దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ను బీజేపీ బరిలోకి దింపింది. వామపక్ష భావజాలంతో విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన… టీఆర్ఎస్ పార్టీ వేదికగా రాజకీయ అరంగేట్రం చేసిన విషయం విదితమే. కమలాపూర్, హుజూరాబాద్ నుంచి ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదనంతర రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరారు. వామపక్ష భావజాలంతో పాటు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ మల్కాజిగిరిలో చేస్తున్న ప్రసంగాలను చూసి రాజకీయ నాయకులే కాదు, ఆయన సన్నిహితులు సైతం నోరెళ్లబెడుతున్నారు.
Hate Speech | తెలంగాణపై పూర్తి పట్టు, రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన, అన్ని పార్టీల్లోని లోటుపాట్లు తెలిసిన ఈటల తన విజయభారాన్ని మోదీపైనే వేసినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. అతనే కాదు, సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్రెడ్డి, నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్, మెదక్ నుంచి బరిలో ఉన్న రఘునందన్రావు, మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ కూడా మోదీపైనే ఆధారపడుతున్నారని తెలుస్తున్నది. వారి ప్రసంగాలను వింటే ఆ విషయం అర్థమవుతున్నది. స్థానిక సమస్యలను అసలు ప్రస్తావించకుండా, అభివృద్ధి గురించి చర్చించకుండా.. ‘జమ్ముకశ్మీర్, బాంబు పేలుళ్లు, మందిర్-మసీదు, హిందూ-ముస్లిం’ తదితర అంశాల చుట్టే వారి ప్రసంగాలు సాగుతుండటం అందుకు నిదర్శనం.
దక్షిణాదిలో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో బీజేపీ అభ్యర్థులకు తెలియడం లేదు. బీసీ, ఎస్సీ నినాదాలను ఎత్తుకున్నా వర్కవుట్ కాకపోవడంతో బీజేపీ నేతలంతా రొడ్డ కొట్టుడు విమర్శలు, మోదీ పేరునే జపిస్తున్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాటినుంచి బాంబు పేలుళ్లు లేవని, రామమందిరం నిర్మించారని, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని మోదీ ఆపారంటూ చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్తూ ప్రజల మెదళ్లలో చొప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పదేండ్లలో ‘మేం ఇది చేశాం’ అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఏం చేయాలో తోచక, ఏ అంశాన్ని ప్రచారం చేయాలో తెలియక బీజేపీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అందుకే రెండు దశాబ్దాలుగా ఉత్తర భారత్లోని రాష్ర్టాల్లో అనుసరిస్తున్న వ్యూహాన్నే దక్షిణాదిలోనూ కమలం పార్టీ ప్రయోగిస్తున్నది.
దేశంలో ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయని ‘ఇండియా హేట్ ల్యాబ్’ ఇటీవల స్పష్టం చేసింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే 75 శాతం విద్వేషపూరిత ప్రసంగాల ఘటనలు నమోదయ్యాయని ఆ నివేదిక తెలిపింది. బీజేపీ నాయకులతో పాటు వీహెచ్పీ, బజరంగ్దళ్ వంటి సంస్థల నేతలు ఈ ప్రసంగాలు చేస్తున్నట్టు పేర్కొన్నది. 2023లో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని పలువురు నేతలు 668 ద్వేషపూరిత ప్రసంగాలు చేయగా.. వాటిలో 498 ప్రసంగాలు బీజేపీ పాలిత రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కావడం గమనార్హం. వాటిలో 239 ప్రసంగాలు ముస్లింలపై ప్రత్యక్ష హింసాకాండను ప్రేరేపించేవిగా ఉన్నాయి. 420 ప్రసంగాలు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, హలాల్ జిహాద్, పాపులేషన్ జిహాద్లకు సంబంధించినవి. 169 ఘటనలు ముస్లిం ప్రార్థన స్థలాలను లక్ష్యంగా చేసుకున్నవి. ముఖ్యంగా ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఎక్కువగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. అత్యంత విద్వేష ప్రసంగాలు చేసిన 8 మంది నేతల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు.
తెలంగాణలో బీజేపీకి చెందిన ఆరుగురు కీలక నేతలు ఈసారి పార్లమెంట్ బరిలో ఉన్నారు. ఆ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ర్యాలీలతో పాటు టిఫిన్ బైఠక్, చాయ్ పే చర్చ, మార్నింగ్ వాక్, అల్పాహార విందు వంటి కార్యక్రమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వారందరి ప్రసంగాలు ఒకే రీతిలో సాగుతున్నాయి. ఒకరినొకరు కాపీ కొట్టినట్టే వారి ప్రసంగాలు సాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, మేక్ ఇన్ ఇండియా’.. తదితర అంశాలే అందరి ప్రసంగాల్లోనూ ప్రధానాస్ర్తాలుగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ హై కమాండ్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే వారంతా చదువుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ ప్రసంగాల ద్వారా వారు ఆశిస్తున్నదెమిటో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఎప్పుడో పసిగట్టారు. అందుకే వారి విద్వేషపూరిత ప్రసంగాలను తిరస్కరిస్తున్నారు. వారిని, వారి ప్రసంగాలను ప్రజలు తిరస్కరించారనడానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలువనున్నాయి.
– ఫిరోజ్ ఖాన్
96404 66464