రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి.. గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసి చేతులు దులుపుకొన్నారు.
కొత్త ఉద్యోగాల ఊసే ఎత్తలేదు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తమ మార్కు పాలన చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊదరగొట్టినప్పటికీ నాటి మాటలకు, నేటి చేతలకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు వాపోతున్నారు. సీఎం రేవంత్రెడ్డికి పార్లమెంటు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదనే విషయం స్పష్టమవుతున్నది. సీఎం రేవంత్ ఇకనైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. లేకుంటే ఆయనకు ప్రజలే సరైనరీతిలో బుద్ధి చెప్తారు.
– పూసాల వేణుగోపాల్