చారిత్రక కథాగానం..
ఏ జాతి సంస్కృతైనా పుట్టుక, పెండ్లి, చావు, ఊరి దేవతల పండుగలు, అడవి దేవతల పండుగలు, వేల్పుల పండుగలు, పంటల సంబంధ పండుగలు, జాతరలు వగైరాల వ్యక్తీకరణతో నిండి ఉంటుంది. ఆదివాసులైన కోయలది సారవంతమైన సంస్కృతి. కోయల చరిత్ర క్రమాన్ని, విశిష్టతను చెప్పేవారిని ‘డోలీలు’ అంటారు. ఏదైనా డోలీలు వచ్చి చేయాల్సిన కార్యక్రమం ఉన్నట్టయితే ఊరంతా డోలీ బృందం కోసం ఎదురుచూస్తారు. రాగానే తగు రీతిన ‘డోలీ’ని సత్కరిస్తారు. డోలీల చప్పుళ్లతో ఊరంతా మరో లోకంలోకి పోతుంది.
కోయ జాతిలో ఆసక్తి ఉన్నవారు కథలు, పాటలు పాడటంలో ముఖ్య పాత్ర వహిస్తారు. వారిని చేరదీసి శిక్షణనిచ్చి బృందంగా తయారు చేసుకుంటారు. ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ సాంస్కృతిక శిక్షణ బదిలీ అవుతుంటుంది. కాలక్రమే ణా ఇది వంశ పారంపర్యంగా మారి, ఆ తర్వాత డోలీలు కోయ జాతిలోనే ఒక ‘ఉప జాతి’గా మారి ఉంటారు. వరంగల్, భద్రాచలం, ఛత్తీస్గఢ్లో డోలీలు ఎక్కువగా కనపడతారు. ఈ పాత్ర నిర్వహించే వారిని ఆదిలాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ‘పర్థాన్లు’గా పిలుస్తున్నారు.
కోయలు తమ దేవరలను ‘పేన్’ అంటారు. బహువచనంలో ‘పేన్క్’ అంటారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ దేవతలు ఒకే పేరుతో ఉన్నారు. ఒక్కో ప్రాం తంలో ప్రత్యేక దేవుళ్లూ ఉన్నారు. ఉదాహరణకు ‘జం గుబాయి’ దేవత ఆదిలాబాద్ ఇంకా పై రాష్ర్టాల్లో ఉన్నంత బలంగా, భద్రాచలం ప్రాంతంలో లేదు. ఇక్కడ ‘జంగుబాయి’ మరోపేరుతో ఉండవచ్చు. వంశచిహ్నాలు కొన్ని ప్రాంతాల్లో ఒకే మాదిరిగా ఉన్నాయి. ఇంకొన్ని వేరుగా ఉన్నాయి. ఇంటిపేర్లు కూడా స్వల్పంగానో ఎక్కువగానో మారి ఉంటాయి. భద్రాచలం ప్రాంతంలో ‘మడివి’ అయితే, ఆదిలాబాద్లో ‘మడావి’ అయింది. ‘సవలం’- ‘సల్వం’ అవుతుంది. భాషా శాస్త్రపరంగా చూస్తే.. దీని కారణాలు అర్థమవుతాయి. వీరికి ఉన్న ‘గట్టు’ (CLAN) వ్యవస్థ చాలా గట్టిది. ఎవరు ఎవరికి ఏమవుతారు, ఎవరిని పెండ్లి చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు.. అనేది నిర్ణయించేది కూడా ఈ ‘గట్టు’ వ్యవస్థనే. అలాగే ఏ గట్టు వారు ఏం తినకూడదో, ఏ జంతువును కొట్టగూడదో కూడా ఈ గట్టు వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఎవరి జెండా రంగు ఎలా ఉండాలో కూడా ఈ వ్యవస్థనే నిర్ణయిస్తుంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్న జాతులు చాలా తక్కువ. ఈ గట్టు వ్యవస్థను అర్థం చేయించే పనిని కూడా ఈ ‘డోలీ’లు నిర్వహిస్తున్నారు. ఏ ఇంటివారు ఎటునుంచి వచ్చారో, వారి తల్లి ఏ ఇంటివారి ఆడపడుచో వంశచరిత్ర ఆధారంగా చెప్తారు. పెండ్లి సంబంధాలు చూసేటప్పుడు, కేవలం తండ్రివైపునే గాక, తల్లి ఏ ఇంటి నుంచి వచ్చిందనేది కూడా వారికి ముఖ్యం. అదే వారి ప్రత్యేకత.
కోయ డోలీలు చెప్పే కథలో.. ప్రతాపరుద్రుడు తన చిన్న కొడుకును ‘డోలీ’గా అవమన్నాడనీ, అతని వారసులే డోలీలని చెప్తారు. అలాగే అనుకుందాం. అతను డోలీ అయ్యాడనే అనుకుందాం. అంటే అంతకు ముందు డోలీలు లేరని అనుకుందామా! అంతకు ముందే ఉన్న వ్యవస్థను కాపాడటానికి, లేదా వ్యవస్థీకరించడానికి ప్రయత్నించాడనుకోవచ్చు. ఇక్కడ ఇంకో మెలిక ఉన్నది. గణపతిదేవుడు జాయపసేనాని చెల్లెళ్లను పెండ్లి చేసుకుంటాడు. వారు పేరమ, నారమ. వారిలో ఒకరి కూతురే రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు. జాయపసేనాని ‘బోయ’ అని చరిత్ర చెప్తుంది. అయితే బోయలకూ, కోయలకూ ఉన్న సంబంధం ఏమిటీ? అనే విషయంలో సమగ్రమైన పరిశోధన జరగవలసి ఉన్నది. ఏజెన్సీలో బీరబోయి న, సిద్ధబోయిన, చెన్నబోయిన లాంటి అనేక ఇంటి పేర్లున్నాయి. కొంతమంది ‘బోయ’ అని వచ్చే ఇంటి పేర్లు గలవారు, పూర్వం తగువులు తీర్చే ‘పోయె’లుగా ఉన్నారని కోయ పెద్దలు చెప్పడం వింటాం. ‘పోయె’ అంటే కోయలో ‘అత్త’. ‘పోయె’ వ్యవస్థ ఇటీవలి కాలం వరకు ఆచరణలో ఉన్నట్టు వారి ద్వారానే వినవచ్చు.
జాతి, కులం తండ్రి నుంచి పిల్లలకు వస్తాయి. రుద్రమదేవిలో తల్లి వైపు నుంచి ‘బోయ’, తండ్రి వైపు నుంచి ఇంకో వారసత్వం వచ్చి ఉండాలి. ఇది ఒక పార్శ్వం. దీనిలోనే ఇంకో పార్శం ఏమంటే ‘బోయ’ అనేది వీరిలో ఒక పదవి కూడా. యాదృచ్ఛికంగా ఈ పేర్లు వచ్చాయా లేక ఇంకా ఏమైనా లంకె ఉన్నదా అనేది కూడా తేలవలసిన ఉన్నది.
ఇంకోవైపు నుంచి చూస్తే- కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానులు ధ్వంసం చేసిన తర్వాత, తప్పించుకోగలిగిన వారు లేదా మిగిలినవారు బస్తర్ వెళ్లి అక్కడ రాజ్య స్థాపన చేశారనేది ప్రచారంలో ఉన్న కథ. భౌగోళికంగా వరంగల్ను చూసినపుడు ఇది సాధ్యమే. ఇది మాత్రమే గాక ఇంకొకటి జరిగి ఉండే అవకాశం ఉన్నది. ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో ఎక్కువభాగం కోయలే ఉన్నారు. ఇంద్రావతి గోదావరి ఉప నది. ఇది వచ్చి గోదావరిలో వరంగల్పైన కలుస్తుంది. నదీ ప్రవాహాన్ని బట్టి కూడా చూస్తే కిందివాళ్లు పైకి వెళ్లడం కంటే, పై వాళ్లే కిందికివచ్చే అవకాశం ఉన్నది. ఇలా చూస్తే.. కోయలే వరంగల్ను ఆక్రమించి ఉండాలి.
చాళుక్యుల సామంతులుగా కాకతీయులున్నారని చరిత్ర చెప్తున్నది. కాకతీయ శబ్దానికి కోయల వైపు నుంచి దీని అర్థం, పదం పుట్టుక చెప్పవలసిన అవసరం ఉన్నది. కోయలో ‘కాకో’ అంటే ‘అమ్మమ్మ’. ‘కాకో’ పాత్ర చాలా ఉంటుంది. ముఖ్యంగా మాతృస్వామ్యంలో చాలాపెద్ద పాత్రనే. రుద్రమదేవి దానికి ప్రతీక మాత్రమే. ఇప్పటికీ ‘కాకో’ చాలా గౌరవం ఉన్న పదం. ఎక్కువమంది కొడుకులున్న వారికన్నా ఎక్కువమంది కూతుర్లున్న వారికే ఎక్కువ విలువ.
ఇలాంటప్పుడు ‘కాకో’ నుంచే కాకతీయులు వచ్చి ఉండవచ్చునని ఎందుకు అనుకోకూడదు? ఒక్కో వంశం వారికి ఒక్కో ‘పటం’ కథ ఉంటుం ది. దానిలో ఆ ‘గట్టు’కు సంబంధించిన చరిత్ర ఉం టుంది. వారి చిహ్నాలుంటాయి. ఈ బొమ్మలను చూస్తే గుర్రాలు, ఏనుగులు, యుద్ధాలకు వెళ్లే దృశ్యాలుంటాయి. ఇప్పటికీ కోయ/గోండు గ్రామాల్లో సామూహి క పనుల్లో ప్రతి ఇంటినుంచీ భాగస్వామ్యం ఉండవలసిందే. జాతికి సంబంధించిన అన్ని విషయాల్లో అందరూ పాల్గొంటారు. అన్ని వంశాల ‘పటం’ కథల్లోనూ యుద్ధ సన్నివేశాలుంటాయి. ఆ యుద్ధంలోనూ పని విభజన కూడా ఉండి ఉండాలి. ఇప్పటికీ వేటలోనూ, పండుగల్లోనూ ఈ విభజన కనిపిస్తుంది. వారి వారి శారీరక సామర్థ్యాన్ని బట్టి పనుల విభజన ఉంటుంది. అమాయకంగా కనబడే కోయల్లో ఇంత క్రమం ఉన్నదా అని మనం ఆశ్చర్యపోతాం.
కోయల రేలా నృత్యాలు, కొమ్ము డ్యాన్సుల్లో యుద్ధ ఎత్తుగడలుంటాయి. చుట్టుముట్టే ప్రక్రియ అద్భుతం. అలాగే యుద్ధ నినాదాలు కూడా గంభీరంగా ఉంటా యి. ఇవన్నీ గత చరిత్రకు సాక్ష్యాలు. కొమ్ము, గుస్సాడి నృత్యంలోనూ అడవి దున్నలు ఢీకొంటున్నట్టుగా ఉండే సన్నివేశం వస్తుంది. వెనక్కి వెళ్లి ముందుకువచ్చి ఒకరితో ఒకరు ఢీకొంటారు. ఇది నేటికీ ఆటగా మిగిలిన యుద్ధ కళ. దీనిలో కేవలం మగవారే కాకుండా, మహిళలదీ సమాన పాత్ర. సమ్మక్క-సారక్కలు యుద్ధంలో పాల్గొనడమనేది కొత్త కాదు. కోయల్లోనే కాదు, ఇతర ఆదివాసీ తెగల్లోనూ ఉన్నది.
ప్రతాపరుద్రుడికి ఎదురుతిరిగిన పగిడిద్ద రాజుకు ‘ఏటూరు నాగారం’ కోయలు ఆశ్రయం ఇచ్చారనే కోపంతో ఆ ప్రాంతంపై ప్రతాపరుద్రుడు దాడి చేసినప్పుడు జరిగిన కథనే ‘సమ్మక్క- సారక్క కథ’ అని అందరి విశ్వాసం. తర్వాత ఆమె అదృశ్యమై ‘కుంకుమ భరిణె’గా మారడం.. తరాలుగా వస్తున్న కథ.
కోయల సాంస్కృతిక, సామాజిక జీవనంపై నిబద్ధతతో పద్ధం అనసూయ (మొదట కోయ కథలు రచించారు. వృత్తి: టీచర్) ఈ ‘డోలీ’ కథలను సేకరించడానికి ఎంతో శ్రమించారు. ఆమెకు పాల్వంచ విద్యాసాగర్ సహకరించారు. వీరిని జయధీర్ తిరుమలరావు ప్రోత్సహించారు. ‘వీరుల పోరు గద్దె మేడారం’ పుస్తకానికి సహ సంపాదకత్వం వహించిన గూడూరు మనోజ, పద్ధం అనసూయ కృషి అమోఘం. వీరివల్లే ఇటీవలే ‘పద్మశ్రీ’ అందుకున్న రామచంద్రయ్య వెలుగులోకి వచ్చారు. కోయల సాంస్కృతిక చరిత్ర మరింతగా వెలుగులోకి వచ్చింది. కోయ డోలీల వ్యవస్థకు, వారి సాంస్కృతిక వారసత్వ కృషికి బలం చేకూరింది.
– గంగదేవు యాదయ్య, 90591 12105
(‘మేడారం’ జాతర సందర్భంగా..)