ప్రశ్నిస్తాం… ప్రశ్నిస్తూనే ఉంటామంటారు కొందరు వ్యక్తులు. ఇందుకోసం ‘జర్నలిజం’ అనే ముసుగు తొడుగుతారు. ఫక్తు విషతుల్యమైన హిడెన్ ఎజెండాకు ఆ గొడుగు పడతారు. సహజంగానే నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కానీ, ఎప్పటికైనా నిజం, నిజం కాకుండా పోదు కదా! అచ్చం ఢిల్లీలో అదే జరిగింది. ముసుగువీడింది. నిజస్వరూపం బయటపడ్డది.
పాత్రికేయ వృత్తి ప్రమాణాలకు పంగనామాలు పెట్టిన వైనం వెలుగుచూసింది. ఇన్నాళ్లూ తాము సంధించిన ప్రశ్న అనే కాగితపు మేడపై కట్టింది కాషాయ పార్టీ సౌధాన్ని అని తమంతట తాముగానే నిరూపించుకున్నా రు. అది తెలంగాణ పౌరుల చైతన్య వీచిక ధాటికి ఉప్ఫున కొట్టుకుపోయే దుష్ప్రచార ఎజెండా అని తేటతెల్లం చేశా రు. ఎటొచ్చీ తిరుగులేని ఆలోచనాశక్తికి, తిరుగుబాటు తత్వానికి చిరునామా అయిన తెలంగాణ ప్రజలను భ్రమల్లోకి దింపబోవడమే సాహసం! అందుకుగాను శిక్షణకు ముహూర్తాన్ని హస్తినలో మొదలు పెట్టుకున్నారు.
ప్రశ్న Qలోని అసలు విష(య)ం: బీజేపీ కేంద్ర కార్యాలయం వేదికగా యావత్ తెలంగాణ సమాజానికి స్వచ్ఛందంగా బహిర్గతం చేసేశారు. సిగ్గూ శరం లేకుండా ఏదో అతితెలివి బీరాలు పలికాడు చింతపండు నవీన్. తటస్థంగా ఉంటే గింటే ‘తీన్మార్ మల్లన్న’ అనే పేరు వాడుకోవడం కొద్దో గొప్పో కరెక్టేమో! ఇకపై బీజేపీ నవీన్గానే వ్యవహరించాలి. అసభ్య పదజాలానికి ఆకర్షణే బలంగా జర్నలిజంలోకి చొప్పించజూసిన నోటి పైత్యానికి లెంపలేసుకోవాలి. తెలంగాణ సాధకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని అదేపనిగా తిట్టడమే గొప్ప అని బీజేపీ సభ్యత్వం ఇచ్చి ఉంటే… బీజేపీ పాలకులను, వారి కుటుంబాలను జర్నలిజం పేరిట పొల్లు పొల్లు దూషించేవారికి ఇతరపార్టీలు కూడా సభ్యత్వం ఇచ్చేందుకు తొవ్వ చూపిస్తున్నట్లే! రాష్ర్టాన్ని సుభిక్షం చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రజా సేవలో ఉన్న వారి కుటుంబీకులపై మతిలేని వ్యాఖ్యలకు మీడియా పేరును వాడుకోవడం పాత్రికేయానికి అవమానకరం! ఎందుకో కొందరు కుటిల మేధావులూ పైశాచికానందం పొందుతున్నారు. ఐదుగురు సభ్యులుండే ఒక కుటుంబాన్ని నిర్వహించడంలోనే యజమానికి రకరకాల సవాళ్లు ఎదురవుతాయి.
అలాంటిది సుమారు 4 కోట్ల ప్రజలైన తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దడంలో తలమునకలైన విశేష పరిపాలనాదక్షులు కేసీఆర్ నిబద్ధతకు రెండో పర్యాయం ప్రభుత్వం రెన్యువల్ అవడమే కొలమానం! కేటీఆర్, కవిత, హరీష్రావుల పేర్లతో కుటుంబ పాలన అంటూ ఆడిపోసుకోవడం దుర్మార్గం. ఇందుకు వంతపాడే బీజేపీ లీడర్ల తీరు అంతకన్నా దుర్మార్గం. వాస్తవానికి కేసీఆర్ కుటుంబీకులు ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు. ప్రజా తీర్పుతో ప్రజా సేవలో తలమునకలవుతున్నారు. అయినా, వీళ్లు అవినీతి, జైలు అంటూ డెయిలీ సీరియల్ వినిపిస్తారు. నిజంగానే అవినీతి ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా! అవినీతి లేదు కనుకనే మౌనంగా ఉంటున్నారు. తెల్లారి లేస్తే 24 గంటలూ ఏదో దుష్ప్రచారం చేయడం తప్ప, కేసీఆర్ కుటుంబాన్ని ఏమీ చేయలేమనే నిరాశ నిస్పృహ బీజేపీది. నిజానికి రకరకాల అభియోగాలు, ఆరోపపణలతో మూడు డజన్ల కేసు ల మూటను భుజాన వేసుకున్నది బీజేపీ. దానికి రాష్ట్రం లో ఉన్న ఆ కాస్త పరువూ ప్రతిష్ఠ మసకబారింది!
ఇప్పటిదాకా జర్నలిస్టుగా, ప్రశ్నించే గొంతుకగా పోజు లు కొట్టిన నవీన్కు వ్యక్తిత్వం ఉంటే బీజేపీ కార్యకర్తగానే నోరు విప్పాలి. అతనూ, అతణ్ణి చూసి మురిసిపోతున్న బీజేపీ నేతలేమీ శుద్ధపూసలు కాదనే సంగతి అత్యంత జాగరూకులైన తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. రాష్ర్టానికి శ్రీరామరక్ష ఎవరో ప్రజలే చెప్తారు. ఆ Qలనే ప్రశ్నించే కాలం, సందర్భం వచ్చేసింది. ఆ బాపతు ‘విష’యాలకు కాలం చెల్లడం ఖాయం!
(వ్యాసకర్త: ఇల్లెందుల దుర్గాప్రసాద్,94408 50384 , ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)