PM Modi | ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేకమైన అభివృద్ధి ప్రణాళిక కుట్రలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నది. దేశాన్ని మాతగా కొలిచే తాత్వికతను కలిగి ఉన్నట్టుగా ప్రచారం చేసుకొనేవారి ఆచరణ ఒక డొల్లగా కనిపిస్తున్నది. కార్పొరేట్ పెట్టుబడిదారుల ధనానికి దాసోహమై భారత మాతను నిలువెల్లా గాయాలు పాలు చేస్తున్నారు. విజ్ఞత గల ప్రజలు ఈ కార్పొరేట్ శక్తులపై ఉద్యమించాలి.
ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రపంచ దేశాలు పురోగమిస్తోంటే భారతదేశం మాత్రం తిరోగమనం వైపు వడివడిగా కదులుతున్న దైన్య స్థితి కనిపిస్తున్నది. సెప్టెంబర్ 1,2023న ఓసీసీఆర్పీ వ్యవస్థీకృత నేరాల అవినీతి నివేదిక ప్రాజెక్ట్ సమాచార హక్కు ద్వారా సేకరించిన ఒక నివేదికను విడుదల చేసింది. అత్యధిక లాభాల ప్రయోజనమే తప్ప సామాజిక ప్రయోజనం తమ నిఘంటువులో లేని కార్పొరేట్ రాబందు మైనింగ్ మాఫియా అకృత్యాలను తెలియచేసింది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్కు చెందిన ఒక సంస్థ కుట్రలను, దానికి మోదీ ప్రభుత్వ అండదండలను బట్టబయలు చేసింది.
ఇప్పటికే బలహీనంగా మార్చిన పర్యావరణ ప్రజా సభల అనుమతి చట్టాలను మరింతగా బలహీనపరచాలని లేదా వాటిని పూర్తిగా తొలగించాలని కొవిడ్-19 కాలంలో ఆ కంపెనీ సీఈవో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. ప్రభుత్వ పెద్దలను, అధికార యంత్రాంగాన్ని ప్రలోభాలతో లోబర్చుకోవడం కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. కొవిడ్ కారణంగా కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం పెంచి ఉద్యోగాలు కల్పించి బలోపేతం చేస్తామని చెప్పారు. దీంతో ఆ సంస్థకు 50 శాతం అదనంగా మైనింగ్ చేసుకోవడం కోసం అనుమతిని కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాలో అదనంగా కొత్తగా లోహ వెలికితీత ప్రాజెక్టులకు అనుమతిని కట్టబెట్టారు.
గత 9 సంవత్సరాలుగా కొందరు గుత్త పెట్టుబడిదారుల వృద్ధి కోసం కంకణం కట్టుకున్న ప్రధాని మోదీ దేశీయ మధ్యతరహా పెట్టుబడి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ గుత్త పెట్టుబడిదారుల నుంచి అత్యధిక మొత్తంలో ఎన్నికల నిధిని పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ రికార్డ్ను నమోదు చేసింది. 2016-2020 మధ్య కాలంలో ఒక కంపెనీ బీజేపీకి 6.65 మిలియన్ డాలర్ల సొమ్మును ఎన్నికల నిధిగా అందజేసినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం విదేశీ సంస్థల నుండి నిధుల సేకరణకు అడ్డంకిగా ఉన్న చట్టాలను సవరించారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్లలో చమురు, లోహ అన్వేషణ వెలికితీత పనులు నిర్వహిస్తున్న సదరు కంపెనీకి మానవతను చిదిమివేసే నేర పూరిత సంస్థగా గుర్తింపు ఉంది.
2008లో ఒడిశాలోని నియమగిరి పర్వతాల్లో గ్రామ సభల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, కనీస పునరావాసం కల్పించకుండా బాక్సైట్ తవ్వకం ప్రారంభించింది. డొంగ్రియా కొంద్ ఆదివాసులు ఆ కంపెనీ తవ్వకాలను వ్యతిరేకించారు. వీరిపై పారామిలటరీ బలగాలు, ప్రైవేట్ గూండాలను ఉసిగొల్పారు. అనేక మంది ఆదివాసుల ప్రాణాలను బలిగొన్నారు. మా పర్వతమే మా దైవం, మా అడవులు మా ఆత్మ గౌరవం, మా మనుగడ నినాదాలతో కొనసాగిన వారి పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సుప్రీంకోర్టు జోక్యంతో గనుల తవ్వకం ఆగింది. 2010లో గోవా ప్రజలు సదరు కంపెనీ మైనింగ్ను తిరస్కరించారు. 2013లో స్టెరిలైట్ లోహశుద్ధి ఫ్యాక్టరీ నిర్వహణలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆ కంపెనీకి రూ.100 కోట్ల జరిమానాను విధించింది. 2018లో తమిళనాడు ట్యుటికోరిన్లో ఆ కంపెనీ రాగి శుద్ధి కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలను కాల్చివేశారు. దీంతో ప్రభుత్వం ఆ కంపెనీని మూసివేసింది.
అనైతిక విధానాలతో గనులు తవ్వుతున్న ఆ కంపెనీ నుంచి చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్, నార్వే దేశాలు తమ ఆరు బిలియన్ డాలర్ల విలువ గల వాటాను ఉపసంహరించుకున్నాయి. కాగా భారత ప్రభుత్వం తన
అండదండలను ఇంకా కొనసాగిస్తున్నది. ఒడిషాలో రూర్కెలాతో పాటు అనేక ప్రాంతాలలో గనుల అన్వేషణకు ప్రత్యేక అనుమతులను ఇస్తున్నది.
బాక్సైట్ కోసం నియమగిరి పర్వతాలను మళ్ళీ ఆ కంపెనీకి ఇచ్చే ప్రయత్నాలను చేస్తున్నది. దీనికి కొనసాగింపుగా జాలై 28, 2023లో గనుల ఖనిజాల తవ్వకాలలో ప్రైవేట్ సంస్థలను అనుమతిస్తూ మైన్స్, మినరల్స్ అభివృద్ధి నియంత్రణ చట్టం-1956ను సవరించింది. దేశ ప్రయోజనాలకు అవసరమంటూ ప్రైవేట్ కంపెనీలు కోరుకున్న చోట ఖనిజాల అన్వేషణ చేసే అవకాశాన్ని ధారాదత్తం చేసింది. నాల్కో , ఎన్ఎమ్డీసీ, నైవేలీ వంటి 22 ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెట్ పెంచి కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకాలకు ప్రోత్సాహం ఇస్తే అవి సామాజిక బాధ్యతతో పనిచేసే అవకాశం ఉండేది.
(వ్యాసకర్త: అధ్యక్షుడు, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్)
-అస్నాల శ్రీనివాస్