తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిర్దేశానుసారం ఆ పార్టీ పని చేసిందా? అనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే.. మెజారిటీ తెలంగాణవాదులు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. తెలంగాణ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పావులు కదిపింది. అధికారంలోకి వచ్చిన
దగ్గర్నుంచి కాంగ్రెస్ నాయకులు రోజుకొక కట్టు కథనం లేదా లీకుల పేరిట పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై విషం చిమ్మారు. రాష్ట్రం దివాలా తీసిందని, కాళేశ్వరం నిరర్థకమని, రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఈవీ రేస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ పేరిట వివిధ మాధ్యమాలలో కట్టు కథలు అల్లి నిరంతరం ప్రసారం చేశారు.
BJP-Congress | పచ్చ మీడియా కూడా ఇదే అదనుగా భావించి తెలంగాణపై, కేసీఆర్పై ఉన్న కక్షతో కట్టు కథలను వండి వార్చింది. ఆంధ్రకు చెందిన చంద్రబాబు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ లేదా బాబు శిష్యుడి పార్టీ కాంగ్రెస్ గెలవాలన్నదే పచ్చ మీడియా లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకూడదనే ఏకైక ఉద్దేశంతోనే పచ్చమీడియా పని చేసిందని ఫలితాలను చూస్తేనే స్పష్టమవుతున్నది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, కరీంనగర్, మహబూబ్నగర్ మొదలగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలో జాప్యం, ప్రచారంలో అలసత్వం వంటి అంశాలను పరిశీలిస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించినట్టు తేటతెల్లమవుతున్నది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీల పరోక్ష సహకారం గురించి ఈ సందర్భంగా చర్చించుకోవాలి. కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీకి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు ఇచ్చిందనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా మల్కాజిగిరిలో బీజేపీ సహకరించడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అటు బీజేపీ కూటమిలో, ఇటు కాంగ్రెస్ కూటమిలోనూ లేని ప్రాంతీయ పార్టీలను ఆ రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కై దెబ్బకొట్టాయని 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ను బీజేపీ-కాంగ్రెస్ కలిసి దెబ్బకొట్టగా, అంధ్రాలో షర్మిల ద్వారా బీజేపీ కూటమితో అంటకాగిన కాంగ్రెస్.. జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ పుంజుకుంటే తమకు పుట్టగతులు ఉండవనే భయంతోనే రెండు ఢిల్లీ పార్టీలు తెలంగాణ ఇంటి పార్టీని దెబ్బకొట్టాయి. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓటర్లను పోలరైజ్ చేయటానికి మాధవీలతను బీజేపీ వాడుకోగా.. మైనారిటీ, దళిత ఓటర్లను కాంగ్రెస్ వైపు పోలరైజ్ చేయటానికి ఒవైసీతో పాటు రాజ్యాంగంలో మార్పు, రిజర్వేషన్ల రద్దు లాంటి అంశాలను కాంగ్రెస్ వాడుకున్నది. ఈ విధంగా బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటూ కేసీఆర్, బీఆర్ఎస్ను దెబ్బకొట్టడంలో ఈసారి సఫలమయ్యాయి. ఈ సందర్భంగా
‘You can fool All the people some time
Some people all the time
But not all the people all the time’.. అనే అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ సూక్తిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
బీజేపీ-కాంగ్రెస్ పార్టీల కుట్రను ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ పార్టీల పన్నాగం పూర్తిగా అర్థమైన రోజు రెండు ఢిల్లీ పార్టీలను ప్రజలు తెలంగాణ నుంచి తరిమికొడతారు.
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
– పి.సంతోష్