ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే, ఎంత దారుణ పరిస్థితులు దాపురిస్తాయనేది యూరప్ దేశాలు అనుభవిస్తున్న ఖేదాన్ని బట్టి అర్థమవుతున్నది. పారిశ్రామిక విప్లవానికి పురిటి గడ్డయైన యూరప్ ఇప్పుడు ఆహార భద్రత కరువై ఎందుకు బాధపడుతున్నట్టు? అభివృద్ధి పేర విచ్ఛల విడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే, వినియోగ సంస్కృతితో వనరులను కొల్లగొడుతుంటే ప్రకృతి ప్రకోపానికి బలికాక తప్పదు. అందుకే వాతావరణ మార్పుల మూలంగా యూరప్ కరువు కోరల్లో చిక్కుకున్నది. వానలు కురవక తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్నది. నదులు, సరస్సులు ఎండిపోయి జల రవాణా కూడా స్తంభించిపోయింది. అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వడగాల్పులు అల్లాడిస్తున్నాయి. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్, యూకే తదితర దేశాలన్నీ 500 ఏండ్లలో ఎప్పుడూ లేని కరువును చవిచూస్తున్నాయి.
యూరప్ దేశాలను సస్యశ్యామలం చేసే నదులు ఎండిపోయి ఇసుక, రాళ్లు తేలటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. స్విట్జర్లాండ్ నుంచి.. జర్మనీ ప్రధాన పారిశ్రామిక ప్రాంతం గుండా ప్రవహించే రినే నది పూర్తిగా ఎండిపోయింది. ఇటలీలో 30నుంచి 40శాతం వ్యవసాయా నికి జీవనాధారంగా ఉన్న పో నది కనిష్టస్థాయిలో ప్రవహిస్తూ 60శాతం పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఇటలీలో 70శాతం మంచు కురువటం తగ్గిపోయింది. యూకే కూడా తీవ్ర నీటికొరత ఎదుర్కొంటున్నది. ఫ్రాన్స్ సహా వివిధ దేశాల అడవుల్లో వడగాల్పుల వల్ల అగ్గిపుట్టి అటు పర్యావరణానికీ, జీవ వైవిధ్యానికీ తీవ్ర హాని కలుగజేస్తున్నాయి. పోర్చుగల్లోనే 1,95,200 ఎకరాల్లో మంటలు విస్తరించాయి. ఈ వందేండ్లలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ యూరప్ వడగాల్పులు ఉత్తరదిశగా ప్రయాణించి ఆఫ్రికా ఉత్తరభాగాన్నీ, అమెరికా పశ్చిమప్రాంతాన్నీ, ఉత్తర మెక్సికోను ఆవహించి కరువుతో కాటేస్తుండటం గమనార్హం.
ఈ ప్రకృతి వైపరీత్యాలకు మన దేశం మినహాయింపు కాదు. ఉత్తర భారతం నిన్నమొన్నటిదాకా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నీటి కొరతను ఎదుర్కొన్నది. కొన్ని నెలల వ్యవధిలోనే కుండపోత వానలతో, వరదలతో అల్లాడిపోతు న్నది. గతి తప్పిన రుతువులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగునీరు లేకపోవటం ఒక దుస్థితి అయితే, వరదలో పంటల మునక మరో విపత్తు. ఎదుగుతున్న ఆర్థిక శక్తియైన భారత్కు ఇదొక హెచ్చరిక. వాతావరణ మార్పులతో ఏర్పడుతున్న ఉపద్రవాలు ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమై ఉండటం లేదు. ఇప్పటికైనా పర్యావరణ విధ్వంసానికి పాల్పడితే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని గ్రహించాలి. ఒక్క మనదేశమే కాదు, ప్రపంచమంతటా అభివృద్ధి విధానాలను సమీక్షించుకోవాలి. ప్రజలు విలాసాలను వదిలి నిరాడంబర జీవన శైలిని అలవరచుకోవాలి.