డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 1969 నుంచి ఆకాశవాణి, 1979 నుంచి దూరదర్శన్తో పాటు పలు సినిమాలకు గీత రచయితగా సుపరిచితులు. వడ్డేపల్లి ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాట చరిత్రను 60 నిమిషాల వ్యవధిలోనే ప్రత్యక్ష గోచరమయ్యేటట్లు ‘జయ జయహే తెలంగాణ’ అనే సంగీత నృత్యరూపకాన్ని రసభరితంగా రచించారు. ఈ రూపకాన్ని మొదట ‘సత్కళా భారతి’ ఆధ్వర్యంలో 2014 జూలై 18న రవీంద్రభారతిలో ప్రదర్శించి అందరినీ అలరింపజేసి మెప్పును పొందారు.
వడ్డేపల్లి ‘బతుకమ్మ’ పేరుతో మరొక సంగీత నృత్య రూపకాన్ని కూడా రచించి ఈ రెండు రూపకాలను ఒకే పుస్తకంగా ప్రచురించారు. ‘జయ జయహే తెలంగాణ’ రూపకంలో తెలంగాణ పోరాట చరిత్రను మూడు దశల్లో వివిధ జానపద కళారూపాల సమాహారంగా కళాత్మకంగా రూపొందించడంలో వడ్డేపల్లికి తెలంగాణ ఉద్యమ రీతులందుగల లోతైన అవగాహన, జానపద కళారూపాలపై గల అనురక్తి వెల్లడవుతున్నాయి.
మొదటి దశ ఉద్యమంలో గిరిజన యోధుడైన కొమురంభీమ్ ‘జల్- జంగల్-జమీన్’ అనే నినాదంతో.. ‘చల్! నిజాం హుకుం- గికుం ఛల్తే నహీ -యహా!’ అంటూ కొదమసింగంలా గర్జించిన కొమురం భీం గురించి తెలియజే యడంలో పాఠకుల హృదయ రంగస్థలంపై చెరగని ముద్రవేశారు. అదేవిధంగా తెలంగాణ మహిళా ఉద్యమ కెరటం చాకలి ఐలమ్మ పోరాట పటిమను ఒగ్గు కథ రూపంలో అందిస్తూ.. ‘పంజా విసిరింది- పంచాయతీ గెలిచింది- సాయుధ పోరాటంలో- తారై వెలిసింది’ అంటూ అలతి అలతి పదాలతో అతివ తెగువను ప్రదర్శనకు అనుగుణమైన రీతిలో అందించారు. అలాగే మరో పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య ‘దున్నే వాడిదే భూమి’ అంటూ అన్యాయాన్ని ఎదిరించడంలో ప్రాణత్యాగంతో చైతన్యదీప్తిగా దొడ్డి కొమురయ్య చేపట్టిన సాయుధ పోరాట బుర్రకథా రూపకాన్ని రక్తికట్టించారు వడ్డేపల్లి. ఈ రూపకంలో ఎందరో కవులు, కళాకారులు, పోరాటయోధులు, వీరులు తమ కలంతో, గళంతో, ప్రాణత్యాగంతో చూపిన పోరాట పటిమను అక్షరాయుధంతో భావితరాలకు దిక్సూచిగా నిలిపారు. అలాంటివారిలో యాదగిరి, సుద్దాల హనుమంతు, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి వారి రచనల్లోని కొన్ని పంక్తులను ఈ రూపకంలో సందర్భానుగుణంగా యధాతథంగా ఉటంకించారు. నిజాం విముక్తి పోరాటంలో కలం యోధులుగా వారు చూపిన తెగువను ప్రదర్శనాయోగ్యంగా అందించారు. ఈ రూపకంలో తెలంగాణను కళల కాణాచిగా, పుణ్యక్షేత్రాలకు ఆలవాలంగా, వీరులకు పురిటిగడ్డగా స్మరిస్తూ.. ‘నా తెలంగాణ! శిరసానమామి !జై తెలంగాణ మనసా స్మరామి..’ అంటూ తెలంగాణ తల్లికి అక్షరాభిషేకం చేశారు వడ్డేపల్లి.
1969 నాటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వంటి వారి నాయకత్వంలో విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఘటనలను సచిత్ర రూపకంగా కండ్లకు కట్టించారు. ఇక 3వ దశ పోరాటం.. రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కల సాకారమైన దశ. ఈ దశలో అంతా తానై ఉద్యమాన్ని నడిపించి, రాష్ర్టాన్ని సాధించేవరకు మడమతిప్పని పోరాటశీలి కేసీఆర్ గురించి రూపుకట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన కేసీఆర్.. ఉద్యమాన్ని నడిపించినతీరుకు తగినరీతిగా పలు దుష్టాంతాలను, సంఘటనల తాలూకు చిత్రాలను జతపరచడం ద్వారా కేసీఆర్ నాయకత్వ పటిమను ఈ రూపకంలో భద్రపరిచారు. బంగారు తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఈ రూపకం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తుందనడంలోసందేహం లేదు. వడ్డేపల్లి ఈ రూపకాన్ని స్వాతంత్య్ర సంగ్రామం తాలూకు జ్ఞాపకాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన ఆయా ప్రధాన ఘటనలకు సంబంధించిన ప్రధాన పాత్రధారులలో పరకాయ ప్రవేశం చేయగలగడం వల్లనే ఈ రూపక రచన సిద్ధించింది.
ఈ పుస్తకంలోని మరో రూపకం ‘బతుకమ్మ’. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిన పండుగ బతుకమ్మ. అందుకే వడ్డేపల్లి తెలంగాణ సంస్కృతి- బతుకమ్మ ఆకృతిగా అభివర్ణించారు. ఈ రూపకంలో బతుకమ్మను గురించి ముగ్గురమ్మల మూలపుటమ్మగా చెప్పడంతో పాటు, 12వ శతాబ్దం నాటి చారిత్రక నేపథ్యాన్ని ఉటంకిస్తూనే ఆసక్తికరమైన రీతిలో పౌరాణిక నేపథ్యంతో కూడిన ‘గంగా గౌరీ సంవాదం’ అనే జానపద కథ మూలంగా బతుకమ్మ ఏర్పడిందనే మరో కోణాన్ని ఈ రూపకంలో అందించారు.
ఈ రూపకంలో మరోచోట అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక అయిన రాఖీతో మేళవించి ‘అక్కమ్మ కథ’గా బతుకమ్మను గురించి లయాత్మకంగా, నృత్యగాన యోగ్యమైనరీతిలో అందించారు. ఈ రూపకం చివర తెలంగాణ సాధనలో సాంస్కృతిక ఆయుధంగా నిలిచిన బతుకమ్మను బంగారు తెలంగాణకు బాసటగా చూపటం ముదావహం. ఈ విధంగా పౌరాణిక, చారిత్రక, జానపద, సామాజిక అంశాల నేపథ్యంతో కూడిన పలుగాథలతో ప్రసిద్ధికెక్కిన బతుకమ్మను శరన్నవరాత్రుల్లో అర్చించే నవదుర్గావతారాల విశేష సమాహారంగా రూపొందించడంలో వడ్డేపల్లి పరిశోధనాత్మక కృషి పాఠకులను అలరిస్తుంది.
– డాక్టర్ నమిలకొండ సునీత
99084 68171