గతంలో ఎన్నో ప్రభుత్వాల్ని, ఎంతో మంది నాయకుల్ని చూశాం. కానీ ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం కలిగించే దారుణమైన పాలనని ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే చూశాం. ఇప్పుడు దేశంలో మళ్లీ అవే పరిస్థితులు అలముకుంటున్నాయి.
దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) గురించి ఇప్పటి తరాలకు పెద్దగా తెలియకపోవచ్చు. నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం సాగించిన ప్రజాస్వామ్య హననం అంతా ఇంతా కాదు. ఆ నిరంకుశత్వంపై ప్రజాస్వామ్యవాదులు పోరాడి ఘన విజయం సాధించారు. ఇందిరను గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆనాటి జనసంఘ్ నేతలూ ఉన్నారు. కానీ ఆ వారసత్వం ఇప్పుటి బీజేపీలో ఏ మాత్రం లేదు. ఈ బీజేపీ నియంతృత్వానికి నమూనాగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్ష నేతల్ని వేధిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. రాజకీయ కక్ష సాధింపు తప్ప దీంట్లో ప్రజా ప్రయోజనం అనేదే లేదని సామాన్యుడికి కూడా అర్థం అవుతున్నది.
ఢిల్లీ లిక్కర్ స్కాం పేరిట దర్యాప్తు సంస్థలే రాజకీయ ఎత్తుగడల్ని ఆచరిస్తుండటం విచిత్రం. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించి సౌత్ గ్రూప్ పేరిట ఏర్పడిన వర్గానికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. విచారణలో కొందరి వాంగ్మూలం ఆధారంగా ఈ సౌత్ గ్రూప్లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అనుమానితుల వాంగ్మూలాలు తప్ప, దర్యాప్తు సంస్థలు సేకరించిన నిర్దిష్ట ఆధారాలేవీ లేవు. అయినా కూడా అరెస్టులు జరుపుతూ దీనిని ఫక్తు రాజకీయ కక్షతో కూడిన అంశంగా మార్చేశారు. రాజకీయ కక్ష సాధింపు అనటానికి రెండు కారణాలు ఉన్నాయి. ‘లిక్కర్ స్కాం’లో నిధుల బదలాయింపు జరిగిందా? హవాలా మార్గాల్లో నిధుల సేకరణ జరిగిందా? అనే ప్రశ్నలకు ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా సూటిగా సమాధానం చెప్పడం లేదు. ఒక వర్గానికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆ వర్గం నుంచి రూ.వంద కోట్లు సేకరించారనేది ఈ సంస్థల ఆరోపణ.
కానీ, అరెస్టు అయిన వారిలో ఎవరూ నేరుగా ఆ వ్యవహారంలో పాల్గొన్నట్టు ఆధారాలే లేవు. కొందరు
అనుమానితులు చెప్పిన మాటల ఆధారంగానే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లింక్ను తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకూ తీసుకొస్తున్నారు. సీబీఐ, ఈడీ దూకుడు చూస్తే ఇది కేంద్రంలోని పెద్దలు వెనుక ఉండి నడిపిస్తున్న వ్యవహారంగా అర్థమవుతుంది.
బీజేపీ నేతలకు ఒక న్యాయం, ఇతర పార్టీలకు మరొక న్యాయం. తల వంచితే ఒక న్యాయం, నిలదీస్తే మరొక న్యాయం. ఢిల్లీ కాషాయ పెద్దల వైఖరి గత కొంతకాలంగా నియంతృత్వానికి, ప్రతిపక్షాల మీద అణచివేతకి పరాకాష్ఠగా మారింది. బీజేపీతో చేతులు కలిపితే ఎలాంటి కేసులైనా నీరుగారిపోయే పరిస్థితి, లేదంటే జైలుకు పంపించేవరకూ వెంటాడటం.. ఇది రాజకీయ కక్ష సాధింపు కాక మరేమిటి? ఇలా ఇతర పార్టీల నాయకుల్ని లొంగదీసుకొని జరుపుతున్న దిగజారుడు రాజకీయాలతోనే బీజేపీ దేశమంతా విస్తరించింది. హిమంత బిశ్వ శర్మ… ఈయన ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి. గతంలో అస్సాం కాంగ్రెస్లో ముఖ్యనేత. తరుణ్ గొగోయ్ మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వ్యక్తి. 2014-15 మధ్య కాలంలో దేశాన్ని ఊపేసిన శారదా చిట్ ఫండ్స్ కేసులో కీలక నిందితుడు. సీబీఐ, ఈడీల దెబ్బకి హిమంత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి శారదా చిట్ఫండ్స్ కేసులో అతీగతీ లేదు. పైగా తన వెంట పది మంది ఎమ్మెల్యేల్ని తీసుకొచ్చిన హిమంత అస్సాం ప్రభుత్వాన్ని కూలదోయడంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడంలోనూ ముఖ్యపాత్ర పోషించారు. 2017లో మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్లలో బీజేపీ కూటమికి అనుకూలంగా స్థానిక పార్టీల్ని మలచడంలో కీలకంగా నిలిచారు. ఈశాన్య భారతంలో బీజేపీ కూట్రలకు ఆయువు పట్టుగా నిలిచిన హిమంతకు బీజేపీ ఇచ్చిన బహుమానం, 2021లో అస్సాం ముఖ్యమంత్రి పీఠం. బీజేపీ దిగజారుడు రాజకీయాలలో హిమంత వంటి పాత్ర పోషిస్తున్న వారు ఇంకెందరో.. ఆంధప్రదేశ్లో కూడా ఇలాంటి ఉదంతాలు ఎన్ని లేవు? టీడీపీ ఎంపీలు పార్టీ మారగానే వారి కేసులు ఏమయ్యాయి? సుజన సంస్థలపై ఏకకాలంలో విస్తృత సోదాలు జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఎందుకు కిమ్మనడం లేదు? మనకి నచ్చితే ఒకలా, నచ్చకపోతే మరొకలా చట్టం పనిచేస్తుందా? ఆధారాలు సేకరించి ఛార్జిషీట్లు వేసి కీలక దశలో ఉన్న కేసులను కూడా రాజకీయ లబ్ధి కోసం నీరుగార్చేస్తారా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏళ్లు గడుస్తున్నా ఇసుమంతైనా పురోగతి ఉందా? వీటికి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు చెప్పే సమాధానం ఏమిటి?
టార్గెట్ కవిత ఎందుకు?
ఉద్యమ నిర్మాణంలో వ్యూహం ఉండాలి.. రాజకీయం నడపడంలో చాతుర్యం కావాలి.. ఈ రెండింటినీ సరైన సమయంలో, సరైన పద్ధతిలో అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట. ఆయన సాధించిన విజయాలే అందుకు తార్కాణం. రాజకీయాల్లోనే కాదు, అభివృద్ధి ఫలాల్ని ప్రజలందరికీ పంచడంలోనూ ఆయన దార్శనికత తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అయ్యింది. ఇప్పుడు అదే నమూనాని దేశవ్యాప్తం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. దేశ రాజకీయాల్లో విపక్షాలే లేకుండా వాటిని నాశనం చేయాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వానికి ఇది మింగుడు పడటం లేదు. బీఆర్ఎస్ను కేసీఆర్ తెలంగాణ పొరుగునున్న ఏపీ, ఒడిశా, మహరాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో వ్యూహాత్మకంగా విస్తరిస్తున్నారు. తదుపరి లక్ష్యం ఉత్తరాది రాష్ర్టాలే. ఈ విస్తరణ ప్రణాళికను అమలు చేయడంలో కీలక భాగస్వామి కాబోతున్నారు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత.
కవిత రాజకీయ పార్టీ నేతగా కంటే తెలంగాణ సంస్కృతికి ప్రతినిధిగా నిలవడానికి కారణం తెలంగాణ జాగృతి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆడపడుచుల్ని ముందుండి నడిపించారు ఆమె. అటువంటి భూమికను ఉత్తరాది రాష్ర్టాల్లో కూడా కవిత పోషించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేశారు. భారత జాగృతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంస్కృతి, మహిళాభ్యుదయంపై చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టే బాధ్యతని ఆమెకి అప్పగించారు. దీంట్లో భాగంగానే మహిళా రిజర్వేషన్లపై ఢిల్లీ కేంద్రంగా పోరుకు కవిత సన్నద్ధమయ్యారు. దేశంలోని 16 రాజకీయ పార్టీలు ఈ ఆందోళనకి మద్దతు పలికాయి. ఈ పార్టీలతో పాటు, 29 రాష్ర్టాల్లో మహిళాభ్యుదయంపై జోరుగా పని చేస్తున్న పలువురు ఉద్యమకారుల్ని ఈ ఆందోళనల్లో కవిత భాగం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెని టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకత్వం దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడంతో పాటు స్థానిక బీజేపీ నేతలతో పస లేని విమర్శలు చేయిస్తున్నది.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా.. రాజకీయ కుట్రలతో ప్రభుత్వాలను కూలదోయడం, గవర్నర్ల వ్యవస్థతో అదుపు చేయడం, కేసుల పేరిట వేధించటం అనే త్రిసూత్రాన్ని మోదీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అమలు చేస్తున్నారు. పంజాబ్, తెలంగాణల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు వేసిన పాచికలు పారక పోగా బీజేపీ పరువు పోయింది.
ప్రతీకారంగా ఆయా పార్టీల నేతలపై అవినీతి మకిలి అంటగట్టే కుటిల రాజకీయాల్ని కాషాయ దళం అమలు చేస్తున్నది. ఈ ధోరణి దేశానికి అత్యంత ప్రమాదకరం. మరోసారి ఎమర్జెన్సీ దారుణాల్ని ఎదుర్కోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నియంతలైనా ఓడిపోవాల్సిందే. బీజేపీ కుట్రలకు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు.
డాక్టర్ తోట చంద్రశేఖర్
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు)