చైనాలోని వూహాన్లో మొదటి కరోనా కేసు బయటపడ్డప్పటి సంది పానాలు పిడికిట్ల వెట్టుకొని బిక్కుబిక్కుమంటూ, భయంభయంగా బతుకుతున్నది యావత్ ప్రపంచం. దీనికంతటికి కంటికి కనిపించని, అతిసూక్ష్మ ‘కరోనా వైరస్’ ఒక కారణమైతే, అగో కరోనా.. ఇగో కరోనా.. అనుకుంట అడ్డగోలు ప్రచారం ఇంకో కారణం. టీవీ ఛానెళ్లతో పాటు సోషల్మీడియా పోటీ పడి ఎగవడ్డయి.
మాస్కులు పెట్టుకోవాలె, చేతులు కడుక్కోవాలె ’ అని మొత్తుకుంటున్న కాలం. అప్పటికింకా మన దేశంలో ఒక్క కరోనా సుత కనిపించలేదు. కానీ, కొవిడ్-19 చైనాలో బీభత్సం సృష్టించిది. చాలామంది పానాలు కోల్పోయిర్రు. పానాలు పోయినోల్లను చచ్చిన కోళ్ల లెక్క కుప్పలు పోసి అగ్గిపెడుతున్నరనే వార్తలు భగ్గుమన్నయి. అంటే బీభత్సం జరగలేదని కాదు, జరిగింది కొంతైతే వ్యాపించింది కొండంత. వాట్సాప్, ఫేస్బుక్లల్ల ఎక్కడచూసినా వూహాన్ పేర ఫేక్ వీడియోలే! ఎక్కడో తూర్పు ఆసియాలో జంతువుల మార్కెట్ను చైనాల ఉన్నట్టు చూపించిండ్రు. ఆ వీడియోలను చూసినోల్లకు ఎవ్వలికైనా ఒళ్లు జలదరించక మానదు.
కన్నారం పోయినప్పుడు తెలిసిన ఓ డాక్టర్తో మాట్లాడుదామని ఆయన దవాఖానకు వోయ్న. ‘కీళ్లన్ని ఇగ్గుకొస్తున్నయి, కాళ్లు లెవ్వనిస్తలెవ్వు.. సారూ జర నీ దయ ఏమన్న గోలీలు రాయి..’ అనుకుంటా కన్నారం దగ్గరి పల్లెటూరి నుంచి ఒక ముసలమ్మ వచ్చింది. ముక్కుకు కొంగడ్డం పెట్టుకున్నదామె. ‘ఏమైందమ్మా, ముక్కుకు కొంగడ్డం పెట్టుకోవడ్తివి, మా దగ్గరేమన్న వాసనొస్తున్నదా..?’ అని అడిగిన. ‘ఇష్షి పాడుగాను గట్లంటరేంది సారు… అదేదో కర్నా అంట గదా… ముక్కు, మూతి మూస్కోకుంటే అదొస్తదట గదా..’ అన్నదామె. ‘అదొస్తే ఏమవుతుందమ్మా..?’ అడిగిండు డాక్టర్. ‘ఇషవ్వా.. ఇంతబతుకు బత్కి ఇంటెన్క సచ్చినట్టు ఇన్నొద్దులు మంచిగ బతికి గా కర్నా రోగమచ్చి సత్తమా సారు.. మనుషులు గూడ దగ్గరికొస్తలేరు. కోళ్లను ఒక్కకాడేసి కాలవెట్టినట్టు, శపాలను ఒక్కకాడేసి అగ్గివెడ్తున్నరు. ఇంతన్యాలమా సారు.. నిన్న నా మన్వడు ఫోన్ల సూపెడితే పానం తల్లడిల్లింది’ అని చెప్పవట్టింది ముసలమ్మ.
ఎక్కన్నో.. ఏ దేశంలనో ఏదో జరిగిందనే పుకారు చెలరేగిపోతుంటే క్షణాలల్ల ఆ వార్త ఓ పల్లెటూర్లో ఉన్న ముసలమ్మకు (ఆమె చదువుకోలేదు కూడా) తెలిసింది. ఆ వార్తతో ఆ ముసలమ్మకు ఒనగూడే ప్రయోజనం ఏమన్నా ఉందా..? పైగా ఇంకొన్నద్దులు సంబురంగా బతికే ఆ అమ్మకు ఎక్కడేవైరస్ సోకుతదో, సచ్చిపోతే ముట్టుకుంటరో ముట్టుకోరో అనే భయం వట్టుకున్నది. ఆ ముసలమ్మ భయాన్ని చూసిన నాకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నదో అర్థమైంది. కరోనా కొందరికి కన్నీరు మిగిలిస్తే… కొన్ని కార్పొరేట్ దవాఖానలకు మాత్రం కోట్లు కుమ్మరించి పెట్టింది.
ఇటీవల.. నిమ్స్ దవాఖానలో ఓ తెలిసిన డాక్టర్ దగ్గరికి వోయ్న. అప్పుడే ఓ పెద్దమనిషి ఆ డాక్టర్ దగ్గరికి అచ్చిండు. మాస్కులేకుండా లోపల్కి వచ్చిండు. ‘తాతా… ఓ మాస్కు లేదు, దస్తీ లేదు ఇట్లా సక్కగ డాక్టర్ దగ్గర్కి అస్తే ఎట్లనే’ ఆగలేక ఓ మాట అన్న. ‘ఇంకెక్కడి కర్నా సార్.. అచ్చింది, పోయింది. మొన్న రెండ్రోజులు తలికాయ నొచ్చినట్టయి, శాతగాకుంట అయితున్నదని, మా పెద్దోనికి చెప్తే పట్కపొయి కర్నా టెస్టు చేపిచ్కచ్చిండు. కర్నా ఉన్నట్టు తేలింది. అక్కన్నే డాక్టర్లే సర్కారు మందులిచ్చి ఇంట్ల వారం ఉండుమన్నరు, నాకు రెండు మూడ్రోజులకే సర్ది, దగ్గు, జరం, తలికాయి నొప్పి.. అన్నిరోగాలు మాయమైనయి. అంతే సారూ.. కరోనా అస్తది, పోతది.. దాని పని అది చేస్కుంటది, మన పని మనం జేస్కోవాలె’ అన్నడు.
ఆ పెద్ద మనిషి పోయినంక డాక్టర్ సాబ్తో కొద్దిసేపు మాట్లాడుకుంట కూసున్న. కరోనా సంగతి, ఎనుకటి రోగాల సంగతి కొద్ది సేపు చెప్పిండు డాక్టర్. కరోనా అసువంటి రోగాలు ఎన్కట గూడ వచ్చినయి. జనాన్ని కిందమీద జేసినయి. కానీ అప్పుడు ఇప్పట్లెక్క సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు. విష ప్రచారాలకు చోటు దక్కలేదు. నా గతంలోకి వెళ్లి చూస్తే… ‘ఫ్లూ’ వ్యాధి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి ఊరవుతల ఓ చెట్టు కింద ఉంచేవారు. తర్వాత ఆ వ్యాధికి టీకా, మందులు కూడా వచ్చినయి. రానురాను కరోనా కూడా అంతే. ఇదే చివరి వేవ్ అనుకుంటా… లేదంటే ఇంకో వేవ్. కరోనా కూడా ఓ ఫ్లూ వ్యాధి లెక్క మిగిలిపోవలసిందే. అంతేకానీ ప్రపంచమేం అంతరించిపోదు’ అని డాక్టర్ సాబ్ చెప్పిండు.
ఏ పని దిక్కులేనోల్లు కొందరు ఈ వాట్సాప్, ఫేస్బుక్కులతోటి టైంపాస్ జేస్తున్నరు. వట్టిగ పొద్దుగడిపితె సరే, కని అక్కరకొచ్చే ముచ్చట్లను గూడ వంకరచేసి పంపేటోళ్లను సూత్తనే ఎక్కల్లేని కోపమొస్తది. ‘కరోనా’ మనిషి జీవితంలో బాగమైపోతది. సర్ది అచ్చినట్టే అస్తది, పోతది. ఒమిక్రాన్ వల్ల ఒనగూడే నష్టం లేదు. అయ్యొ గింత జెప్పన పోతున్నదని బాధవడేది కార్పొరేట్ దవాఖానోల్లే. నాలాంటి పేదోళ్లకైతే – కరోనా కథ కంచికి, మనం ఇంటికి!
– గడ్డం సతీష్
99590 59041