విచక్షణరహితంగా శిలాజ ఇంధనాలను కాల్చడం, వృక్షసంపదను నిర్మూలించటం వంటి మానవ కార్యకలాపాలు వాతావరణంలో సీఓ2 తదితర గ్రీన్హౌస్ వాయువుల మోతాదును గణనీయంగా పెంచాయి. సీఓ2 సాంద్రత ప్రస్తుతం ఉన్న 387 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) నుంచి 2100 నాటికి దాదాపు వెయ్యి పీపీఎంకి పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 13.9 సెంటీగ్రేడ్ ఉన్న ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.1 నుంచి 5.4 డిగ్రీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వాతావరణ మార్పులు జల వనరులు, వ్యవసాయం, పర్యావరణం, తీరప్రాంతాలు, ఆరోగ్యం తదితర అనేక అంశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు వ్యక్తిగత, సామాజికస్థాయిలో పలు చర్యలు తీసుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రజల్లో, ప్రభుత్వాల్లో పర్యావరణ స్పృహను పెంచటానికి, భూతాపం తగ్గింపునకు ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఏటా మార్చి నెల చివరి శనివారం రాత్రి 8:30 గంటలకు ఎర్త్ అవర్ పేరిట ఒక విస్తృత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈసారి అది మార్చి 26న ‘మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అనే అంశంతో జరుగనున్నది. ఈ కార్యక్రమంలో 180కిపైగా దేశాల ప్రజలు పాల్గొననున్నారు. ఎర్త్అవర్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, వ్యాపారసంస్థలు, ప్రభుత్వాలు అత్యవసరం కాని లైట్లను, విద్యుత్ పరికరాలను ఒక గంట పాటు స్విచ్ ఆఫ్ చేయాలనేది లక్ష్యం. భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి, ప్రకృతిని కాపాడాలనే అవగాహన పెంచడానికి దీనిని నిర్వహిస్తున్నారు.
2008లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా అధికారికంగా ఎర్త్అవర్ను ప్రారంభించింది. అప్పటి నుంచి హైదరాబాద్లో ఎర్త్అవర్ నిర్వహిస్తున్నారు. చాలామంది అధికారులు, క్రీడాప్రముఖులు, సినిమా నటులు దీంట్లో భాగస్వాములయ్యారు. బుద్ధవిగ్రహం, ట్యాంక్బండ్, చార్మినార్ తదితర ప్రదేశాలతోపాటు ఇంకా అనేక ప్రాంతాల్లో ఎర్త్అవర్ను పాటించడం జరిగింది. ఎర్త్అవర్లో పాల్గొనదలచిన వారెవరైనా రాత్రి 8.30-9.30 మధ్య లైట్లను, విద్యుత్ పరికరాలను ఆపి వేయాలి.
తెలంగాణలో పర్యావరణ కృషి
వృక్షసంపదను పెంచడానికి, వాతావరణంలో ఆక్సిజన్ మోతాదు పెంచి కాలుష్యం నుంచి ప్రజలను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లోభాగంగా మొక్కలు నాటే కార్యక్రమం భారీస్థాయిలో కొనసాగుతున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం చేస్తున్న కృషితో రాష్ట్రంలో పచ్చదనం (గ్రీనరీ) 3.67 శాతం పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం రైతులకు వ్యవసాయ ఆధారిత ఆదాయాన్ని పెంచటంతోపాటు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం 2015లో సోలార్ పవర్ పాలసీని రూపొందించి అమలు చేసింది. దీనికి మంచి స్పందన లభించింది. చాలామంది ప్రజలు ఇంటిపైకప్పు మీద సౌరశక్తి ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 4 మెగావాట్లుగా ఉన్న ‘సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్ల’ స్థాపిత సామర్థ్యం ఇప్పుడు 200 మెగావాట్లకు పెరిగింది. మరోవైపు, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి, net zero కార్బన్ లక్ష్యాలను సాధించడానికి విద్యుత్ వాహనాలను (ఈవీలను) ప్రోత్సహించటం తప్పనిసరి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈవీ రోడ్మ్యాప్ను రూపొందించింది. సుస్థిరత లక్ష్యాల సాధనలో తెలంగాణ ప్రభుత్వం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. పర్యావరణ అనుకూల ఇంధన వినియోగం విషయంలో కూడా ఆదర్శంగా నిలువబోతున్నాం.
నేడు జరిగే ఎర్త్ అవర్ని మనమందరం విజయవంతం చేయాలి. ఏ ఒక్క సంస్థ, ప్రభుత్వం, కంపెనీ మార్పును తీసుకురాలేవు. మార్పు కోసం ప్రతి వ్యక్తీ పాటుపడాలి. పర్యావరణ అనుకూల ఉత్పత్తులు కొనుగోలు చేయడం, పాత వస్తువులను/ఉపకరణాలను రీసైక్లింగ్కి ఇవ్వడం అందరమూ చేయదగిన పని. ఎర్త్అవర్ ప్రచారోద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం, తమ చుట్టూ ఉన్న వారిలో అవగాహన కలిగించటం వంటి బాధ్యతలు తీసుకోవాలి. దీనికి తొలిదశగా నేడు గంటపాటు లైట్లు, కరెంటు పరికరాలు ఆపివేసి చైతన్యాన్ని చాటుకోవాలి.
(వ్యాసకర్త: -జయేశ్ రంజన్, ఐటీ, పరిశ్రమ శాఖల ముఖ్యకార్యదర్శి)