విద్యార్థులకు చిన్ననాటి నుంచే రచనలో ఆసక్తిని పెంపొందించి భవిష్యత్ తరానికి ఉత్తమ రచయితలను అందించటానికి తెలంగాణలో బృహత్తర ప్రయత్నం జరిగింది. ‘మన ఊరు- మన చెట్టు’ కథా వస్తువుతో రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహితీ విత్తనాలు నాటిన తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి అపూర్వం.
రాష్ర్టావతరణ తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్వితీయ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో జీవన ప్రమాణాలను పెంచి సమగ్రాభివృద్ధి దిశలో దూసుకుపోతున్న తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కూడా మున్నెన్నడు లేని స్థాయిలో వికాసం చెందుతున్నది. ప్రపంచ తెలుగు మహా సభలతో భాషా, సాహిత్యాల వికాసానికి నాంది పలికిన తెలంగాణ, విద్యార్థుల్లో కూడా సాహితీ సృజనను పెంచేందుకు వినూత్న కార్య క్రమాలను చేపట్టింది. ఆ క్రమంలో చేపట్టిందే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం.
‘మన ఊరు- మన చెట్టు’ కథా వస్తువుతో రాష్ట్రవ్యాప్తంగా 11 వేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థినీ, విద్యార్థులు తమ సాహితీ సృజనతో రచనలు చేశా రు. తమ రచనా వ్యాసంగానికి భాషా ప్రావీణ్యాన్ని జోడించి ఈ కథల పోటీలో పాల్గొన్నారు. ఈ ఘట్టం సాహితీ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
తెలంగాణ సాహితీవనంలో ఒక విత్తనంగా బయల్దేరిన ‘మన ఊరు-మన చెట్టు’ కథల పోటీలో విరబూస్తు చెట్టుగా ఎదగాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టిన బాల రచయితలకు జేజేలు. సాహిత్యరంగంలోని పెద్దలు వీరిని ప్రోత్సహించి ముందుకునడిపించాలి. తెలంగాణలో కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు, రచయితలకు కొదువ లేదు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి కేసీఆరే సాహితీవేత్త కావటం మన అదృష్టం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ‘మన ఊరు- మన బడి’ పథకం ద్వారా నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలికవసతుల కల్పన కోసం చేస్తున్న ప్రయత్నానికి విద్యార్థులందరి తరపున అభినందనలు.
విద్యార్థులు చిన్ననాటి నుంచే అన్నిరంగాల్లో రాణించాలని, అందులో సాహితీ రంగం కూడా ముఖ్యమైనదని గుర్తించడం ముదావహం. సాహితీరంగం వైపు అడుగులేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవసరమైతే బాల సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయటానికి సీఎం కేసీఆర్ పూనుకుంటే బాలసాహితీకారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ దిశగా తెలంగాణ సాహిత్య అకాడమీ, పాఠశాల విద్యాశాఖ కృషిచేస్తే మన సాహితీ సంపద మరింత ఉన్నతంగా ఉంటుంది.
నిజానికి విద్యార్థి పరిపూర్ణ వికాసానికి దోహదపడేది కేవలం పాఠ్యాంశాలు మాత్రమే కాదు. పాఠ్యాంశాలు చదవటం ద్వారా సామాజిక, శాస్త్రీయ భావనలు పెంపొంది విద్యార్థి విజ్ఞాన వికాసానికి తోడ్పడుతాయి. ప్రతిభ కలిగిన విద్యా ర్థులు ఉన్నత పదవులు, ఉద్యోగాలతో విరాజి ల్లుతారు. ఇది మాత్రమే విద్యార్థి సమ గ్ర, సంపూర్ణ అభివృద్ధి వికాసానికి గీటు రాయి కాదు. ప్రతి మనిషి లో మానవీయ విలువలు పాదు కొనాలంటే… సాహిత్య పఠనం అత్యవసరం. అది పునాదిగా ప్రతి విద్యార్థి సాహితీ సృజన కారుడిగా రూపొందితే అది మరింత ఉన్నతికి పునాదిగా నిలుస్తుంది. ప్రపంచ చరిత్ర లో సమాజాన్ని ఎంతో ప్రభా వితం చేసిన బాల సాహితీ మూర్తులు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యార్థు ల్లో సాహితీ సృజనను పెంపొం దించేందుకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నది.
ఈ క్రమంలో బాల రచయితలు తమ నైపుణ్యానికి, సృజనాత్మకతకు సాన బెట్టుకుంటూ మాతృభాషపై పట్టు సాధించేందుకు బాల సాహిత్య అకాడమీ ఎంతో దోహదపడుతుంది. తద్వారా నిత్యం సాహితీపరమైన కార్యక్రమాలను బాలల చేతనే నిర్వహించవచ్చు. అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, బాల సాహిత్యరంగంలో కూడా ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలవాలి. 6-10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ‘మన ఊరు- మన చెట్టు’ కథాయజ్ఞంలోని ఉత్తమమైన వెయ్యి కథలతో సంకలనం తీసుకొచ్చింది. బాలల్లో ఉత్తమ రచనలు చేసి,పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు ఇవ్వడం హర్షణీయం. బాల రచయితలను సాహితీరంగంలో ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిరంతరం జరగాలి. తెలంగాణ ఉన్నతమైన మానవీయ సమాజంగా రూపొందాలి.
– ఎ.కిరణ్కుమార్