు, ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదానికి, కుట్రలకు పెట్టింది పేరు. అటువంటి సమయంలో తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టి, రాజకీయ మార్గాన స్వరాష్ర్టాన్ని సాధిస్తానని కేసీఆర్ ప్రకటించినప్పుడు అది సాధ్యమని ఎవరూ నమ్మలేదు. రాష్ట్ర సాధన ప్రచండమైన ప్రజా ఉద్యమంతోనే రావాలి తప్ప ఈ రాజకీయ మార్గమేమిటని చాలా మంది అనుకున్నారు. కానీ ఎన్నికలను, ఉప ఎన్నికలను వ్యూహంగా మార్చి అటు రైటిస్టుల నుంచి ఇటు లెఫ్టిస్టుల దాకా సకల రాజకీయ శక్తులనూ తెలంగాణకు ఒప్పించారు కేసీఆర్. గడప దాకా వచ్చిన తెలంగాణను సీమాంధ్రశక్తులు వాయిదా వేయించినప్పుడు.. యావత్ తెలంగాణ ప్రజల్ని పోరాటమార్గంలోకి మళ్లించి ఉద్యమాన్ని నిర్మించి స్వరాష్ర్టాన్ని సాధించారు కేసీఆర్.
దేశంలో మౌలిక మార్పులు తీసుకొచ్చే విషయమై, టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కార్యాచరణ కొత్త చర్చలకు కేంద్రబిందువు అవుతున్నది. బీజేపీ సర్కారు నిరంకుశ వైఖరిని, విద్వేష రాజకీయాలను వ్యతిరేకించేవారు విపక్ష పార్టీల కూటమి ఏర్పడాలనో, ముఖ్యమంత్రులు ఉమ్మడి వేదికపైకి రావాలనో సూచిస్తున్నారు. కానీ కేసీఆర్ ఆలోచనా విధానం ఇందుకు భిన్నమైనది. సరికొత్త సామాజిక- ఆర్థిక ఎజెండాతో ప్రజల ముందుకు పోవాలని ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ప్రజలే పాలకులుగా ఎవరుండాలో నిర్ణయిస్తారని కేసీఆర్ చేస్తున్న ప్రతిపాదన భారతదేశానికి కొత్తది. మోదీని గద్దె దించి మరొకరిని గద్దె నెక్కించే లక్ష్యంతో వెళ్తే విజయం సాధించబోమని, 75 ఏండ్ల స్వతంత్రభారతం ఎందుకు ఇంత వెనుకబాటుతనంతో ఉంది? దీనిని ఎలా సువర్ణ భారతంగా మలచాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటేనే దేశాన్ని వక్రమార్గం నుంచి తప్పించగలమని కేసీఆర్ చెబుతున్నారు. దేశంలోని భిన్న వర్గాల వారు ఆలోచించవలసిన సూచనలివి. నిలిచి గెలిచిన తెలంగాణ దేశానికి చుక్కానిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.