Singareni | తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సింగరేణి కన్నతల్లి వంటిది. ఇక లాభాలు, లాభాల వాటా పంపిణీ, బోనస్, అలవెన్సులు ఇలా ఎన్నో.. ఇదంతా రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు తెలిసిన ముచ్చటే. మరి అలాంటి సింగరేణికి ఇప్పుడు ఏమైంది.. సింగరేణి అప్పుల్లో కూరుకుపోయిందా? ఆర్థిక నిల్వలు అడుగంటాయా? జీతాలు చెల్లించలేక అప్పుకోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నదా? కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఇలాంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా?.. ‘అవన్నీ కేవలం రాజకీయ విమర్శలు తప్ప వాస్తవాలు కాదు. సంస్థ ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నది. దేశంలోనే నెంబర్ వన్ సంస్థగా కొనసాగుతున్నదని’ సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.
134 ఏండ్ల క్రితం బ్రిటిష్ కంపెనీగా ప్రారంభమైన సింగరేణి తర్వాత డెక్కన్ సంస్థగా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా అంచెలంచెలుగా ఎదిగింది.ప్రారంభం నుంచి లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థ సింగరేణి. స్వాతంత్య్రానంతరం పారిశ్రామికవృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి ముఖ్య భూమిక పోషించింది. ఆ దిశగా రి కార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా చే స్తూ మంచి గుర్తింపు పొందింది. కొన్ని అనివార్య కారణాలతో ఒకానొక దశలో బీఎఫ్ఆర్ఎం వరకు వెళ్లి దాదాపుగా మూసివేతకు సిద్ధమైన కంపెనీ ఆ తర్వాత సంస్థ నాయకత్వం, ఉద్యోగుల సమిష్టి కృషితో లాభాల బాట పట్టింది. నాటి నుంచి నేటి వరకు నష్టాలకు తావు లేకుండా..ఏటేటా ఆర్థికాభివృద్ధిలో, లాభాల సాధనలో దూసుకెళ్తూ ఉద్యోగులకు లాభాల పంపిణీ, అలవెన్స్, బోనస్ల పంపిణీలో చరిత్ర సృష్టిస్తున్నది.
స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం సింగరేణి అభివృద్ధిలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తు న్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణికి పెద్దపీట వేస్తూ సంస్థ పురోభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారు. సంస్థ సీఎండీ శ్రీధర్ రానున్న అవసరాలు దృష్టిలో పెట్టుకొని థర్మల్, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాట్లతో సంస్థ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ప్రభుత్వ సహకారం, సమర్థవంతమైన సింగరేణి నాయకత్వం కారణంగా ఏటేటా ఉత్పత్తి లక్ష్యాలు పెంచుకుంటూ వాటిని సాధిస్తూ అంతే స్థా యిలో లాభాల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నది సింగరేణి. అటు సాధించిన లాభాల్లోనూ పెద్ద మొత్తంలో ఉద్యోగులకు బోనస్లుగా చెల్లిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వా త ఉత్పత్తి, లాభాలు, సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్ సంస్థగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం ఉద్యోగుల సంక్షేమానికి సగటున ఒక కార్మికుని పై లక్షా 15 వేల రూపాయలు వెచ్చించగా ఇప్పుడు అది 3 లక్షల 15 వేలకు చేరింది. సింగరేణి ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్నందువల్లనే ఇవి సాధ్యమవుతున్నాయని ఇటీవల సంస్థ అధికారికంగా ప్రకటించింది.
సంస్థ నష్టాల్లో ఉంటే ఖర్చుతో పాటు, కా ర్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుం ది. కానీ డిపెండెంట్ కోటాలో 15 వేలమందికి కొత్త ఉద్యోగాలు కల్పించింది. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ విద్యుత్తు రంగాల్లో కూడా రాణిస్తూ రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.11,665 కోట్ల డిపాజిట్లు, ఏటా రూ.750 కోట్లకు పైగా వడ్డీ రాబడులు పొందుతున్నది. వీటితోపాటు వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిలు రూ. 15,500 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ విధం గా మొత్తం మీద రూ. 27 వేల కోట్లతో ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్న సింగరేణి కంపెనీ అప్పు ల పాలైందని, రూ.12 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేయడం అత్యంత బాధాకరం.
ఎంతో పారదర్శకంగా సింగరేణి సంస్థ ఏటా సమర్పించే ఆర్థిక నివేదికల పట్ల కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్) గత కొన్నేండ్లుగా నిల్ కామెంట్స్ పెట్టడమే సిం గరేణి విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం. అయినప్పటికీ, రాజకీయ లబ్ధికోసం, సింగరేణి మీద కొందరు అసత్య ప్రచారం చేయ డం సంస్థ ఉనికికి తద్వారా లక్షలాదిమంది ఉపాధికి ప్రమాదకరం.
తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, తెలంగా ణ రాష్ట్ర అభివృద్ధిలోనూ కీలక భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థ కృషిని ప్రశంసించాల్సిన వారు, అందుకు భిన్నంగా సంస్థ కార్మికుల మనోధైర్యాన్ని, మార్కెట్లో కంపెనీ కున్న విలువను దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదు.
తెలంగాణకే తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉండడం, సమర్థత గల నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉండటంతో కేంద్రం మిగిలిన ప్రభుత్వరంగ సంస్థల మాదిరిగా సింగరేణి ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయ డం కుదరలేదు. దీంతో బొగ్గు బ్లాకులను నేరుగా కేటాయించకుండా, టెండర్లు పిలు స్తూ వాటిని సింగరేణికి దక్కకుండా కేంద్రం కుట్రలు పన్నుతున్నది. తెలంగాణ మణిహారం సిరులవేణి సింగరేణిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అందరూ తిప్పికొట్టాలి. సంస్థ అభ్యున్నతికి కృషి చేయాలి.
– ప్రదీప్ రావు ఎరబెల్లి 99660 89696