ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు. ఆవిర్భావం తర్వాత పదేండ్ల పాటు పచ్చగా కళకళలాడిన తెలంగాణను ఇప్పుడు మళ్లీ కరువు రక్కసి ఆవరించింది. ఫలితం మళ్లీ పరాయి పాలన నాటి పరిస్థితే రాష్ట్రంలో నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రతి పల్లె ఇప్పుడు మళ్లీ కన్నీరు పెడుతున్నది. తెలంగాణలోని మడుగులన్నీ అడుగంటిపోయినవి. బావులు సావుకు దగ్గరైనవి. వాగులు, వంకలు ఎండిపోయినవి. కుంటలన్నీ నెర్రెలు బారినవి. ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎంత ధ్వంసమైందో, అచ్చం అలాంటి పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ దాపురించడం నిజంగా బాధాకరం.
నాటి పల్లె కన్నీరు తుడిచేందుకు, పట్నం బాధలు తీర్చేందుకు, నీళ్ళు, నిధులు, నియామకాలు సాధించేందుకు సిద్ధపడిన ఒకే ఒక్కడు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం గులాబీ జెండా ఎగుర వేసి కోట్లాది గొంతుకై తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ విజయంతో తెలంగాణను సాధించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ పాలనా రథాన్ని ముందుకు నడిపారు. అంధకారం అలముకున్న తెలంగాణను కరెంట్ కష్టాలు లేకుండా వెలుగు సూర్యుడిలా ఉదయించేలా చేశారు.
మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ మాగాణికి జలధార అయ్యారు. దీంతో మన తెలంగాణ పచ్చని పంటలతో ధాన్యపు రాశులు, సిరులు కురిపించే బంగారమైంది. దేశానికి ఆదర్శంగా టన్నుల కొద్దీ ధాన్యం పండించిన రాష్ట్రంగా ఎదిగింది. తెలంగాణ బిడ్డల కోసం ఉద్యోగ నియామకాలను చేపట్టింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచారు కేసీఆర్. ఆయన హయాంలో ప్రాజెక్టుల నుంచి ఎగిసిపడ్డ గంగమ్మ తల్లిని చూశాం. శివుడు నెత్తి మీద ఉన్న గంగమ్మ నేల తల్లి తెలంగాణను హత్తుకుని తడిసి ముద్దయింది. పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ నేడు నాలుగు నెలల కాంగ్రెస్ హయాంలో మళ్లీ కరువు కన్నీళ్లు తెప్పిస్తున్నది.
కేసీఆర్ తెచ్చిన తెలంగాణ సకల జనుల సంతోషాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమ ఆత్మ గౌరవాన్ని నిలిపిన కేసీఆర్పై, బీఆర్ఎస్ పార్టీపై ఓర్వలేని తనంతో నీలాపనిందలు, అబద్ధాలు ప్రచారం చేశాయి. అరవై ఏండ్లు దోచుకున్నది చాలదన్నట్లు మళ్ళీ అధికారం పొందేందుకు అలవికాని హమీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఏనాడూ ‘జై తెలంగాణ’ అని పలకని రైపిల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో నేడు తెలంగాణ కన్నీళ్లు, కష్టాలు, ఆత్మహత్యలతో తల్లడిల్లిపోతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అరవై ఏండ్ల కష్టాలు తన్నుకువస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణ కరువు కోరల్లో చిక్కుకున్నది. అక్టోబర్ వరకు నీళ్లతో నిండిన తెలంగాణ నాలుగైదు నెలల్లోనే బీడుగా మారింది. ఫలితంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. జలాశయాల్లో నీళ్లున్నా ప్రభుత్వం పంటలకు నీళ్లివ్వడం లేదు. రైతులు చనిపోతున్నా సర్కార్ కనికరించడం లేదు.
కేసీఆర్పై కక్షసాధింపు చర్యల కోసం కర్షకుల కడుపు కొట్టడం ఈ ప్రభుత్వానికి సరికాదు. ‘అసెంబ్లీ ఎన్నికలో నెగ్గినం, ఇక పార్లమెంట్ ఎన్నికలే మిగిలాయి’ అన్న నినాదాన్ని కాంగ్రెస్ నేతలు తరచూ వాడుతున్నారు. అందుకే రాష్ట్రంలో పాలన అటకెక్కింది. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం సీటు పదిలం చేసుకోవాలని తాపత్రయ పడుతున్నారు. అందుకే ఈ పొలిటికల్ డ్రామాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తనకేం అవసరం లేదన్నట్టుగా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారు.
తినడానికి తిండి గింజలు కరువైనయి. పశువులకూ మేత దొరకని పరిస్థితి ఉన్నది. పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు కట్టలేని స్థితి. మళ్లీ వాన కాలం దగ్గరికి రావట్టే. కాలం ఎట్లుంటదో. నీళ్లు వస్తయో, రావోనన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకున్నది. సాగుకే కాదు, తాగడానికీ నీళ్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. నేడు తెలంగాణ మొత్తం ఎడారిని తలపిస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటి పాతాళలోకి పోయినయి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘కాంగ్రెస్కు ఓటేసి మోసం పోయినం’ అనే మాటనే ఇనవడ్తున్నది.
‘కేసీఆర్ ఉన్నపుడు బాగుండేది. పంటలకు నీళ్ల సౌలత్, రైతు బంధు, రైతు భీమా, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని టైంకు డబ్బు తమ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ప్రతి నెల పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, బీడీ కార్మికులకు భృతి క్రమం తప్పకుండా కేసీఆర్ సార్ ఇస్తుండె. మంచి సార్ను దూరం చేసుకుని బాధ పడుతున్నము. మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి’ అని తెలంగాణ ప్రజానీకం పల్లెల్లో చర్చ చేస్తున్నరు. ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడాలంటే కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెర వేరాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కు అండగా ఉండాలి. కష్ట కాలంలో రైతుల కన్నీళ్లు తుడవటానికి, నేనున్నా మీకు అంటూ రైతన్నలకు కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని శిఖరాగ్రాన నిలిపి భవిష్యత్ తెలంగాణకు కొత్త వసంతం తేవాలి. కేసీఆర్కు అండగా నిలుద్దాం. తెలంగాణను కాపాడుకుందాం. రైతు కన్నీళ్లను తుడుద్దాం.
– చిటుకుల మైసారెడ్డి 94905 24724