KCR | ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దార్శనిక నాయకత్వంలో తెలంగాణ గొప్ప చారిత్రక మార్పునకు సాక్షిగా నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన ‘సామాజిక న్యాయం’, ‘సోషల్ డెమోక్రసీ’ సూత్రాలు ఈ మార్పునకు పునాది. సోషల్ డెమోక్రసీపునాదిగా ఉంటే తప్ప పొలిటికల్ డెమోక్రసీ కొనసాగదన్నారు అంబేద్కర్. సోషల్ డెమోక్రసీ అంటే ఏమిటి? ‘సోషల్ డెమోక్రసీ అంటే… స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం తప్పనిసరిగా ఉండే జీవన విధానం’ అని నిర్వచించారు అంబేద్కర్.
అంబేద్కర్ ఆలోచనలను మనం మరింత విశదీకరించినట్లయితే, సామాజిక న్యాయాన్ని సాధించడానికి సోషల్ డెమోక్రసీ తప్పనిసరి అనే విషయం అర్థమవుతుంది. అంబేద్కర్ తన జీవితాంతం దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మరి అంబేద్కర్ ఆశయాల పట్ల భారత చట్టసభ సభ్యులు, రాజకీయ నాయకులు ఎంత నిబద్ధతతో ఉన్నారు? అంబేద్కర్ దార్శనికత వాస్తవరూపం దాల్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నాయి? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే.. చాలా రాజకీయ పార్టీలు, నాయకులు అంబేద్కర్ ఆశయాలను పట్టించుకోలేదనేది వాస్తవం. అంబేద్కర్ ఆలోచనలను అమలు చేయడం కంటే ఆయన పేరు మీద ఓట్లు దండుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు. అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రజల జీవితాల్లో ప్రగతిశీలమైన, సానుకూల మార్పును ఎలా సృష్టించగలదో నిరూపించడానికి, అంబేద్కర్ ఆశయాలను అమలుచేయడానికి దాదాపు ఆరు దశాబ్దాలు పట్టింది. అది దూరదృష్టి కలిగిన నాయకుడు కేసీఆర్ రూపంలో సాధ్యమైంది.
ఒకప్పుడు కరువు కాటకాలు, బంజరు భూములు, అణచివేత, కూలీల వలసలు, రైతుల ఆత్మహత్యలు, అంతర్గత కలహాలు, సాంస్కృతిక, రాజకీయ అణచివేతలకు మారు పేరుగా నిలిచింది తెలంగాణ. అటువంటి తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాన అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా ఎదిగి ఓ అద్భుతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. తెలంగాణ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 6వ రాష్ట్రం. 2014లో దాదాపు రూ.5.5 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.14 లక్షల కోట్లకు పెరిగే సూచనలున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.60 వేల కోట్లు కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. అదేవిధంగా 2013-14లో రూ.1,12,162 ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ.3,17,115 కి పెరిగింది. ఇది జాతీయ తలసరి ఆదాయం రూ.1,70,620 కంటే 86 శాతం ఎక్కువ. ఈ గణాంకాలు కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్ర అభివృద్ధిని చాటిచెప్తున్నాయి. ఈ ఆర్థిక సూచికలు ఒక కోణం కాగా, తెలంగాణ ప్రజల జీవితాల్లో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో వచ్చిన మార్పు మరొక కోణం. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతానికి తెలంగాణను కేసీఆర్ రోల్ మాడల్గా మారుస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విధాలుగా అంబేద్కర్ ఆశయాలను తన పాలనలో ప్రతిబింబిస్తున్నారు. ఆయన అడుగుజాడలను అనుసరిస్తున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో కుల, మత, ప్రాంతీయ సరిహద్దులకు అతీతం గా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి, సాధికారతకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. భారత దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. అయినప్పటికీ, సామాజిక న్యాయంలో యావత్ దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని తీర్చిది ద్దుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పరిశీలిస్తే.. అణగారిన వర్గాలపై పేదరికం భారాన్ని తగ్గించడం, వారికి సాధికారత కల్పించటం అనే లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్థిక కార్యకలాపాల్లో, తద్వారా దేశ నిర్మాణంలో ఆయా వర్గాలను భాగస్వాములను చేయాలనే గొప్ప లక్ష్యంతో చేపట్టినవి తప్పితే.. ఇవి రాజకీయ కారణాలతో తెచ్చిన ప్రజాకర్షక పథకాలు కావు.
గొర్రెలు, చేపపిల్లల పంపిణీ ద్వారా కులవృత్తులకు చేయూతనిచ్చినటువంటి కార్యక్రమాలను ముందుచూపు లేని ప్రతిపక్షాలు హేళన చేసినప్పటికీ.. ఆయా కార్యక్రమాలతో ఆ వర్గాల్లో తలసరి ఆదాయం పెరిగి , సంపదను సృష్టించాయి. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఆత్మగౌరవ భవనాలు అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించాయి. కేసీఆర్ పాలనలో ఒక ప్రధాన అంశం ఏమంటే, సమాజంలోని ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. రాష్ట్రం లోని ప్రతి వర్గానికి, ప్రతి కుటుంబానికి కూడా ప్రయోజనం చేకూరేలా సంక్షేమ విధానాలను ఆయన జాగ్రత్తగా రూపొందించారు.
విజయాలకు పొంగిపోని నాయకుడు, సమ స్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసే యోధుడు కేసీఆర్. ఆధిపత్యాన్ని సవాల్ చేసే బాబాసాహెబ్ స్ఫూర్తిని ఆయన ముందుకు తీసుకుపోతున్నారు. దేశ జనాభాలో 70 శాతానికి పైగా ఉంటూ, దేశ ఆర్థికవ్యవస్థకు పునాదులుగా ఉండి, విచక్షణ లేని కేంద్ర ప్రభుత్వాల వల్ల నిరాశకు గురవుతున్న రైతుల పక్షాన పో రాడటానికి కేసీఆర్ ప్రస్తుతం నడుం బిగించారు. కేంద్రంలో రైతు అనుకూల ప్రభుత్వాన్ని తీసుకురావాలని, తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తం చేయాలని సంకల్పించారు. దీంట్లో భాగంగానే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కా ర్’ అనే చారిత్రక నినాదం ఇచ్చారు. ఈ బృహత్త ర లక్ష్య సాధనలో భాగంగానే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే కార్యాన్ని చేపట్టారు కేసీఆర్. మోదీ సర్కార్ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ 21వ శతాబ్దపు భారతదేశంలో ఆధునిక అంబేద్కర్గా అవతరించారు కేసీఆర్.
కేసీఆర్ ప్రతి చర్యను గుడ్డిగా వ్యతిరేకించే వాళ్లు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును, ఆ మహానేత పేరుతో తెలంగాణ కొత్త సచివాలయాన్ని నిర్మించడాన్ని కూడా ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకంటే వారిలా కేవలం నోటి మాట లేదా విగ్రహ రాజకీయాలు ఆయన చేయడం లేదు కాబట్టి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అణగారిన వర్గాల సాధికారత కోసం పట్టుదలతో, నిర్మాణాత్మకంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా ఇప్పటివరకు సాధించిన తెలంగాణ అభివృద్ధి నమూ నా దీనిని సంపూర్ణంగా రుజువు చేస్తున్నది. తెలంగాణ మాడల్ ద్వారా సాధించిన సామాజిక న్యాయాన్ని, సోషల్ డెమోక్రసీని దేశమంతటా తీసుకువెళ్లాలని కేసీఆర్ దృఢ సంకల్పంతో ముందడుగు వేయటాన్ని చూసి వీరు తట్టుకోలే కపోతున్నారు. అంబేద్కర్ ఆశయాలతో నడిచే కేసీఆర్ అభివృద్ధి రాజకీయాలను బూటకపు ప్రచారాలతోనైనా సరే ఎదుర్కోవాలని విపక్షాల కు చెందిన ఈ కపట నాయకులు భావిస్తున్నా రు. లేకపోతే తమకు రాజకీయంగా నూకలు చెల్లినట్టేనని ఆందోళన చెందుతున్నారు.
సమగ్రమైన మార్పు, అభివృద్ధి, సామాజిక న్యాయం కోరుకునే మనందరిపైనా ఇటువంటి విధ్వంసకర రాజకీయపార్టీలను, నాయకులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఆధునిక రాజకీయాల్లో అంబేద్కరిజానికి నిజమైన వారసుడిగా, బాబాసాహెబ్ కోరుకున్నట్లు భారతదేశ రాజకీయాల్లో, ప్రజల సామాజిక, ఆర్థిక జీవితం లో శాశ్వతమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ సంకల్పించారు. తెలంగాణ మాడల్ ఈ దిశగా ఒక బలమైన అడుగు. మహా నాయకుడైన కేసీఆర్కు బలగం మాదిరిగా మనం ఉండాలి. ఆయన ఆలోచనలకు, చేసే మంచి పనులకు మనం మరింత బలం ఇవ్వాలి.
– డాక్టర్ శ్రవణ్ దాసోజు