‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల సమస్యలు, వాళ్లు ఎదుర్కొన్న అగచాట్లు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి.స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ సినిమాను ప్రశంసించారు. ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, సినిమాలో నటించిన అనుపమ్ఖేర్, మిథున్ చక్రవర్తి తదితరులు బీజేపీ సమర్థకులు, నేతలు. కాబట్టి.. ఆ పార్టీ కోరుకునే ‘హిందూ-ముస్లిం విభజన రాజకీయాల’ కోణంలోనే సినిమాను రూపొందించారన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ పండిట్లు ఎవరు? వారి సమస్యలేమిటి? ఆ సమస్యలపై జరిగిన, జరుగుతున్న రాజకీయాలేమిటో చూద్దాం.
కశ్మీర్ జనాభాలో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, మైనారిటీల్లో హిందువులు, సిక్కులు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రజలంతా కలిసి మెలిసి ఉండేవారు. తమ సంస్కృతిని కశ్మీరియత్ అని సగర్వంగా పిల్చుకునేవారు. బౌద్ధం, వేదాంతం, సూఫీ సంప్రదాయాల మేలుకలయికగా కశ్మీరియత్ను అభివర్ణిస్తారు. 16వ శతాబ్దంలో కశ్మీర్కు అక్బర్ పాలన విస్తరించిన తర్వాత.. హిందువులకు పాలనలో అధిక ప్రాధాన్యం లభించింది. వారిని పండిట్లు అని పిల్చే సంప్రదాయం మొదలైంది. క్రమంగా కశ్మీర్లో ఉన్న హిందువులను వారి కులాలకతీతంగా అందరినీ పండిట్లు అని పిలవటం స్థిరపడింది.
1947లో దేశ స్వాతంత్య్రం వచ్చేనాటికి కశ్మీర్ను హరిసింగ్ అనే హిందూ రాజు పాలిస్తుండేవాడు. అతడి భూస్వామ్య పాలన అరాచకాలకు, దోపిడీకి వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు కలిసి షేక్ అబ్దుల్లా (మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తండ్రి) నాయకత్వంలో సాయుధ తిరుగుబాటు ప్రారంభించారు. దీనికి గాంధీజీ, నెహ్రూ నాయకత్వంలోని నాటి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉండేది. దేశ స్వాతంత్య్రం నాటికి హరిసింగ్ పాలన ముగిసింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న రాష్ట్రం అయినప్పటికీ, లౌకికభావాలున్న షేక్ అబ్దుల్లా నాయకత్వంలోని కశ్మీర్.. పాకిస్థాన్లో కాకుండా భారత్లో విలీనం కావటానికి అంగీకరించింది. ఈ సందర్భంగా కశ్మీర్కు భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపులను, స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చింది. అయితే, తొలి నుంచీ ఈ మినహాయింపులను రద్దు చేయటానికి జరిగిన ప్రయత్నాలు కశ్మీరీల్లో అనుమానాలను తలెత్తేలా చేశాయి.
నెహ్రూ, ఇందిర హయాంలో షేక్ అబ్దుల్లాను పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కశ్మీర్లో అలజడి మొదలై తీవ్రవాదానికి దారితీసింది. అయితే, తొలిరోజుల్లో ఈ మిలిటెన్సీ మతం కేంద్రంగా కాకుండా, కశ్మీరియత్ కేంద్రంగా ఉండేది. దీనివల్ల ప్రజల్లో మతపరమైన విబేధాలు రాలేదు. కానీ, 1985లో కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మఖ్బూల్ భట్ ఉరితీత తర్వాత మిలిటెన్సీ ఇస్లామిక్ రూపం సంతరించుకోవటం మొదలైంది. దీనికి పొరుగునున్న పాకిస్థాన్ ప్రోత్సాహం కూడా తోడైంది. ఈ క్రమంలోనే హిందువుల మీద దాడులు మొదలయ్యాయి.
1986లో హిందువులు కశ్మీర్ను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలు చేస్తుండటంతో.. పలువురు కశ్మీరీ ప్రముఖులు చేసిన విజ్ఞప్తులతో అది నిలిచిపోయింది. 1990లో మిలిటెన్సీ పెరిగిపోయింది. ఈ సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న జగ్మోహన్.. హిందూ-ముస్లింల మధ్య పొడసూపుతున్న అనుమానాలను మరింత పెంచేలా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి (తర్వాత కాలంలో వాజపేయి ఎన్డీఏ ప్రభుత్వంలో జగ్మోహన్కు మంత్రిపదవి లభించింది). ప్రఖ్యాత జర్నలిస్టు, మానవహక్కుల కార్యకర్త, పద్మభూషణ్ గ్రహీత బల్రాజ్పురి 1990లో రాసిన ‘కశ్మీర్’ అనే గ్రంథంలో.. ‘కశ్మీర్లోని సాధారణ ముస్లింలలో పండిట్లపై ఎటువంటి ద్వేషం లేదు. కానీ, హిందూ మతోన్మాద శక్తులు కావాలనే పండిట్లలో భయాన్ని పెంచేలా పుకార్లు సృష్టించారు. హిందూ ఆలయాన్ని తీవ్రవాదులు కూల్చేస్తున్నారని ప్రచారం చేశారు. నిజానికి, సైనికదళాలు జరిపిన అనేక మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
మొత్తమ్మీద కశ్మీర్లో తీవ్రవాదం మరింత పెరిగింది. ఫలితంగా సాధారణ ప్రజలపై దాడులు జరిగాయి. మతాలకు అతీతంగా జనం కశ్మీర్ను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 5 అక్టోబర్ 1992న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం.. ‘అధికారిక గణాంకాల ప్రకారం జనవరి 1990-అక్టోబర్ 1992 మధ్యకాలంలో తీవ్రవాదుల చేతుల్లో 1585 మంది స్త్రీ, పురుషులు చనిపోయారు. వీరిలో 982 మంది ముస్లింలు, 218 మంది హిందువులు, 23 మంది సిక్కులు, 363 మంది భద్రతాదళాలకు చెందినవాళ్లు ఉన్నారు’. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం కూడా హిందువుల మరణాలు దాదాపు ఇదే సంఖ్యలో ఉన్నాయి.
కశ్మీర్ను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి సంఖ్య దాదాపు లక్షన్నర ఉంటుంది. వీరిలో అత్యధికులు, దాదాపు 88 శాతం మంది హిందువులే (పండిట్లు). ప్రధానంగా ఈ వలస 1990 ఫిబ్రవరి-మార్చి మధ్యన జరిగింది. ఈ సమయంలో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీపీ సింగ్ ప్రధాని.
ఈ ప్రభుత్వానికి మద్దతిచ్చిన ప్రముఖ పార్టీల్లో బీజేపీ ఒకటి కావటం గమనార్హం. కానీ, కశ్మీరీ పండిట్ల వలస అనేది కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంగా బీజేపీ ఇప్పుడు వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. కశ్మీరీ పండిట్ల పునరావాసానికి కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. పండిట్ల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓట్లు రాబట్టుకోవటానికి వాడుకునే పార్టీలో బీజేపీ ఇందుకు మినహాయింపు కాదు. దీనికి సంబంధించి, వలసవచ్చిన కశ్మీరీ పండిట్ల అభిప్రాయాలే నిలువెత్తు సాక్ష్యం.
పండిట్ల వలస సమయంలో కేంద్రంలో బీజేపీ మద్దతుతో కొనసాగిన జనతాదళ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నారు. బీజేపీ నాయకుడు జగ్మోహన్ జమ్ము-కశ్మీర్ గవర్నర్గా ఉన్నారు. వారు వలసను ఆపటానికి ఎందుకు ప్రయత్నించలేదు? సినిమాలో ఈ అంశాలను ప్రస్తావించలేదు.
వలసవచ్చిన కశ్మీరీ పండిట్ల కోసం కేంద్రప్రభుత్వాలు గత పదేండ్లుగా అమలు చేస్తున్న పథకాలు.. నెలవారీ నగదు సాయం/రేషన్, ప్రధానమంత్రి రిలీఫ్ ప్యాకేజీ-2008, ప్రధానమంత్రి దేవ్ ప్యాకేజీ-2015. వీటిలో తొలి రెండూ మోదీ అధికారంలోకి రాకముందు ప్రారంభమైనవే. మన్మోహన్సింగ్ హయాంలో 2008లో రూ.1600 కోట్లతో అమలైన రిలీఫ్ ప్యాకేజీ కింద గృహనిర్మాణానికి ఆర్థికసాయం, ఉద్యోగ కల్పన, విద్యావకాశాలు, రుణాలపై వడ్డీ రద్దు వంటి చర్యలు ఇప్పటికీ తీసుకుంటున్నారు. మోదీ హయాంలో మొదలైన రిలీఫ్ ప్యాకేజీ కింద కశ్మీరీ పండిట్లకు తాత్కాలిక వసతి కల్పించటానికి 2016లో రూ.115 కోట్లు విడుదల చేశారు.
‘పొరుగుదేశాలకు చెందిన హిందువుల కోసం మోదీ ప్రభుత్వం సీఏఏ-ఎన్నార్సీని తీసుకొచ్చింది. కానీ, మా మాతృభూమి కశ్మీర్ను వదిలిపెట్టి ఢిల్లీకి వలసవచ్చిన మా గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్తోపాటు హిందూ నాయకులందరినీ అడుగుతున్నా.. మీకు హృదయం అనేది ఉందా? పండిట్ల వలస అనేది ఒక కుట్ర సిద్ధాంతం. దానిని ఎవరు ప్రచారంలో పెట్టారో మేం బయటపెడతాం. కశ్మీర్ మా మాతృభూమి. మేం అక్కడికి వెళ్లాలని కోరుకుంటున్నాం. కానీ, ఓట్లు వేయించుకోవటానికి మాత్రమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారని మాకు ఇప్పుడు అర్థమైంది’
– సతీష్ మహల్దార్, కశ్మీర్ పండిట్ల పునరావాస సంఘం (ఆర్ఆర్ఆర్కేపీ) చైర్మన్
‘30 ఏండ్ల తర్వాత కూడా మేం ఇరుకు గదుల్లో నివసిస్తున్నాం. మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ, మాకు ఏమీ లభించలేదు. మా వలసల అంశాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. 2006 నుంచీ నేను కశ్మీర్కు వెళ్లొస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు వల్ల మాకు (పండిట్లకు) గానీ, ముస్లింలకుగానీ ఒరిగిందేమీ లేదు. దానివల్ల అక్కడ పిసరంత మార్పు కూడా జరుగలేదు’
–రవీందర్ పండిత, సేవ్ శారదా కమిటీ వ్యవస్థాపకుడు
‘1990ల నుంచీ కశ్మీరీ పండిట్ల అంశాన్ని రాజకీయాల బీజేపీ కోసం ఉపయోగించుకుంది. ప్రతిపక్షపార్టీగా వాళ్లు బాగానే మాట్లాడారు. కానీ, అధికారంలో ఉన్న పార్టీగా మాకు వాళ్లు చేసిందేమీ లేదు. నేనొకప్పుడు బీజేపీకి గట్టి మద్దతిచ్చేవాడిని. కానీ, ఇప్పుడు పూర్తి వ్యతిరేకిని. హిందుత్వను, మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకునే పార్టీ బీజేపీ’
–సునిల్ పండిత (జమ్ములోని జాగ్తీ క్యాంప్లో తొమ్మిందేండ్లుగా ఉంటున్న వ్యక్తి)
‘కశ్మీర్ ఫైల్స్ సినిమా వెనుక ఒక రాజకీయ కోణం కనిపిస్తోంది. దశాబ్దాల నాటి ఉదంతానికి అర్ధసత్యాలను, అసత్యాలను జోడించి రూపొందించిన కథాంశం ఇది. ఒక మతం పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో విభజన బీజాలు నాటి రాజకీయంగా ఒక పార్టీకి ప్రయోజనం కల్పించే పన్నాగం’ అని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాలో విస్మరించిన కొన్ని అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు..
కేంద్రంలో 1990 నుంచి బీజేపీ నాలుగు పర్యాయాలు అధికారంలో ఉన్నది. వారి హయాంలో కశ్మీర్ పండిట్ల పునరావాసం కోసం చేసింది ఏమిటి? పండిట్ల పునరావాసాన్ని వ్యతిరేకించే పీడీఎఫ్తో చేతులు కలిపి కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇదే బీజేపీ కాదా? పండిట్లు మాత్రమే ఎందుకు వలస వెళ్లారు. కశ్మీర్లో సిక్కులు కూడా మైనారిటీలే కదా? వారెందుకు కశ్మీర్ను వదిలి వెళ్లలేదు. అనేకమంది ముస్లింలు కూడా కశ్మీర్ వదిలిపెట్టి పోయారు. సినిమాలో దీనిపై చర్చే లేదు.
–ఎడిటోరియల్ డెస్క్