2004లో వాజపేయి పేరు ప్రతిష్ఠలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఆయనను ఎదుర్కొనే జాతీయస్థాయి నాయకుడుగానీ, నాయకురాలుగానీ లేరు. మరోసారి ఆయన విజయం ఖాయమన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ, భారతదేశ ప్రజానీకం బీజేపీని ఓడించింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం కానున్నది. అప్పట్లాగే ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికలను రాష్ర్టాల ఎన్నికల సమాహారంగా ప్రతిపక్షాలు మార్చాలి. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీయాలి.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మీడియాగానీ, చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం గానీ ఎప్పటిలాగే.. నరేంద్రమోదీ అజేయుడని, ఆయనను ఓడించటం ఎవరితరం కాదని, 2024 లోక్సభ ఎన్నికల ఫలితం ఇప్పటికే నిర్ధారణయ్యిందని అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ఎంత మెజారిటీతో విజయం సాధిస్తుందనేదే ఈ అవాస్తవాల ప్రచారహోరులో ఉన్న ఏకైక అంశం. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే చర్చ అనటంలో ఎటువంటి సందేహం లేదు. 2024లో బీజేపీని ఓడించగలం. దీనికి అనుసరించాల్సిన మార్గం ఏమంటే, లోక్సభ ఎన్నికలను రాష్ర్టాల ఎన్నికల సమాహారంగా మలచడమే.
ఏయే ప్రాంతాల్లో బలమైన పార్టీలను ఎదుర్కొన్నదో అక్కడ బీజేపీ చతికిలబడింది (ప్రాంతీయపార్టీలు అనే పదాన్ని నేను వాడటం లేదు. ఎందుకంటే, వాటిలో కొన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలున్నాయి). హిమాచల్ప్రదేశ్, పంజాబ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే 240 సీట్ల మార్కును చేరుకోవటం బీజేపీకి చాలా కష్టమవుతుందని సులభంగానే తెలుస్తుంది. 2021 మే నెలలో పశ్చిమబెంగాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని మోదీ, షానే ముందుం డి నడిపించారు. ఆ ఎన్నికల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత నిరాశలో కూరుకుపోయిన ప్రతిపక్షాలకు ఈ ఘనవిజయం తక్షణ శక్తినిచ్చింది. రాష్ట్రంలోని ప్రజానీకానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటం ద్వారా, స్థానిక అంశాలపై దృష్టిపెట్టడం ద్వారా బీజేపీ ఎన్నికల మంత్రాంగాన్ని నిలువరించవచ్చని బెంగాల్ విజయం స్పష్టంగా నిరూపించింది.
2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 18 ఎంపీ స్థానాలను గెల్చుకున్నది. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేదు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ’గా చెప్పుకొనే బీజేపీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో అదృష్టం వరించినా కూడా ఆరు సీట్లకు మించి రావు. అంటే, బీజేపీకి ఆ ఒక్క రాష్ట్రంలోనే 12 సీట్లు తగ్గుతాయి. విపక్షాలకు 12 సీట్లు పెరుగుతాయి. విపక్షాలకు నికరలాభం 24 సీట్లు. బీహార్లో కూడా బీజేపీది ఇదే పరిస్థితి. కేవలం ఈ రెండు రాష్ర్టాలే బీజేపీకి లోక్సభలో మెజారిటీ దక్కకుండా అడ్డుకోగలవు.
2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 18 ఎంపీ స్థానాలను గెల్చుకున్నది. కానీ, ఈసారి ఆరుకు మించి రావు. ఆ ఒక్క రాష్ట్రంలోనే బీజేపీకి 12 సీట్లు తగ్గి, విపక్షాలకు 12 సీట్లు పెరుగుతాయి. విపక్షాలకు నికరలాభం 24 సీట్లు. బీహార్లో కూడా బీజేపీది ఇదే పరిస్థితి. కేవలం ఈ రెండు రాష్ర్టాలే బీజేపీకి లోక్సభలో మెజారిటీ దక్కకుండా అడ్డుకోగలవు.
బీజేపీని ఓడించటానికి జాతీయస్థాయిలో ఒక నాయకుడు లేదా నాయకురాలితో కూడిన ప్రతిపక్షాల మహాకూటమి అవసరమే లేదు. వివిధ రాష్ర్టాల్లో సరైన పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు, ఎత్తులు మాత్రం తప్పనిసరి. 2024 ఎన్నికలకు అవసరమైన ఒక విస్తృతమైన వ్యూహం విపక్ష కూటమి వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్నది. సమర్థులైన ముఖ్యమంత్రులు/ మాజీ ముఖ్యమంత్రులు వర్సెస్ అన్నివిధాలా విఫలమైన ప్రధానమంత్రి కేంద్రంగా ఈ పోటీ ఉండనున్నది. భారతీయులందరికీ గృహ వసతి, ప్రతీ ఇంటికీ విద్యుత్తు, మంచినీరు, ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ, బుల్లెట్ ట్రెయిన్ మొదలైన హామీలన్నింటినీ 2022 నాటికి నెరవేరుస్తానని చెప్పిన ప్రధాని వీటిలో ఏ ఒక్కదానినీ నెరవేర్చలేదు. అంతేకాదు, 2022లోగా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని కూడా ఆయన చెప్పారు. అది సాధ్యం కావాలంటే, 2015 నుంచి 2022 వరకూ అన్నదాతల ఆదా యం ఏటా 10 శాతం చొప్పున పెరగాల్సి ఉం డేది. కానీ, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే రైతుల వాస్తవ ఆదాయంలో వృద్ధి కేవలం 3 శాతానికి పరిమితమైంది. ఉద్యోగాల కల్పనలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2014 నుంచి ఇప్పటివరకూ 22 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభు త్వం ఏడు లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. ఇవి నేను చెప్తున్న అంకెలు కావు. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో సమర్పించిన వివరాలు.
ప్రధాని మోదీని ఎదుర్కొనే పార్టీ రాష్ట్ర, రాష్ర్టానికీ మారుతుంది. కానీ లేవనెత్తే అంశాలు మాత్రం ఒకే విధమైనవి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మతసామరస్యానికి విఘాతం వంటివి ప్రభుత్వ అసమర్థతను మరింత తేటతెల్లం చేస్తాయి. విపక్షాల ప్రాథమిక సందేశం ఇదే అయి ఉండాలి. దీంతోపాటు ద్వితీయ సందేశం కూడా విపక్ష కూటమి నుంచి వెలువడాలి (ద్వితీయ అంటున్నందుకు నన్ను తప్పుపట్టవద్దు. ఇదికూడా ప్రధానమైనదే కానీ ప్రజలను అంతగా ఆకట్టుకోదు అనేదే నా అభిప్రాయం). పార్లమెంటు, దర్యాప్తు ఏజెన్సీలు, మీడియా తదితర సంస్థల ను మోదీ ప్రభుత్వం ఏ విధంగా కుప్పకూల్చిందన్నది ఈ ద్వితీయ సందేశం.
2024లో బీజేపీని ఎదుర్కోవటానికి ప్రతిపక్ష పార్టీలు ఈ రెండు అంశాలపై ప్రముఖంగా దృష్టి పెట్టాలి. ఇది జరగదని, ఇది సాధ్యం కాదని అనేవాళ్లుంటారు. వారికి నేను చెప్పేదొకటే.. ‘2004 లోక్సభ ఎన్నికలను ఒకసారి పరిశీలించండి’. అదికూడా రాష్ర్టాల ఎన్నికల సమాహారమే. నాడు వాజపేయి పేరు ప్రతిష్ఠలు ఉచ్ఛస్థాయిలో ఉన్నాయి. ఆయన మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమనే అంచనాలు బలంగా ఉన్నాయి. అచ్చం ఇప్పుడు మోదీలాగే. అంతేకాదు, ‘నయా భారత్’ (న్యూ ఇండియా) అంటూ ఇప్పుడు బీజేపీ ఇస్తున్న నినాదంలాగే వాజపేయి సమయంలో కూడా ‘భారత్ వెలిగిపోతున్నది’ (ఇండియా షైనింగ్) అనే నినాదాన్ని ఆ పార్టీ ఇచ్చింది. బీజేపీని ఓడించటానికి భారతదేశ ప్రజానీకం నాడు సమైక్యమైంది. దాన్ని నరేంద్రమోదీ మర్చిపోయి ఉండరు.
(వ్యాసకర్త: తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ)
(‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో..) డెరెక్ ఓబ్రియన్