మనకు పైకి కనిపించే రాజకీయాలు వేరు, కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్. వందేండ్లుగా తన పార్టీ కొనసాగిస్తున్న రాజకీయ సంస్కృతి బాటలోనే నడుస్తూ, ఒక బలమైన యుద్ధతంత్రంతో దూకుడుగా వ్యవహరించి, శ్రమించి తాను అనుకున్నది సాధించగలిగారు రేవంత్రెడ్డి. ఆయన పాటించిన ఆ యుద్ధతంత్రం ప్రజాస్వామికమా, అప్రజాస్వామికమా అన్నది వేరే విషయం. ఆ యుద్ధతంత్రానికి ఆక్సిజన్ అందించిన అత్యంత నికృష్టమైన గోబెల్స్ ప్రచారానికి కూడా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరోక్షంగా సహకరించిందన్న విషయం కూడా ఇక్కడ అప్రస్తుతం.
CM Revanth Reddy | ఒక పటిష్ఠమైన యుద్ధప్రణాళికతో ఎలాగైతేనేం రేవంత్రెడ్డి అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజలు కూడా నిజంగానే అదేదో మార్పు అవసరమేమోనని నమ్మారు. ఆత్మహత్యాసదృశ్యమైన ఆ మార్పునకు కారణమయ్యారు. తెలంగాణకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సంతోషం. ఇక్కడి వరకూ ఓకే. ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఏదైతేనేం రేవంత్రెడ్డి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం ఎవరూ కాదనలేని వాస్తవం.
ఒక వ్యక్తిలో ఉండే భాషా పటిమ, వ్యక్తీకరణలే ఆ వ్యక్తిని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి. మనం వాడే భాష మన సంస్కృతిని తెలుపుతుంది, మనమేంటో ఇతరులకు తెలియజేస్తుంది. ఫక్తు రాజకీయాల కోసం.. ఏదేమైనా సరే ప్రజల్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవడం కోసం.. ఎన్నికలకు ముందు ఏదిపడితే అది మాట్లాడితే చెల్లిందని, ఇప్పుడు కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కుదరదు. అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు రేవంత్రెడ్డి విషయంలో జరుగుతున్నది అదే.
తెలంగాణ ప్రజలు మార్పు మాయలో పడి కొట్టుకుపోతూ బంగారు పళ్లెంలో అధికారం అందించి, ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలిచ్చిన ఆ పదవిని రేవంత్రెడ్డి కాపాడుకోవాలి. ఆ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లెక్కలేనన్ని అంశాల్లో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టిన తెలంగాణ రాష్ర్టాన్ని, ఆ స్థాయి నుంచి మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేయాలి. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కేసీఆర్ వేసిన ఎన్నో కొత్తదారుల్ని మరిన్ని కొత్తపుంతలు తొక్కించడం మీద దృష్టిపెట్టాలి. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. కానీ, దురదృష్టవశాత్తూ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విషయంలో అలా జరగటం లేదు.
తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని అనుకుంటున్నారు రేవంత్రెడ్డి. తెల్లారిలేస్తే ఇంకా కేసీఆర్తో, బీఆర్ఎస్తో కొట్లాడుతున్నానని భ్రమపడుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాను కొనసాగించాల్సిన మహాయజ్ఞం బహుశా ఇదే కొట్లాట, ఇదే తిట్ల పర్వం అనుకుంటున్నారాయన. అందుకేనేమో ముఖ్యమంత్రి హోదాలో దావోస్కు వెళ్లినా అవే తిట్లు, లండన్ వెళ్లినా అవే చెత్తమాటలు. ఎక్కడ మైక్ కనిపించినా అవే అరుపులు, కేకలు, అవే బూతుపురాణాలు.
‘గోరీ కడతా, బొందపెడతా, వంద అడుగుల లోతున పాతిపెడతా, బిడ్డా బయటికొస్తే బోన్లో వేస్తాం’.. ఇవీ నేతాశ్రీ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు. అసలేంటీ మాటలన్ని? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?
అడ్డా మీద కూలీ నుంచి పైకి ఎదిగిన ఒక గుంపు మేస్త్రీ కూడా కొంచెం ఒద్దికగా ఒక లెవెల్ మెయింటెయిన్ చేస్తారు. ఆచితూచి మాట్లాడుతారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంకెంత జాగ్రత్తపడాలి? తన మీద, తన మార్పు ఆయుధంపైనా అపారమైన నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల్లో ఇంకెంత గౌరవం పెంపొందించుకోవాలి? కానీ, అలా జరగడం లేదు. ‘యథా రాజా తథా ప్రజా’లాగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా ‘తొడ కొడితే గుండె పగులుతుంది’ అంటూ అదే స్థాయి తిట్ల దండకం, అదే స్థాయి భాషను వాడుతుండటం మరింత శోచనీయం.
డిసెంబర్ 9 నుంచి అమలు చేసి తీరుతామని సవాల్ చేసి ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు ఎంత కష్టమో రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యాక బాగా అర్థమైంది. అరకొరగా అమలవుతున్న మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల కొత్త ఇబ్బందులు, నష్టాలు మొదలయ్యాయి. గిరాకీల్లేక జీవితం దుర్భరమవడంతో ఆటోవాలాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుబంధు గురించి అడిగితే చెప్పు దెబ్బలంటున్నారు. కరెంటు కట్ షురూ అయింది. గత పదేండ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అసౌకర్యం, కరెంట్ కోతలు లేకుండా జెట్ స్పీడ్తో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన పరిశ్రమల అధినేతలంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని పరిశ్రమలు, కంపెనీలు పక్కరాష్ర్టాలకు తరలిపోతున్నాయి. రేవంత్రెడ్డి దృష్టి పెట్టాల్సింది ఇటువైపు. ‘కేసీఆర్ రాష్ర్టాన్ని దోచుకున్నారు, అప్పులపాలు చేశారు’ అని చెప్పిందే చెప్పి, అరిగిపోయిన క్యాసెట్ను మళ్లీమళ్లీ వినిపించడంపై కాదు.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా ఆ దేశాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రధాన ఎజెండాగా ఉండే బ్లూప్రింట్ మారదు. మరింత బాగా పని చేస్తూ సొంత పార్టీ ఇమేజ్ను ప్రజల్లో పెంచుకొనే ప్రయత్నం చేస్తారు. అంతేకానీ, ఎదుటి పార్టీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బొందపెట్టరు. మరింత పోటీ పడి ప్రజల కోసం, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారు. అందుకే ఆ దేశాలు అంత శక్తిమంతమైన దేశాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గత పదేండ్లలో అలాంటి దృక్పథంతో రాష్ర్టాభివృద్ధి కోసం కృషి చేశారు. తానే ఇంకో వందేండ్లు పాలించాలనుకోలేదు. తన తర్వాతి తరం వాళ్లకు కొత్తదారులు వేశారు. గత 60 ఏండ్లుగా ఎవరూ సాధించలేని ఎన్నెన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేవలం నాలుగైదేండ్లలో అత్యంత విజయవంతంగా సాధించి చూపించారు. తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా చేసేందుకు ఎలా ఆలోచించాలో, ఎంతగా కృషి చేయాలో చూపిస్తూ ఒక కొత్త రెడ్ కార్పెట్ దారి వేసిపెట్టారు కేసీఆర్.
ఆ రెడ్ కార్పెట్పై హుందాగా నడుస్తూ, ఒక ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి మరెంతో సాధించాలి. తనపై నమ్మకం పెట్టుకొన్న ప్రజలను మెప్పించాలి, ఆ ప్రజల జీవనస్థాయిని మెరుగుపరచడం కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప, రేవంత్రెడ్డి అనగానే అరుపులు, కేకలు, బోన్లో పెడతా, బొంద పెడతా వంటి మాటలు తప్ప ఏం లేదు అనుకునేలా చేసుకోవడం నిజంగా బాధాకరం. ఇదిలాగే కొనసాగితే మాత్రం మార్పు కోరిన అదే తెలంగాణ ప్రజలు అసలు సిసలైన మార్పుని వీలైనంత త్వరలోనే సాధించుకుంటారు.
– మనోహర్ చిమ్మని