జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.. జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్ప. పుట్టిన గడ్డ వలస పాలనలో ఆక్రోశిస్తున్నప్పుడు, స్వజాతి జనులు కడగండ్లపాలవుతున్నప్పుడు ఆ దుఃఖాన్ని కేసీఆర్ విన్నారు. ఆ ఆవేదనను తన గుండె నిండా నింపుకొన్నారు. అందుకనే మాతృభూమి విముక్తి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టి, అభేద్యంగా కనిపిస్తున్న వలస శక్తుల మీద యుద్ధాన్ని ప్రారంభించారు. ఏ ప్రలోభాలకూ లొంగకుండా, కేంద్ర మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేశారు. ఉద్యమకాలమంతా ఒకసారి కాదు అనేకసార్లు పదవులను గడ్డిపోచల్లాగా ఎంచి రాజీనామా చేసిన కేసీఆర్, తన పార్టీ నేతలందరినీ అదే బాటన నడిపించారు. కానీ, నేడు కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలుతున్న వారి చరిత్ర ఏమిటి? 2010లో తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసినప్పుడు, నిజామాబాద్లోని బీజేపీ ఎమ్మెల్యే కూడా పదవీత్యాగం చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. కానీ అదే బీజేపీలోని కిషన్ రెడ్డి మాత్రం తన ఎమ్మెల్యే పదవిని పట్టుకొని వేళ్లాడుతూ, తెలంగాణ స్వాభిమానాన్ని పరాయి పాలకుల పాదాల చెంత తాకట్టు పెట్టారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వేషం వేసిన తెలుగుదేశం మాజీ నాయకుడు రేవంత్రెడ్డి.. ఉద్యమకాలమంతా టీడీపీ అధినేత పాదపూజ చేస్తూ గడిపారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఆంధ్రపాలకులకు సద్దులు మోసిన ఈ వ్యక్తి ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. ఉద్యమ కాలం లో ఊరూపేరు లేని బండి సంజయ్ అధిష్ఠానం మెప్పు కోసం విజ్ఞత మరిచి ముఖ్యమంత్రిపైనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణను ఎవరైనా ఒక్క మాట అంటే.. పది మాటలతో ఘాటైన జవాబు ఇచ్చేవారు కేసీఆర్. ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే’ అని గర్జించి, తెలంగాణ వ్యతిరేకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆర్థిక, మీడియా, ప్రభుత్వ దన్ను ఉన్నా కూడా తెలంగాణ గురించి సీమాంధ్ర శక్తులు ఆచితూచి మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలకు అటువంటి స్వాభిమానంగానీ, సోయి అన్నదిగానీ లేదు. పెప్పర్స్ప్రే కొట్టి, పార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించారంటూ.. తెలంగాణ జాతిజనుల తరతరాల ఆకాంక్షను, దశాబ్దాల పోరాటాన్ని మోదీ దారుణంగా అవమానించినప్పుడు కూడా వారికి చీమ కుట్టినట్టు లేదు. ఏమిటీ అన్యాయపు మాటలని ఢిల్లీ పెద్దలను నిలదీసే సత్తా ఉండదు. వీరిలో ఈ చేవ చచ్చింది కాబట్టే మోదీ తెలంగాణను పదేపదే అవమానించగలుగుతున్నాడు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నప్పుడే తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుతిరిగి ఉంటే, మోదీ నోటి వెంట మరోమారు ఇటువంటి మాటలు వచ్చేవా?
తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేసీఆర్ది వందకు వందశాతం రాజీ లేని వైఖరి. నాడు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరినప్పుడు.. ఏ మంత్రిత్వ శాఖ కావాలని అడిగితే ‘నాకు ఏ శాఖ ఇచ్చినా సరేగానీ, తెలంగాణ మాత్రం ఇచ్చి తీరాలి’ అనేంత స్థిరచిత్తం కేసీఆర్ది. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చి, ఆ తర్వాత మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడుపుతున్న కేంద్రప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పదవులను విసిరికొట్టిన త్యాగనిరతి కేసీఆర్ది. ఈ మహోన్నత వ్యక్తిత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నవారిలో మచ్చుకైనా ఉందా ఆ స్థిరచిత్తం, త్యాగనిరతి. తెలంగాణ ఏర్పడగానే ఏడు మండలాలను ఇదే మోదీ సర్కార్ విడదీసి ఆంధ్రలో కలిపింది. హైకోర్టును ఏర్పాటు చేయటానికి ఏండ్లకేండ్లు తీసుకుంది. రాష్ర్టానికి ఇస్తానన్న హామీలు వేటినీ నెరవేర్చలేదు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్రెడ్డిగానీ, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్గానీ.. కొత్తగా కళ్లు తెరిచిన రాష్ట్రం పట్ల ఈ అన్యాయం ఏమిటని అడిగిన పాపాన పోలేదు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్రం గుంజుకునే దుస్సాహసానికి ఒడిగట్టినప్పుడు కూడా వీరికి మాట పెగలదు.
తెలంగాణ పట్ల కేంద్రం ఎంతటి సహాయ నిరాకరణ వైఖరిని ప్రదర్శించినా కేసీఆర్ రాజనీతిజ్ఞతను చూపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక జాతీయ స్థాయి అంశాలపై కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించారు. పార్లమెంటులో అధికార పార్టీకి అండగా నిలిచారు. కానీ, ఆ విచక్షణ రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలకు లేదు. తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా గానీ తమ పదవులను కాపాడుకుంటే చాలు అన్నంత సంకుచితంగా వ్యవహరిస్తున్నారు. మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలుంటాయి. ఎవరి రాజకీయాలు వాళ్లవి. కానీ, రాష్ట్ర ప్రయోజనాల మాట వస్తే వాళ్ల మధ్య విభజన రేఖ చెరిగిపోతుంది. ఒక్క గొంతుకై నినదిస్తారు, ఒక్క పిడికిలై ఉక్కు సంకల్పాన్ని చాటిచెబుతారు. తమ రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునేవరకూ విశ్రమించరు. నదీ జలాల పంపిణీ వంటి క్లిష్టమైన సమస్య అయినా, జల్లికట్టు, హిందీ భాష వంటి సాంస్కృతిక అంశమైనా సరే ఒక్కతాటిపై నిలుస్తారు. వాళ్లని చూసైనా మన ప్రతిపక్ష నేతలు సోయి తెచ్చుకోలేరా? తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు కావడం వల్లనే తమకు ఈ మాత్రం పదవులు వచ్చాయనే తెలివిడి కూడా లేదు వీరికి. పుట్టిన గడ్డను అవమానిస్తున్న ఢిల్లీ పాలకుల ముందు జీ హుకూం అనే ఈ అకశేరుకాలు సాక్షాత్తు కేసీఆర్పై బురదజల్లడానికి సాహసించడమేమిటి? ఈ దిగజారుడు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తమ నాయకుడెవరో, పరాయి కిరాయి మనుషులెవరో ప్రజలకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ధి చెబుతారు.