ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావాలనే ప్రజల బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు. రాష్ట్రం ఏర్పాటు కోసం చావోరేవో అన్నరీతిలో జనం కొట్లాడటం వెనుక 150 ఏండ్ల దుఃఖం ఉన్నది. ఒక దాని తర్వాత ఒకటిగా జరిగిన అన్యాయాలన్నీ, ఒకదానికి ఒకటి తోడై ప్రజలు ఉద్యమించక తప్పని పరిస్థితిని సృష్టించాయి.
విశ్వ ప్రయత్నాలు విఫలమైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వ్యూహాత్మకంగా, ప్రజాస్వామ్యయుతంగా సాగిన మలిదశ పోరాటం.. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చే వరకు నిరాటంకంగా సాగింది. అలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సిద్ధించింది. స్వరా ష్ట్రం వచ్చిందని సంబురపడితే సరిపోదు, సాధించిన దానితో సంతృప్తి చెందితే పొరపాటే అవుతుంది. ఆ పొరపాటు కేసీఆర్ చేయలేదు. సీమాంధ్ర నాయకులు ఎన్నో చెప్పారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదన్నారు. నక్సలిజం పెరిగిపోతుందన్నారు. అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమని భయపెట్టారు. శాపాలు, జోస్యాలు కలగలిసిన వారి అంచనాలను తలకిందులు చేసి, తెలంగాణను ఓ అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దాలనేదే ఉద్యమం అసలు లక్ష్యం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ విజయతీరాలకు చేర్చారు.
తెలంగాణ రాష్ట్ర అత్మ, తెలంగాణకు మణిహారం హైదరాబాద్. రాష్ర్టానికి ఎంతో కీలకమైన నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి నాటి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్ లాంటివి వాటి ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్లోనే నెలకొల్పాయి. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 70 శాతానికి పైగా హైదరాబాద్ నుంచే వస్తుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్ర ప్రజలు హైదరాబాద్తో సంబంధాన్ని కలిగి ఉన్నారు.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బలపడాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తేనే అందుకు మార్గం సుగమమవుతుందని కమలం పార్టీ బలంగా నమ్ముతున్నది. అందుకే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్తో కలిసి కుట్రలకు తెరలేపింది. రెండు జాతీయ పార్టీల కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కుట్రలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కేంద్ర పాలకులు తమ రహస్య ఎజెండాను అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నది. హైదరాబాద్ ఆదాయాన్ని ఒక్క ప్రాంతానికే పరిమితం చేసి, మిగతా తెలంగాణ జిల్లాలను అంధకారంలోకి నెట్టడమే జాతీయ పార్టీల లక్ష్యం. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తున్నారనే కత్తిని తెలంగాణ మెడపై ఉంచి, రాష్ట్రంలో అశాంతి రగిలించాలనే పన్నాగాన్ని ఆ పార్టీలు పన్నుతున్నాయి. ఏపీ విభజన ఒక పనికిమాలిన ప్రయత్నమనేది బీజేపీ వాదన. సాక్షాత్తూ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ కూడా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ వెనుక బలమైన కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగంగానే బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను బరిలో ఉంచింది. తద్వారా బీఆర్ఎస్ను బలహీనం చేయాలనేది వారి వ్యూహం. అలా చేస్తే భవిష్యత్తులో తెలంగాణను ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చనేది వారి ఆలోచన. అందుకే ఆ పార్టీలు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు హైదరాబాద్ను ఎంచుకున్నాయి. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రం అనేదే ఆ రెండు పార్టీల విధానం.
బీజేపీ చేస్తున్న ఈ కుట్రకు సీఎం రేవంత్రెడ్డి మద్దతుగా నిలుస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసి, అగ్రపథాన నిలిపిన కేసీఆర్పై కోపం, అక్కసుతోనే వారు అలా చేస్తున్నారనిపిస్తున్నది. హైదరాబాద్ను యూటీగా మారిస్తే అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు హైదరాబాద్ అడ్డాగా మారుతుంది.
తెలుగు జాతి రక్తం, స్వేదం, కేసీఆర్ అకుంఠిత దీక్షతో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైన హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టే సోయి లేదు, కేంద్రీయ విద్యా సంస్థలు నెలకొల్పే ఆలోచన లేదు. కానీ, కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామనే ఆలోచన మాత్రం ఆ జాతీయ పార్టీలకు రావడం అత్యంత ఖండనీయం. ఇది కచ్చితంగా తెలంగాణను నమ్మించి గొంతు కోయడమే. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కేంద్ర పన్నులు ఉంటాయి. రాష్ట్ర పన్నులుండవు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోతుంది. దీని ప్రభావం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పడుతుంది. అప్పుడు ఆ పార్టీల కండ్లు సల్లవడుతాయి.
బీజేపీ చేస్తున్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుందనుకోవడం ఆ పార్టీ అమాయకత్వమే అవుతుంది. కాంగ్రెస్ పాలకులు బీజేపీకి వంతపాడితే మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. పోరాటాలకు మారుపేరైన తెలంగాణ సమాజం మరోసారి ఏకమవుతుంది. కుట్రదారులను తరిమికొడుతుంది.
– జి.రాజేష్ నాయక్ 96035 79115