‘దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించాడు? ఈ పనిని నాకెందుకు అంటగట్టాడు? కర్మఫలంతో నన్నెందుకు జతపరిచాడు? అని సామాన్యులే కాదు, ధీమంతులూ తర్కించుకుంటూ ఉంటారు. ఈ మూడు ప్రశ్నలకూ సమాధానం భగవద్గీత చదివితే తెలుస్తుంది.
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే॥
(భగవద్గీత 5-14)
ప్రభువంటే పరమేశ్వరుడు. అతడు మనల్ని ఏ పనికీ కర్తలను చేయడు. మనల్ని కర్తలుగా చేసి ఏ పనినీ అంటగట్టడు. అంతేకాదు, ఈ పని వల్ల ఈ ఫలం అనుభవించాలని, ఫలితంతో మనల్ని సంయుక్తం చేయడని గీతాశ్లోక భావం.
పరమేశ్వరుడు ఎందుకు మనల్ని కర్తల్ని చేయడో ఆలోచించాలి. ఒకపనికి మనల్ని కర్తలను చేస్తే, భగవానుడే చేశాడు కనుక.. ఆ పనివలన ఏదైనా దోషం కలిగితే, అది అతడికే చెందుతుంది. అందుకే ఆయన ఎవరినీ కర్తలను చేయడు. కానీ, లోకంలో నేను కోటీశ్వరుణ్ని. భగవంతుడు నన్ను కోట్ల సంపదకు కర్తను చేశాడు అని భావించేవాళ్లున్నారు. కొందరు నన్ను దేవుడు పేదవాడిగా పుట్టించి.. దారిద్య్రానికి కర్తగా చేశాడని వాపోతుంటారు. ఈ పాపం పరమేశ్వరు నిదే కానీ, నాది కాదనుకొనే వాళ్లూ లేకపోలేదు. కానీ, పరమేశ్వరుడు మనల్ని మనుషులుగా పుట్టించాడు కానీ, ధనవంతులుగా, పేదవానిగా పుట్టించలేదు. ఆయన కర్తను సృష్టిస్తే.. ఆ కర్తృత్వ దోషం అతనికే తగులుతుంది. అందుకే, సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఆ పని చేయడు. ఆయన కేవలం సృష్టి, స్థితి, లయలకు కర్త మాత్రమే! ఒకవేళ దేవుడు ఒకపనికి మనల్ని కర్తలను చేస్తే.. చచ్చే దాకా ఆ పనినే చేస్తూ కర్తలుగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
ఎదగడానికి అవకాశమే ఉండదు. అందుకే మనల్ని కర్మలను చేయమని భగవద్గీత చెప్పింది. మనం పనులు చేయడానికి త్రికరణాలను ఇచ్చాడు దేవుడు. అవే మనస్సు, వాక్కు, కాయం (శరీరం). ఈ మూడింటితో మనం పుణ్యకర్మలు చేయవచ్చు, పాపకర్మలూ చేయవచ్చు. అయితే, మనం పుణ్యకర్మలే చేయాలనేది భగవంతుని సంకల్పంగా భావించాలి. అందుకే, త్రికరణ శుద్ధిగా పనులు చేయాల్సిందిగా ధర్మగ్రంథాలు మనల్ని ఆదేశించాయి. పరమేశ్వరుడు మనం పని చేయకముందే ఫలం ఇవ్వడు. దానితో మనల్ని కట్టిపడేయడు. కర్మ (పని) చేయకుండా ఫలితం అనుభవించే అవకాశమే లేదు. మనకు కర్మ మీద మాత్రమే అధికారం ఉందని, ఫలం మీద లేదన్న శ్రీకృష్ణ భగవానుడి మాటలను విస్మరించొద్దు. ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ (భగవద్గీత 2-47). ఎవరు ఏ పనిని ఎన్నుకొని, దాన్ని నిర్వహిస్తారో ఆ ఫలాన్ని వారే పొందుతారు. దీని భావం ఏమంటే.. చేసిన పనికి లభించే ఫలంతో సంబంధం, పని చేసిన వారికే తప్ప, అది భగవంతుడికి కలగదు!
పరమేశ్వరుడు జీవకోటి ఉపభోగార్థమే ఈ ప్రపంచాన్ని సృష్టించి ఇచ్చాడు. ఇంత అద్భుతమైన ప్రపంచంలో కర్తృత్వం మానవునిదే! కర్మతో సంబంధం మానవునిదే. అంతేకాదు కర్మఫల సంయోగమూ మానవునిదే. అప్పుడే మనిషి కర్మ చేయడంలో స్వతంత్రుడై ఉంటాడు. కర్మ చేసే స్వాతంత్య్రం లేకపోతే ఈ జగత్తుకు అర్థమే లేదు. ‘కర్మ వైచిత్య్రాత్ సృష్టి వైచిత్య్రం’ అన్నాడు. అంటే జీవుల కర్మలకు అనుగుణంగానే సృష్టి రచన జరుగుతుందని అర్థం. కర్తృత్వానుబంధం, కర్మానుబంధం, కర్మఫలానుబంధం మానవునికే గాని, పరమేశ్వరునికి ఎన్నటికీ కాదు. అవివేకంతో ఏర్పడిన ప్రకృతి, పురుష బంధమే సంసార బంధం. మనం అన్ని బంధనాల నుంచి బయటపడితే గానీ, ముక్తి లభించదు. అందుకే అహంకార జన్యమైన కర్తృత్వం నుంచి, కర్మల నుంచి, కర్మఫల సంయోగం నుంచి బయటపడాలి. అందుకు యోగమొక్కటే శరణ్యం. కేవలం చిత్రవృత్తుల్ని నిరోధించుకోవడమే కాక, కర్మఫలాలను ఆశించకుండా కర్మలను చేయడమే యోగం. దానికే నిష్కామ కర్మ యోగమని పేరు. ఎప్పుడైతే కర్తృత్వ భావన, కర్మ సంబంధం, కర్మఫల సంయోగం మనకు ఉండవో అప్పుడే మనం ముక్తులమై పరమేశ్వరుణ్ని చేరుకోగలుగుతాం.
ఆచార్య
మసనచెన్నప్ప