ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021-22లో రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రైవేటు దుకాణాలే ఆ పనిచేస్తాయి. 2021 నవంబర్లో ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పుడు ఎక్సైజ్ మంత్రిగా మనీష్ సిసోడియా ఉన్నారు. మద్యం మాఫియాను, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి, సరుకును అన్ని దుకాణాల మధ్య సమంగా పంపిణీ చేయడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి, వినియోగదారులకు మరింత మంచి సేవలు అందించడానికి కొత్త మద్యం విధానం ఉపయోగపడుతుందని ఆప్ ప్రభుత్వం పేర్కొన్నది. దేశంలోనే అత్యుత్తమ, పారదర్శక మద్యం విధానాన్ని తాము రూపొందించామని, ఇందులో కుంభకోణం వంటిదేదీ లేదని కూడా అది స్పష్టం చేసింది.
ఈ విధానంలో భాగంగానే ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రేతలకు కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. వీటి ప్రకారం వారు అమ్మకాలను పెంచుకోవడానికి వినియోగదారులకు డిస్కౌంట్లు ఇవ్వవచ్చు. ఎమ్మార్పీకి బదులుగా ఆయా బ్రాండ్లకు వారే ధరలను నిర్ణయించుకోవచ్చు. కొత్త విధానం ఫలితంగా ఎక్సైజ్ రాబడి గణనీయంగా (27 శాతం) పెరిగిందని, ప్రభుత్వానికి రూ.8,900 కోట్ల ఆదా యం సమకూరిందని ఆప్ సర్కారు వెల్లడించింది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం ఎక్సైజ్ పాలసీపై సమస్యలు సృష్టించడం మొదలుపెట్టింది. ఢిల్లీ పోలీసుశాఖ కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఆర్థికనేరాల విభాగం ఆరోపణలు, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అందిన నివేదిక మేరకు కావచ్చు లెఫ్టినెంట్ గవర్నర్ రంగప్రవేశం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన వ్యక్తే అన్నది ఇక్కడ గమనార్హం. ఎక్సైజ్ మంత్రి సిసోడియా నియమ నిబంధనలను మార్చారని, చట్టాన్ని ఉల్లంఘించారని, తద్వారా మద్యం వ్యాపారులకు అనుచిత లబ్ధి చేకూర్చారని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని విన్నవించారు. తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఒత్తిడి మేరకు, కొత్త మద్యం విధానాన్ని 2022 జూలై లో రద్దు చేశారు.
ఇప్పుడు ఈ మొత్తం మద్యం విధానంపై వినిపిస్తున్న ఆరోపణ ఏమంటే, ఎక్సైజ్ మంత్రిగా సిసోడి యా, సౌత్ గ్రూప్గా పేరు పడ్డ మద్యం వ్యాపారులకు (లైసెన్సీలకు) లబ్ధి చేకూర్చారని, అందుకు ప్రతిగా క్విడ్ ప్రో కో (ఆర్థికంగా ఇచ్చి పుచ్చుకునే లావాదేవీల)కు పాల్పడ్డారని, తద్వారా మద్యం వ్యాపారుల నుంచి వంద కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారని! దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నామినీ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఒత్తిడి మేరకు వెంటాడటం మొదలైంది. ఇందులో భాగంగా మొదట సీబీ ఐ, తర్వాత ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రంగప్రవేశం చేశాయి.
కనీస విచక్షణ, కొంచెం న్యాయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న స్ఫురణకు వస్తుంది. మద్యం విధానం అనేది రాష్ట్రం (రాష్ట్ర ప్రభుత్వం) తీసుకునే కార్యనిర్వాహక చర్య. దానివల్ల ఆర్థిక లాభనష్టాలు, పర్యవసానాలు ఏవైనా ఉంటే వాటిని చూసుకోవాల్సింది, పరిశీలించాల్సింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అంటే కాగ్. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విధానంలో లొసుగులు, ఆర్థిక అక్రమాలు ఏవైనా కనిపిస్తే, వాటిని కాగ్ ఎలాగూ ఎత్తి చూపుతుంది. ఎత్తిచూపాలి. ప్రభుత్వాన్ని తప్పుబట్టాలి. అది దాని బాధ్యత.
కానీ ఇక్కడ ఏం జరిగింది? కేవలం ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ఫిర్యాదు ఇచ్చారనే కారణంతో నే చర్యలు ప్రారంభించారు. దీనివల్ల ఒక విషయం స్పష్టం అవుతున్నది. అప్పటికే ఆప్తో యుద్ధానికి దిగి న కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దెబ్బతీయడానికి ఎటువంటి చిన్న అవకాశమైనా దొరకకపోతున్నదా అని ఎదురుచూస్తున్నది. పైకి చూస్తే ఇదే సోకాల్డ్ లిక్కర్ స్కాం. ఈ లిక్క ర్ స్కాం కేవలం ఆరోపణల్లో మాత్రమే వినిపిస్తుంది. ఏ నాటికైనా ఇది న్యాయపరంగా ఒక కొలిక్కి వస్తుం దా? దీనికి సహేతుకమైన ముగింపు లభిస్తుందా? అన్నది పూర్తిగా సందేహాస్పదం.
ఎందుకంటే ఈడీ, సీబీఐ, వీటితో పాటు ఆదాయపన్ను విభాగం (ఐటీ) కేంద్ర ప్రభుత్వ పంజరంలోని చిలకలుగా మారిపోయాయి. కేంద్రం చెప్పినట్టు పాడుతున్నాయి. ఆడుతున్నాయి. అంతే కాదు; గత కొన్నేండ్లుగా అవి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు పూర్తిగా జీ హుజూర్ అనేలా మారిపోయాయి.
సీబీఐ, ఈడీ, ఐటీ అనేవి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయన్నది వాస్తవమే అయినా, నిజానికవి తమ పనితీరులో స్వతంత్రంగా వ్యవహరించాలి. నిర్ణయాల్లో స్వయం ప్రతిపత్తిని చూపించాలి. అంతేతప్ప కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ‘యెస్ బాస్’ అన్నట్టుగా ఉండకూడదు. కేంద్రంలో అధికారంలో ఉన్న నేతల బంట్లుగా, ఏజెంట్లుగా వ్యవహరించకూడదు. ఈ సంస్థలు చట్ట ప్రకారం వ్యవహరించాలే తప్ప, అధికారంలో ఉన్న వారి ఇష్టాయిష్టాల ప్రకారం ప్రవర్తించకూడదు.
స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలు దుర్వినియోగానికి గురవుతూ అధికారంలో ఉన్న వ్యక్తులకు ఏజెంట్లుగా మారుతున్నాయి. ఎన్నికల సంఘం (ఈసీ) విషయంలో ఇటీవల జరిగిన పరిణామమే దీనికొక తాజా ఉదాహరణ. కేంద్రప్రభుత్వానికి ఏజెంట్గా ఈసీ కమిషనర్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), పార్లమెంట్లో ప్రతిపక్షనేతలతో కూడిన కమిటీ ఎన్నికల సంఘం కమిషనర్లను ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తలవంచని వారిని వేధించటానికి, బలి పశువులను చేయటానికి, నాశనం చేయటానికి ఈడీని ఎంత యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారనేది ఒక పెద్ద చరిత్ర. మనీల్యాండరింగ్ పేరిట ఎంపీలపై 51 కేసులు పెట్టారు. ఎమ్మెల్యేలపై 71 కేసులు పెట్టారు. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. రాజకీయ శత్రుత్వంలో భాగంగానే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలను వేధింపుల కోసం ఉపయోగిస్తున్నారని దీని ద్వారానే స్పష్టమవుతున్నది. కోర్టు ల్లో ఈడీ కేసులు సాధారణంగా నిలబడవు. మెజారి టీ కేసులు కాలంతో పాటు నిర్వీర్యమైపోతుంటాయి.
రాజకీయ ప్రత్యర్థులను వేధించటమనే తన పాత వ్యూహాన్నే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అమలుచేస్తున్నది. మన్మోహన్సింగ్ హయాంలో అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వాన్ని ఇదే బీజేపీ 2జీ స్కాం పేరుతో తీవ్రంగా ఇరుకునపెట్టిన విషయం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఆ అంశాన్ని గోరంతను కొండంతలు చేసి మన్మోహన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసి రాజకీయ తుపానును సృష్టించింది నాటి భారతీయ జనతా పార్టీ. మన్మోహన్ది అవినీతి ప్రభుత్వమంటూ ప్రచారం చేసి చివరికి 2014 ఎన్నికల్లో ఆయనను గద్దె దించగలిగింది. బీజేపీ గెలిచిన తర్వాత ఆ 2జీ స్కాం విషయమే ప్రస్తావనకు రావటం లేదు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్నది. ఆప్, బీఆర్ఎస్ పార్టీలను మరే విధంగానూ ఢీ కొనలేక, లిక్కర్ స్కాం పేరుతో దాడికి దిగింది. ఈ రెండు పార్టీలు తమతమ రాష్ర్టాల్లో ఎంతో బలంగా ఉన్నా యి. దీంతో బీజేపీ తన వెనుకటి వ్యూహాన్ని తీసుకొచ్చింది. ఒక కథను సృష్టించటం, దానిని సంచలనాత్మకం చేయటం, విపరీతంగా ప్రచారం జరిపి దాన్నో భారీ కుంభకోణంగా చిత్రించటం.
అత్యంత విషాదం ఏమంటే.. రాజకీయ ప్రత్యర్థులను వేధించటానికి, బెదిరించటానికి, భయకంపితులను చేయటానికి ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను కేం ద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులు ఓ వైపు తీవ్రంగా వాడుకుంటున్నారు. మరోవైపు సదరు ప్రత్యర్థులు వీరికి లొంగిపోయి, బీజేపీలో చేరితే తక్షణం వారిపై ఉన్న కేసులు, చర్యలు అన్నీ మాయమవుతున్నాయి. వారికి పూర్తిరక్షణ కల్పిస్తారు. వారొక్కటేసారి పాపుల నుంచి పు-పట్టాభి వేములపాటి8+9నీతులుగా మారుతారు. దీనికి ఎన్నో ఉదాహరణలు.. ఏపీలో సుజనా చౌదరి, సీఎం రమేశ్. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతల విషయంలో, అసోంలో కాంగ్రెస్ నాయకుల విషయంలో ఇదే జరిగింది.
తెలంగాణలో బీజేపీకి ప్రజా బలం లేదు. కాంగ్రెస్ కూడా బలహీనంగా ఉంది. కాబట్టి, బీఆర్ఎస్ను ఓడించటం సాధ్యం కాని పని. తెలంగాణ ఉద్యమం నుంచీ నేటి వరకూ ప్రజలను తన మాటలతో మంత్రముగ్ధులను చేసే కేసీఆర్ వంటి ప్రజా నాయకుడు, గొప్ప వక్త వారి వద్ద ఎవరూ లేరు. కాబట్టి కేసీఆర్ను గద్దె దించటానికి, ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ ముందున్న ఒకే ఒక దారి.. కేసీఆర్పై అబద్ధాలు ప్రచా రం చేసి ఆయనను అపఖ్యాతి పాలు చేయటం, ఆయ న పట్ల ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం. అచ్చంగా నాటి మన్మోహన్ ప్రభుత్వంపై 2014లో అమలు చేసిన వ్యూహమే ఇది.
చివరగా, నేను కోరుకుంటున్నదేమంటే.. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధిపతుల నియామకాలపైనా సుప్రీంకోర్టు దృష్టిసారించాలి. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ వీరి ని నియమించాలి. తద్వారా ఈ నియామకాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతాయి. దీనివల్ల ఈ సంస్థలు ఎవరికీ తలవంచకుండా, ఎవరి పట్లా పక్షపాతం చూపకుండా చట్టానికి అనుగుణంగా పని చేయటం సాధ్యపడుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు )
-పట్టాభి వేములపాటి