పచ్చదనం ప్రగతికి ఇంధనం.. ఆహ్లాదానికి ఆలవాలం. ఈ విషయాన్ని గుర్తించిన సీఏం కేసీఆర్ హరిత హారం పథకంతో తెలంగాణకు పచ్చని అందాలు అద్దారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకం 8 విడతలు విజయవంతంగా పూర్తి చేసుకొని సత్ఫలితాలను అందించింది. నేడు తొమ్మిదో విడతలో భాగంగా కోటి వృక్షార్చనకు సిద్ధమైంది. జీవ వైవిధ్యానికి బలమైన పునాది వేసిన హరితహారం అత్యధిక మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన అతి పెద్ద మూడో మానవ ప్రయత్నంగా రికార్డు సృష్టించింది.
తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచడానికి, గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకం ఎంతో దోహదం చేసింది. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగా వృక్ష సంపదను పెంచేందుకు వర్షాకాలంలో కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామూహికంగా ఒక మహాయజ్ఞంలా చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో భాగంగా రైతులు వారి పొలాల వద్ద మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. గడచిన తొమ్మిదేండ్లలో హరితహారం ఫలితాలు అబ్బుర పరిచేలా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచనతో ప్రారంభించిన హరితహారం ఎటు చూసినా పచ్చదనానికి, ఆహ్లాదకర వాతావరణానికి జీవం పోస్తున్నది. జీవ వైవిధ్యానికి బలమైన పునాదులు వేసిన ప్రభుత్వం ప్రపంచ రికార్డు వైపు దూసుకుపోతున్నది. ఈ క్రమంలోనే ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని 8 విడతల్లోనూ విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం 9వ విడతకూ సర్వ సన్నద్ధమైంది.
రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని మంచి రేవుల టెక్ ఫారెస్ట్ పార్కులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. హరిత హారంలో ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇప్పటివరకు రూ.11,095 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 288 కోట్ల మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మానవజాతి చేసిన మూడవ అతి పెద్ద పర్యావరణ పరిరక్షణ ప్రయత్నంగా ప్రపంచవ్యాప్తంగా హరితహారం పథకానికి గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడం వల్ల రాష్ట్రంలో గ్రీన్ కవరేజీ 7.7 శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
ప్రాంతీయ, వాతావరణ వైవిధ్యాలను, వివిధ రకాల మొక్కల డిమాండ్ను తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,864 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 19.29 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకొని 30.29 కోట్ల మొక్కలను నాటారు. తద్వారా అడవుల పెంపకం విజయవంతమైంది. 2.03 లక్షల ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్లు, 13.44 లక్షల ఎకరాల్లో పునరుజ్జీవింపబడిన అడవులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. మిడతల బెడదను ఎదుర్కోవడానికి 55 కోట్ల మొక్కలకు అవసరమైన చికిత్స చేశారు. అడవులను కార్చిచ్చుల నుంచి రక్షించడానికి, 21,452 అటవీ అగ్ని రేఖలను ఏర్పాటు చేశారు. భూసార పరిరక్షణతో పాటు నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచేందుకు చెక్ డ్యామ్లు, ట్యాంకుల నిర్మాణం చేపట్టారు.
హరితహారం పథకం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తోటల పెంపకం పెరిగింది. హైదరాబాద్లో 456 కొత్త పార్కుల ఏర్పాటుతోపాటు, హరితహారం అమలు వల్ల 147 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీనివల్ల ప్రపంచంలోని గ్రీన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారులకు ఇరువైపులా 1,00,691 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. బహుళ రహదారి అడవులను (మల్టీ లెవెల్) 20,828 కి.మీ మేర పెంచారు. 73 అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మొత్తం 129 ప్రాంతాల్లో 1, 60,661 ఎకరాల స్థలంలో 188 ఫారెస్ట్ బ్లాక్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14,864 నర్సరీలను, 19,472 గ్రామీణ ప్రకృతి అడవులను, 2,077 పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నర్సరీల ద్వారా 30.29 కోట్ల మొక్కలను ప్రభుత్వం నాటింది. ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో 19.29 కోట్ల మొక్కలు, 2024లో 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. బ్రెజిల్లో అమెజాన్ అడవుల పునరుద్ధరణ కోసం 7.3 కోట్ల మొక్కలను ఆరేండ్లలో నాటేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ కార్యాచరణ సరసన తెలంగాణ హరితహారం కూడా చేరింది. తెలంగాణను పచ్చదనాల ప్రగతి పథంలో నడుపుతున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను గర్వపడేలా చేశారు. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన కృషి ఈ సందర్భంగా అభినందనీయం.