సమసమాజ సృష్టికర్త, లింగాయత్ల ఆరాధ్య దైవం మహాత్మా బసవేశ్వరుడు. అనాదిగా వస్తున్న మూఢనమ్మకాలపై తీవ్రంగా నినదించిన విశ్వగురువు, మానవతావాది, కుల, మత, వర్గ,వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు నడుం బిగించిన సంఘసంస్కర్థ. మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్న సమయంలో క్రీ.శ 1134లో ఆనందనామ సంవత్సరంలో నేటి కర్ణాటక బీజాపూర్ జిల్లా బాగేవాడిలో జన్మించారు బసవేశ్వరుడు. స్త్రీ, పురుష అసమానతలు బాల్యవివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలను ఎదుర్కొనేందుకు బసవేశ్వరుడు నాడే కృషిచేశాడు.
దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఉద్యమించిన ప్రగతిశీలి బసవేశ్వరుడు. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని, మనుషుల మధ్య, మతాల మధ్య సామరస్యం ఉండాలని కాంక్షించారు. మొట్టమొదటి కులాంతర వివాహం చేసి సమాజ గమనాన్ని ప్రభావితం చేసిన మొదటి సంఘ సేవకుడు. కులమతాల మధ్య భేదాలను తెంచి ధార్మిక, రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించి నూతన సమసమాజ ఒరవడికి శ్రీకారం చుట్టి నేటి ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
మనుషులంతా ఒక్కటే, కుల మతాల్లేవు. ఇవన్నీ స్వార్థపరుల సృష్టి అంటూ సమరభేరి మోగించిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. నేటి మన పార్లమెంటరీ వ్యవస్థతో సమానమైన అనుభవ మంటపాన్ని నాడే స్థాపించి కుల, మత, జాతి, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరికి అవకాశం కల్పించి నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బసవేశ్వరుడు.
దేశవ్యాప్తంగా ఉన్న లింగాయత్లు బసవేశ్వరుడి ప్రవచనాలతో ప్రభావితం చెంది, కోట్ల మంది గుండెల్లో నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యావత్ లింగాయత్ జాతి తలెత్తుకొనేలా బసవేశ్వరుడి జయంత్యుత్సవాలను ప్రభుత్వం
అధికారికంగా నిర్వహిస్తున్నది. దీన్నిబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్కు లింగాయత్ జాతి పట్ల, పేదల పట్ల ఉన్న గౌరవాన్ని ఔదార్యాన్ని చాటిచెప్తున్నది.
ఆర్థిక, రాజకీయ, సామాజికరంగాల్లో చితికిపోయి ఉన్న తమను ఓసీ నుంచి బీసీలో చేర్చమని గత ముప్పై ఏండ్లుగా ఉద్యమం చేస్తుంటే 2009లో బీసీల్లో చేర్చారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అన్నిరంగాల్లో వెనుకబడిన లింగాయత్ల కష్టాలు చూసి చలించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. తద్వారా ఈ సమాజంలో లింగాయత్లకు ఓ గుర్తింపు లభించింది. రాష్టంలో 10 లక్షల జనాభాకు పైగా ఉన్న లింగాయత్లను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ట్యాంక్బండ్పై బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసి జాతి గౌరవాన్ని పెంచారు. జాతి అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు బసవ భవన్ ఏర్పాటుకు స్థలం కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
రాష్ట్రంలో లింగాయత్లు బీసీలుగా చలామణి అవుతున్నా కేంద్రం వారిని ఓబీసీల్లో చేర్చలేదు. ఓబీసీల్లో చేర్చాల్సిందిగా సీఎం కేసీఆర్ కేంద్రానికి ఎన్నిసార్లు నివేదిక ఇచ్చినా కేంద్రం బుట్టదాఖలు చేయడం విచారకరం. నాడు బసవేశ్వరుడు తన ప్రవచనాలతో సనాతన ధర్మాన్ని బోధిస్తే, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనతో సమసమాజ స్థాపన కోసం, సామాజిక తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి వర్ణించలేనిది.(వ్యాసకర్త: న్యాయవాది, టీఆర్ఎస్ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ)